Aprasyulu - 10 books and stories free download online pdf in Telugu

అప్రాశ్యులు - 10

అప్రాశ్యులు

భీమేశ్వర చల్లా (సి.బి.రావు)

10

మరునాడు స్టేషన్ లో అందరు రజనికి వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. రామం, విశాల, డాక్టర్ సనల్, కమల, కమలాకరం, ప్రసాద్, చంద్రిక అందరు వచ్చారు. ప్రసాద్ క్రితం రాత్రి ఢిల్లీ తిరిగి వచ్చాడు.

న్యూఢిల్లీ ప్లాటుఫారంమీద అందరు నిలబడి వున్నారు. ప్రసాద్ రజనితో “నాకు స్టేషన్ కి వచ్చి వీడ్కోలు చెప్పడం చేతిరుమాళ్ళు వూపడం ఇలాంటి పనులంటే ఇష్టం లేదు. రజనీ, అయినా నీ విషయంలో ఇన్స్పెక్షన్ చేసేను” అన్నాడు.

“అది మీ బలహీనత. నాయెడ గౌరవ సూచనమని నేను గర్వపడను” అంది రజని.

“అది నాకు తెలుసును రజనీ, కాని నాకు ఇది గర్వ కారణమే” అన్నాడు ప్రసాదు.

కమల కమలాకరం కాస్త దూరంగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. స్టేషన్ లో చాలా జనసమర్థంగా వుంది. చంద్రిక, విశాల, డాక్టర్, వృద్ధ దంపతులతో కబుర్లు చెప్పుతున్నారు. రైలు ప్లాటుఫారం మీదికి వచ్చే వేళయింది.

ప్రసాదు అక్కడకు వచ్చిన వద్ద నుంచీ కమలతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు, ముభావంగా ముడి మాటలు మాట్లాడి మౌనం వహించింది.

ప్రసాద్ నవ్వుతూ“కమలాకరం మా అన్యోన్యతను పదర్శించే తరుణం ఇది కాదోయి... ఇది రైల్వే ప్లాటు ఫారం?అన్నాడు.

కమల ముఖం కోపంతో ఎర్రపడింది. కమలాకరం నవ్వుతూ “అన్యోన్యతకి, ఆదర్శానికి సమయాసమములు వుండవని ప్రదర్శనకి పరిమితులు ప్రయత్నపూర్వకంగా లభిస్తాయని రజని అంటుంది. కాని నేను ఒప్పుకోను” అన్నాడు.

“అయితే రజనిని మనస్సులో వుంచుకొని కమలతో కబుర్లు చెప్పుతున్నావా? కమలాకరం. కమల కది కఠిన శిక్ష” అన్నాడు ప్రసాదు.

కమల ముఖం సిగ్గుతో క్రుంగిపోయింది. ఇంతమంది ఎదుట అలాంటి పరిస్థితిలో అలాంటి మాటలు ఆమెకు రుచించలేదు. కానీ విచిత్ర విషయమేమిటంటే మామూలులాగా ఆమె కోపగించలేదు.

కమలాకరం భార్య పరిస్థితిని గమనించి నవ్వుతూ, “ఇది అన్యోన్యతని అర్థం చేసుకోలేని వారమనే మాటలు ప్రసాదు. ఈ విషయంలో రజని నీకు పాఠాలుచెప్పలేనట్లుంది” అన్నాడు.

ప్రసాదేదో సమాధానం చెప్పబోతూంటే చంద్రిక “నువ్వు పూరుకో మామయ్య, మీరు ఎప్పుడు అనవసరంగా వాదించుకుంటునే వుంటారు. రజని పిన్ని వెళ్ళిపోతుందనే దుఃఖం కూడా లేదు. మీకెవరకు” అంది.

“నన్ను కూడా వారితో జతపర్చకు చంద్రికా, ఇందాకటనుంచి నిశ్శబ్దంగా నేను నిరసన తెలియజేస్తున్నాను. అంది కమల.

రైలు ప్లాటుఫారం మీదికి నెమ్మదిగా వచ్చింది. స్టేషనంతా అల్లకల్లోలమయిపోయింది. రైలు నిలవకుండానే జనమంతా పరుగెత్తారు. కొంతమంది అతిచాకచక్యంతో లోనికి దుమికారు. జనసమర్థంలో ఒక యువకుడు రజనీని రాచుకొని వెళ్ళిపోయి “సారీ” అన్నాడు.

రజనీ నవ్వుతూ రామాని కేసి చూసింది. రామం అప్పటి వరకు రజని కేసి తదేకంగా చూస్తున్నాడు. రజని నేత్రాలు తన నేత్రాలను కలుసుకునేటప్పటికి కంగారుగా దృష్టి మరల్చాడు. అతను అంతవరకు గమనించిన దేమిటంటే రజని ముఖాన ఆనాడు కూడా బొట్టు లేదు. పైగా తెల్లటి చీర కూడా ధరించింది. సాధారణంగా రెండు జడలు వేసుకునే అలవాటు ఆమెది. కానీ ఆనాడు అతి సాధారణంగా జుట్టు సిగ చుట్టింది. కానీ ఈ విషయాలను ఇంకెవరు గుర్తించలేదు. రజనీకి తెల్లటి చీరలంటే ఆప్యాయత ఆనీ, అందరికును తెలుసును.విశాలకు తప్ప మిగతా వారికి వినోదు మరణ సమయంలో రజని అనిన మాటలు తెలియవు అందుకనే రజని రూపం ఎవరికి అనుమానం కలిగించ లేదు. విశాల చూచాయగా గ్రహించింది. కానీ రజని ఆమెతో ఏమి చెప్ప లేదు .

విశాల రజనిని కాస్త బయటకు లాగి, నెమ్మదిగా “'రజనీ' నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోతున్నావు. అందుకు నేనేమి అనను. కాని వొక వ్యక్తి మరణంతో నీ కెక్కడా స్థానం లేదనుకోకు, అది మాఅందరికి అన్యాయం చెయ్యడమే కాదు, నీ గతాన్ని నీవు విస్మరించటం అవుతుంది.”

“ఆలాంటి భయమేమి లేదు విశాలా? గతాన్ని విస్మరించాలనే కోరిక నాలో లేదు. అంతా మధురస్మృతి కాక పోవచ్చు. కాని అంతా వొక విచారఘట్టం కూడా కాదు” అంది.

రజనితో ఏకాంతంగా మాట్లాడాలనే వాంఛ రామంలో రగుల్కొనివుంది. అవకాశంలేక అభిమానంతో అశాంతితో నిలబడి వున్నాడు, సమయం మించిపోతుందనే అమిత భయం వేసి అదే సమయమని, రజని దగ్గరకు వచ్చి “మీరు చెప్పవలసిందేమి లేదా రామంబాబు” అంది. రామం అసభ్యంగా “రజనీ నేను నీతో మాట్లాడాలి” అన్నాడు. కంఠస్వరంలో స్పష్టంగా జీరవుంది. బరువైన హృదయంతో రజని తనను నిర్లక్ష్యం చేస్తోందనే కోపంతో అనిన మాటలిని.

రజనీ నవ్వుతూ “మాట్లాడండి! రాంబాబు ఇందాకట నుంచి మీరే మౌనం వహించేరు?”అంది.

రజనీతో మాట్లాడాలనే తీక్షమైన కోరిక కలిగింది. కాని సమయానికి ఏమి మాట్లాడాలో వెంటనే స్ఫురణకు రాలేదు. రజని కేసి తీక్షణంగా చూస్తూ, “సహనం నాలో చాలా తక్కువని నీకు తెలుసు రజని, నువ్వు దానికి కఠినమయిన శిక్షకు గురిచేసావంటే ఫలితం నేనూహించ లేను”అన్నాడు.

రజని అప్యాయంగా “ఇంత వయసు వచ్చినా మీ హృదయం ఎందుకో లేత స్థితిలో వుండిపోయుంది రామంబాబూ. ఈ ప్రపంచంలో అలా జీవించేరంటే అడుగడునామీకు ఆశాభంగమే ఎదురవుతుంది. అది జరుగకుండానే దానిని గట్టి చేద్దామని ప్రయత్నిస్తున్నాను” అంది.

“నువ్వు ఏం చేసినా సహిస్తాను కాని, నాకు దూరం కావడం సహించలేను రజనీ!”.

“ఇది అనర్ధానికే దారితీస్తుంది రాంబాబు' అని రజని ఏదో అనబోతూంటే రామం అడ్డువచ్చాడు. “అదిసరే రజనీనువ్వు ఉత్తరాలు వ్రాస్తూంటానని నాకు మాటయియ్యి. లేకపోతే నీ ఎడబాటు సహించలేను” అన్నాడు.

“ఎందుకు వ్రాయను రామంబాబూ! తప్పక వ్రాస్తూంటాను. కాని ప్రేమ లేఖలు నేను వ్రాయను. అవి మీరు ఆశించవద్దు, మీరు ఏమి వ్రాయాలో వ్రాయవద్దు. అజ్ఞాపించే అధికారం మీకు లేదు” అంది.

రైలు కదలబోయే సమయం ఆసన్నమైంది. రజనీ అందరివద్ద వీడ్కోలు తీసుకుంది, చంద్రిక రజనితో “క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా” అంది. అందరు ఫక్కున నవ్వారు రజని రామందగ్గరకు వచ్చి “రామం బాబూ! తిరిగి ఎప్పుడు కలుసుకుందాము?” అంది నవ్వుతూ.

రజని కలకత్తా వెళ్ళి నెలరోజులు గడిచిపోయాయి. ఒక వ్యక్తి జీవితంలో ఇది ఎంతో అల్పమది, సంవత్సరాల కొలదీ శరవేగంతో మాయమవుతుంటాయి. వెనక చూపు చూచి అప్పుడప్పుడు మనం ఆశ్చర్య పోతూంటాము. అరె ఎంత త్వరగా గడిచిపోయాయి అని అనుకుంటాము. కాని అప్పుడప్పుడు దినాలు యుగాలుగా గడుస్తూంటాయి. ఎంత ప్రయత్నించినా కాలంగడవదు. విసిగి, వేసారి మాటిమాటికి ఎదురుగా కనబడే కేలండరు కేసి చిరుకోపంతో చూస్తూంటాము, అప్పుడు గడియారపుగంటలే శ్రావ్యంగా వినబడతాయి. గజగమనంతో తిరిగే చిన్నముల్లు మనకు చిరాకు కలిగిస్తుంది. కాని ఇది గమ్యస్థానమనే సుదినపు సూర్యోదయంకోసం ఎదురు చూసేవారికే వర్తిస్తుంది. వారే ఎదురు చూస్తూవుంటారు. శూన్యమయిన భవిష్యత్తుల వారికి గమనంతో నిమిత్తం లేదు. రామం రెండవ తరగతికి చెందిన వ్యక్తి. రజని ఎప్పుడు తిరిగిస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. రజని వెళ్ళిన మరుసటి దినం నుంచి ఆమె వద్దనుంచి జాబు వస్తుందేమోనని ఎదురు చూడసాగాడు. కలకత్తానుంచి వచ్చే ఉత్తరాలు మామూలుగా వుదయాన తొమ్మదిన్నరగంటలకి పోస్టుమెన్ఇవ్వడం అలవాటు. సరిగ్గా అదేసమయానికి రామం ఆఫీసుకి వెళ్ళవలసిన సమయం. రజని వద్దనుంచి ఉత్తరం వస్తుందనే ఆశతో ప్రతిరోజూ పోస్టుమెన్ వచ్చేవరకు ఎదురుచూస్తూ ఆఫీసుకి వెళ్లేవాడు. రెండు మూడు రోజులతర్వాత ఆఫీసులో చివాట్లు ప్రారంభమయినాయి. అయినా రోజూ ఆలస్యంగా వెళ్ళేవాడు. పోస్టుమెన్ వెళ్ళిన తరువాత అతనిని ఆవహించే నిరుత్సాహానికి, దుఃఖానికి, కోపానికి అంతులేదు. రజనికి వుత్తరం వాద్దామంటే అమె అడ్రస్ తెలియదు. ఈవిధంగా రెండు వారాలు గడిచి పోయాయి, విశాలకేమయినా కబురు తెలిసిందేమోనని ఆమె వద్దకు ఆ సాయంకాలం ప్రయాణమయ్యాడు. తీరా అక్కడకు వెళ్ళేసరికి డాక్టర్ సనల్ విశాల కలసి షికారు వెళ్ళారనీ అక్కడ వారు చెప్పారు. ఏమి చెయ్యటమా అని క్షణకాలం ఆలోచించి చివరకు వారిని వెదుకుతూ వెళ్ళాడు. దగ్గరలోనే కూర్చొని వారిద్దరు కబుర్లు చెప్పుకొంటున్నారు. రామాన్ని హఠాత్తుగాచూచి విశాల ఎందుకో చాలా సిగ్గుపడింది. ముఖం ఎర్రబడింది. అదే అతనికి ఆశ్చర్యం కలిగించింది. వారిద్దరి సంభాషణకి అంతరాయం కలిగించానేమోనని అనుమాన పడ్డాడు. డాక్టర్ సనల్ తో అట్టేఎక్కువ పరిచయం లేదు.

కంగారుపడుతూ “క్షమించు విశాలా! ఒక విషయం అడగటానికి వచ్చా” నన్నాడు.

విశాల సహజమైన మధుర స్వరంతో మందహాసం చేస్తూ “కూర్చోండి రామంబాబు. నేను చెప్పవలసినది కూడా ఇంకొక విషయం వుంది” అంది.

రామం అక్కడే కూర్చుని కొంచెం సిగ్గుపడుతూ “రజని వద్ద నుంచి ఏదైనా ఉత్తరంవచ్చిందా?” అన్నాడు.

“వెళ్ళిన వెంటనే ఉత్తరం వ్రాసింది రాంబాబు” అంది.

రామం మనస్సు చివుక్కుమంది. విశాలకీవ్రాసి తనకు వ్రాయలేదు. స్త్రీలంతా యింతేప్రేమించిన వారిని చులకన చేసి ఇతరుల ముందు చిన్న చూపు చూస్తారు.

కాంతివిహీనమైన వాని ముఖం చూసి విశాల” మీకు వ్రాయలేదా రామంబాబు'' అంది.

“వ్రాయలేదు విశాలా! వ్రాస్తే ఇక్కడకు ఎందుకు వస్తాను” అన్నాడు.

“అందుకోసమే రానవసరం లేదు రామంబాబు. నేనేమీ మీకు పరాయి దానను కాను. నన్ను చూడటానికి రావచ్చుగా?” అంది.

“పరాయిదానవని నేననటం లేదు విశాలా! కాని నాకంటే ఆప్తులని ఎవరిని అనుకొంటున్నానో వారే. నన్ను పరాయివారిగా భావిస్తున్నారు” అన్నాడు.

ఆమె అతని మాటలను అర్థం చేసుకొంది. మనస్సులో భావం గ్రహించి మందహాసం చేస్తూ “ఎవరు ఆప్తులో, ఎవరు పరాయివారో చేష్టలను బట్టి చెప్పలేము రామం బాబు. నాకిది చెప్పండి, డాక్టర్ సనల్ నాకు ఆప్తులో, లేక పరాయివారా” అంది.

తన పేరు విని ఇందాకటినుంచి మౌనం వహించిన డాక్టర్ మేల్కొని “అన్యాయం విశాలా! నా యెదుట నాకు తెలియనిభాషలో నామీద అభాండాలు వేస్తున్నావా?” అన్నాడు నవ్వుతూ.

“అభాండాలు వెయ్యటం లేదు డాక్టర్ ! మీరు నాకుఆప్తులా, పరాయివారా? అని రామం బాబుని అడుగుతున్నాను” అన్నది

“ఇప్పుడు కేవలం ఆప్తుడ్ని విశాలా! తర్వాత ఏమిటో చెప్పలే” నన్నాడు సనల్.

రామం ఆమాటలని అట్టే పట్టించుకోలేదు. మనసంతా రజనిమీద లగ్నమైవుంది. ఆ మాటలు విశాలకు లజ్జారాగరంజితని చేసాయి.

“నాతో ఒక విషయం చెపుదామనుకుంటున్నా అన్నావేమిటది విశాల?” అన్నాడు రామం.

హఠాత్తుగా విశాల ముఖం మేఘావృతమైంది. వేదనాపూరిత కంఠస్వరంతో “నా భర్తనుంచి నాకు జాబు వచ్చింది రామం బాబూ!” అంది నెమ్మదిగా.

రామం అమితాశ్చర్యంతో “నీ భర్తవద్దనుంచా ? ఏమని వ్రాసేరు? అసలు ఆయన నువ్విక్కడున్నట్లు ఎలా తెలిసింది?" అన్నాడు.

“కాశీ అడ్రసుకి వ్రాసేరు. అక్కడ వారు రజని అడ్రస్సుకి పంపించారు. అది రజనికి కలకత్తా పంపించాను. అక్కణ్నుంచి ఆమె ఇక్కడకు పంపించింది” అంది.

“అయితే అందులో ఏమని వ్రాసారు. విశాలా! అన్నాడు .

“వారి వద్దకు వచ్చి కాపురం చెయ్యాలిట. అలా చెయ్యకపోతే నన్ను కోర్టుకు యిడ్చి విడాకులిస్తారట.”

రామం క్షణం మౌనంవహించి వేదనాపూరిత కంఠస్వరంతో “ఏమయినా నిశ్చయానికి వచ్చావా విశాలా?” అన్నాడు.

“వచ్చాను రామం బాబూ! ఒకప్పుడు కోర్టు కెక్కడమంటేభయపడేదాన్ని, దానికి కారణం మా నాన్నగారికి బాధకలుగుతుందని, కానీ ఇప్పుడు నాకేమి భయము లేదు. కోర్టు కెక్కుతాను. నాపై వేసే అభాండాలను నేను ప్రతిఘటిస్తాను” అంది.

“నీ నిర్ణయం క్లిష్టమైనదయినా సరియైనదనే నా ఉద్దేశం విశాలా! రజని ఉద్దేశమేవిటి?” అన్నాడు.

“నిర్ణయించవలసింది నువ్వేవిశాలా! కాని నిర్ణయించే ముందు ఒక విషయాన్ని గుర్తుంచుకో కర్తవ్యమనేది ఏనాడో మెళ్ళో మూడుముడులు వేసి, మానసికంగా త్రుంచివేసింది. భర్త యెడమాత్రమే కాదు. ఆ బంధనకన్నా విలునైన బంధనలు జీవితంలో వుండటం ఎంతో సహజం, దుర్వినియోగం చేయబడిన అధికారానికి తలవొగ్గటం ఆత్మవంచనతో సమానము” అనివ్రాసింది. డాక్టర్ సనల్ నడిగాను. నా సలహా స్వలాభంతో కూడినదయివుంటుంది విశాలా! నన్ను అడగడమే అన్యాయం అన్నాడు” అన్నది.

“నీ నిర్ణయాన్ని వారికి తెలియజేసావా విశాలా? అన్నాడు రామం.

“లేదు రామం బాబు! ఈ రాత్రేవ్రాయటానికి నిశ్చయించుకొన్నాను. మీ సలహాకూడా లభించింది. ఇక నా నిశ్చయం నిశ్చలమైనది” అంది.

రజని అడ్రస్ తీసుకొని రామం ఇంటికి తిరిగివచ్చాడు. తలుపు తెరువబడిన వెంటనే కాలికి ఏదో కాగితం తగిలింది. లైటు వేసి చూస్తే అదో ఉత్తరం దస్తూరీ చూచిన వెంటనే అది రజని ఉత్తరమని గుర్తు పట్టగలిగాడు.

వణుకుతున్న చేతులతో వుత్తరం చించి చదవటం ప్రారంభించాడు. “రామం బాబూ! కోపంలో ఉత్తరం సరిగా చదవటం మానెయ్యకండి. ఎంతో కష్టపడి ఇది వ్రాస్తున్నాను. అన్యాయంగా అమాయకమైన ఈ కాగితంపైన కక్ష తీర్చుకోకండి. అయినా మీకు కోపం రావడం ఎంత సేపు అంది. నేను ప్రపంచంతో దేనికి భయపడననే గర్వం నాలో చిన్నతనంనుంచి వుంది. దాన్ని కొంత వరకు మీరు అణచి వేసారు. మీతో కోపానికి నేను అప్పుడప్పుడు భయపడుతూంటాను. కారణమేమంటే అది కల్మషం లేని కోపం. అది అందర్ని నిరాయుధుల్ని చేస్తుంది.

ఇక్కడకు వచ్చినప్పటి నుంచి మీకు వుత్తరం వ్రాద్దామని రాత్రి పదకొండుగంటలకి కలము, కాగితము పట్టుకోని కూర్చునేదాన్ని. పరిపరివిధాల మనస్సులోని ఆలోచనలో గాని, సరిగా కలం కాగితం మీద పెట్టే సమయానికి నిద్రాదేవత - ఎంత సాహసం నన్నే ప్రతిఘటిస్తావా రాక్షసి ! అని తన శక్తినంతా వుపయోగించి నన్ను నిస్సహాయురాలను చేసేది. కలం చేత పట్టుకొనే నిద్రపోయేదాన్ని అంటే మీరు అడుగుతారు,“రజనీ! అంతదూరంనుంచి కూడా నన్ను మోసగించాలని చూస్తున్నావా!” అని అంటారు. మీకు ఉత్తరం వ్రాయడము రెండు నిమిషాలు కాదు. అలాటివి వ్రాయటము నా కిష్టము లేదు. మీలో ప్రత్యేకత వుంది. ప్రత్యేకపు వుత్తరమే మీకు వ్రాయాలి. అంత వ్యవధి నాకు నిజంగా పదకొండు గంటలదాకా చిక్కదు. కారణము చెప్పటానికి నా మనస్సులో సందిగ్ధంలో పడ్డాను. ఆయినా చెప్తాను. లేకపోతే కోపగిస్తారు. ఇక్కడికి వచ్చిన మరుసటిరోజుల్లోనూ ఒకరి తరువాత ఒకరు వృద్ధదంపతులు మంచమెక్కారు. పుత్ర శోకం వారి పునాదుల్నే కలిపి వేసింది. హృదయాలు వ్రక్కలయిపోయాయి, ఎంత సేపూ వినోద్ ని తలచుకోవడము పసి పాపలలా విలపించడము, నిద్రాహారాలు దాదాపు మానేసారు. అలాంటి పరిస్థితిలో ఆరోగ్యంగా ఎలావుంటారు? నాకు చేతనయినంత ప్రయత్నించి ఊరడించడానికి ప్రయత్నించాను. కాని ఫలితము లభించలేదు. ఇద్దరు మంచమెక్కారు. ఇక నాకు చేతినిండా పని లభించినది. నాకు రోగుల పరిచర్య చేయడమనేది పుట్టుకతో వచ్చినవిద్య. కాని ఇద్దరు వృద్ధులకు చెయ్యడమంటే నాకు కష్టంగానే వుండేది. ఒక నర్సుని కుదిర్చాను కాని ఇద్దరు కూడా ఆమెని దగ్గరకు రానీయరు. నన్ను బహురాణి అని పిలుస్తారు. మొదటిలో ఆ పిలుపు నాకేమాత్రము నచ్చేది కాదు. కాస్త కర్ణ కఠోరంగా వుండేది, కాని వారు వృద్ధులు - రోగులు, వారిని కష్ట పెట్టేకన్న అవి సహించడమే వుత్తమమనిపించింది. అయినా పిలుపులో ఏముంది చెప్పండి మీరు నన్ను రజనీ అని పిలిచినా, రాక్షసి అని పిలిచినా నేను పలుకుతాను. నిజం చెప్పాలంటే రాక్షసి అనే పేరు నాకు నచ్చుతుంది. రాక్షసి అని పిలుస్తూంటే ఎంత మృదువుగా, కోమలంగా వుంటుంది. ఇక ఇప్పటినుంచి అలాగే పిలవండి. వారికిప్పుడు కాస్త నయమైనది. ప్రస్తుతం ప్రమాదమేమీ లేదని డాక్టరు చెప్పారు. అందుకనే ఈ రాత్రిపదిగంటకే తీరుబడిగా కూర్చుని మీకు ఈ లేఖ వాస్తున్నాను. కళ్ళల్లో జ్యోతులు వెలిగించుకొని వున్నాను. ఎదురుగుండా వున్న ఆ పెద్ద ఆద్దంలో నారూపం నాకే ఆశ్చర్యం కలిగిస్తోన్నది. ఇంకా తెల్లటిచీరలు కడుతున్నాను .

విశాలమీకు చెప్పేవుంటుంది. ఆమె భర్త వుత్తరం గురించి. ఆమె ఏ నిశ్చయనికి వచ్చింది? ఆత్మాభిమానం గల స్త్రీ అయితే ఆమెకొకే ఒక మార్గం మిగిలివుంది. జీవితంలో ఆమె మొట్టమొదటిసారిగా సుఖాన్ని రుచి చూడకోరుతున్నది. ఇంతదూరంనుంచి కూడా అది నేను పసికట్టాను. ఇక్కడికి రాక మునుపే నేను ఇది ఊహించాను. ఈ తరుణములో ఇలాంటి అనర్థకంగా సంచరించడం నిజంగా ఆమె దురదృష్టమే. నిజానికి ఆమెకు అతను విడాకులిస్తేనే ఎంతో మంచిది. ఎప్పుడో ఆమే తనంతట తానే ఇచ్చి వుండవలసింది అలా చేస్తే ఆమె కేదో కష్టం కలుగుతుందని, సంఘంలో పరువు పోతుందనే అభిప్రాయంతో ఆలా బెదరించారు. కాని నిజనికి అతను ఆమెకెంతో మేలు చేస్తున్నాడు కాని నన్ను భయపెట్టేది ఒకే ఒక విషయం. విశాల మనస్సులో ఎవరికి హానికాని, కీడు కాని తలపెట్టలేదు. ఆమె హృదయమే అలా నిర్మింపబడింది. ఆవిధంగానే ఆమె ఇరుతలు కూడా వుంటారనే భ్రమ పడుతూ వుంటుంది. తన భర్త తన యెడ యెంత ప్రేమతో పశ్చాత్తాపపడి తిరిగి రమ్మన్నాడని అమె అపోహపడుతుందేమో?మీ మాటలకి విశాల విలువయిస్తుంది. మీరు కూడా చెప్పిచూడండి.

అప్పుడే నిద్రముంచుకొస్తుంది. వ్రాయవలసింది కూడా ఏమి కనబడటం లేదు. జవాబు వ్రాస్తారు కదూ? కాని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ప్రేమ లేఖలు రాయకండి. నీ వుత్తరముకోసం స్వాతివానకు ఎదురు చూసే ముత్యపు చిప్పలా ఎదురు చూస్తున్నాను. నీకోసం నిద్రహారాలు మాని పరితపిస్తాను. నాలోని అణువణువు నీ నామమే వుచ్చరిస్తాయి. నా నవనాడులు నీకోసమే ఘోషిస్తాయి. అని ఈవిధంగా ఉత్తరము వ్రాయకండి. అదంతా బూటకమని నేననను . మీ నిజపరిస్థితి మీకంటే నాకెక్కువ తెలుసు. అదంతా మీరువ్రాయనక్కరలేదు, వ్రాసినా ప్రయోజనం లేదు. జీవితంలో విలువయిన వస్తువులన్నీ వుచితంగా లభిస్తాయని ఎవరో ఇంగ్లీష్ కవులన్నారు. ఆ సూత్రం ఇక్కడే వర్తిస్తుంది. విలువైన ప్రేమ ఉచితంగా లభిస్తుంది. దాని కోసం మీ ఈ ప్రేమ లేఖలు వ్రాయనవసరం లేదు.”

ఆ రాక్షసి ఉత్తరం పట్టుకొని రామం అలాగే స్థబ్దుడై కూర్చునిపోయాడు. ఈ స్త్రీ హృదయంలో అనుభూతికి ఆస్కారము లేదా? యంత్రంలాగ ఎప్పుడు విరామం లేకుండా పని చేస్తుంది. జీవితంలో ఏ ఒక వ్యక్తికీ ఇతరులకోసం కష్టపడవలసిన బాధ్య లేదంటుంది. ఇది నా విథి, నా కర్తవ్యం అని ఎవరు ఏమి చెయ్యనవసరం లేదంటుంది. అయితే ఈమె ఎందుకిలా పరుల కోసం సుఖాన్ని త్యజించి కష్టపడుతూంటుంది? మనమంతా ఏదో అస్పష్టమైన కర్తవ్యం నిర్వహిస్తున్నామని పొంగిపోతూంటాము, చేష్టల రూపములో చేసేది ఛాలా తక్కువ, కాని ఈమె సంగతి వేరు. ఆమె స్వభావమే అంత. హృదయ పూర్వకముగా ప్రతిఫలాపేక్ష లేకుండా పని చేస్తుంది.

ఆ వెంటనే కాగితము, కలము తీసుకొని జవాబు వ్రాయ ప్రారంభించాడు.

రజనీ!

రాక్షసి అని నన్ను పిలువమన్నావు.ఆ శబ్దాన్ని నాలుగైదుసార్లు బయటకు వుచ్చరించాను. మృదువుగా కోమలంగా వుంటుందన్నావు. నాఎదుట నిలబడనప్పుడు నేనెలా వుచ్చరిస్తాను. అప్పటి వరకు రజనీ అని సంబోధించనీ?

నేను వుత్తరం వ్రాయుమునుపే నువ్వు నన్ను నిస్సహాయుని చేసావు.రైలు కదలబోయే ముందు నువ్వు నాకు ప్రేమలేఖలు వ్రాయవద్దన్నప్పుడుకాస్త బాధపడ్డాను. “కాని తరువాత నాకు నేను నచ్చ చెప్పుకున్నాను. వ్రాయదలచుకున్న దంతా వ్రాసి చివరకు ఇది ప్రేమ లేఖకాదు అని వ్రాద్దామనుకున్నాను, కాని సరిగా నేను ఏది వ్రాద్దామనుకున్నానో అదే వ్రాయవద్దని నీవుత్తరంలో శాసించేవు. ఇక నేనేం చేస్తాను. నాకోపం నిన్ను నిస్సహాయుని చేస్తందన్నావు నీవుత్తరమే నన్ను అస్తరహితుని చేసింది. ఇక ప్రతిఘటన ప్రసక్తి లేదు.

నా గురించి నాకన్న నీకే ఎక్కువ తెలుసన్నావు. ఇది పరమ సత్యమే. అగల్భమో నేను చెప్పలేను. కాని మాటలు ఆశాశ్వతంగా నీవేవ్రాసేవు. అది నిజమని నమ్ముతాను. ఆ ఆశతోనే నీకోసం నిరీక్షిస్తాను. విశాల నీసలహానే అనుసరించ నిశ్చయించింది. ఆమెవంటి వుత్తమ స్త్రీ భర్త విసర్జిత అనితలచుకుంటూంటే పురుషుడనయినందుకు నేను సిగ్గుతో, అవమానంతో దహించుకుపోతున్నాను. విశాలను చూచి యిప్పుడే తిరిగివచ్చాను. ఆమెను చూచిన కొలదీ ఆమెలోని నిశ్చలత్వము, నిష్కలంకయు నన్ను ముగ్దున్ని చేస్తున్నాయి.వ్రాయదలచుకున్నదంతా వ్రాయకుండా వుత్తరం ముగిస్తున్నాను, కాని ఒక విషయం చెప్పకుండా నన్ను నేను నిబ్బరించుకోలేకపోతున్నాను. నాస్మృతి పధంలో మిగిలింది రజనీ రూపం మాత్రమే. నేను నిన్ను చూచేవరకు నేను జీవచ్ఛవాన్నే- రామం

విశాలకు డాక్టరు సనల్ కు గల పరిచయం దినదినాభివృద్ధి పొందింది. విశాలకు విడాకులివ్వబడ్డాయి. చట్టరీత్యా కూడా ఆమెకేమియిక బంధనాలు లేవు. బాహ్యంగా ఆమె అంగీకరించకపోయినా మానసికంగా ఆమె ఎంతో తేలికపడింది. ఇక ఆమె భవిష్యత్తు ఆమె యిష్టానుసారం దిద్దుకోవచ్చు. మాటి మాటికి, బొంబాయివైపు భయం భయంగా చూడనవసరం లేదు. ఇక భవిష్యత్ జీవితమంతా అక్కడే గడపడానికి నిశ్చయించుకుంది.రాత్రింబవళ్ళు విరామం లేకుండా ఆమె ఆ అనాధ బాలురను సహృదయుల చేసే ప్రయత్నంలో గడపసాగింది.సనల్ పరిచయమయిన దగ్గరనుంచే రహస్యంగా ఆమెలో కోరికలు తిరిగి మొలకలెత్తాయి. మొదటిలో ఆమె వాటిని అణచి వెయ్యిడానికి విశ్వ ప్రయత్నం చేసింది. కాని ప్రకృతిని ఆమె జయించలేకపోయింది. ఒక స్త్రీ, ఒక పురుషుడు ఒకే ఆశయంతో ఒకేచోట రాత్రింబవళ్ళు చేదోడు వాదోడుగా చాలాకాలం సంచరిస్తుంటే ప్రకృతి చూస్తూ వూరుకోదు, వారి హృదయాల్లో అనురాగపు బీజాలను నాటుతుంది. స్త్రీపురుషులకు మధ్య ఆకర్షణ సహజమైనది కాదు. అది సృష్టికే మూలకారణం అంటుంది రజని. విశాల తన హృదయ పరిస్థితిని అర్ధం చేసుకున్నప్పటి నుంచి సనల్ పట్ల కాస్త ముభావంగా సంచరించడం మొదలు పెట్టింది. ప్రతి రోజూ సాయంత్రం ఇరువురు కలసి షికారుకి వెళ్ళడం వారికి అలవాటయిపోయింది. కాని కొన్ని రోజులనుంచీ విశాల ఏదోవంక పెట్టి తప్పించుకుంటూ వచ్చింది. ఒంట్లో బాగుండటం లేదు విశ్రాంతి తీసుకుంటాననేది .

******