Aprasyulu - 5 books and stories free download online pdf in Telugu

అప్రాశ్యులు - 5

అప్రాశ్యులు

భీమేశ్వర చల్లా (సి.బి.రావు)

5

ప్రసాద్ హాస్పటల్లో పదిహేను రోజులు ఉండవలసి వచ్చింది. రజని సేవ, శరీర తత్వము త్వరలోనే స్వస్థునిచేసాయి. మొదటిలో రజని రాత్రింబవళ్బు రోగితోవుండేది. రోగికి కావలసినవన్నీ ఆమె యితరులు చెప్పకుండా చేసివుంచి క్రియారూపేణా పెట్టేది. రజనితత్వం పూర్తిగా తెలిసిన ప్రసాద్ కి అది చాలా ఆశ్చర్యము వేసేది. నిపుణతతో, దృఢత్వము, మృదుత్వము మిళితమైన ఆమె పరిచర్యలకు అతనే ఎంతో విస్తుపోయి వొక రోజున “ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు రజని!” అన్నాడు.

“వ్యాధిగ్రస్తులకు సేవ చేయడం నాకు చిన్నతనం నుంచి అలవాటే ప్రసాద్. మావయ్య మొదటి నుంచి రోగిష్టి. ఎప్పుడూ నేనే కనిపెట్టి వుండేదాన్ని”అంది.

ప్రసాద్ “నువ్వే యిలా సేవ చేయకపోతే నేనేమై పోయేవాడిని రజని” అన్నాడు.

నవ్వుతూ “నీ నోటివెంట ఆ మాటలు చాలా కృత్రిమంగా కనబడుతున్నాయి, నేనేమి కమలనుకాను ప్రసాదు వాటిని విని మోసపోవడానికి” అంది.

“నేను నిజంగా కమలని మోసపుచ్చానని భావిస్తున్నావా అన్నాడు.

“ఫలితం గురించి నేనేమీ మాట్లాడలేదు. ప్రయత్నం గురించిమాత్రమే" అంది.

“నన్ను బాగా అర్ధం చేసుకున్నావనుకున్న నువ్వుకూడ నాకన్యాయం చేస్తున్నావు రజని, అలాంటి మాటలు ఎలా అనగల్గుతున్నావు! నిజంగా నీకు నీకు ద్రోహంతలపెడ్తాననుకున్నావా!'' అన్నాడు.

రజని పక పక నవ్వుతూ “ఇన్నాళ్ళకు నీ నోటి వెంట యిలాంటి మాటలు వినే దురదృష్టం కలిగింది. నీమీద నాకు మిగిలిన ప్రేమానురాగాలలో సగం సర్వనాశనమయి పోయాయి. కమల గురించి కలలుకంటూ, రజనివద్ద రహస్యాలు వెల్లడి చేస్తున్నావు. ప్రసాద్ ఇప్పటికయినా మేలుకో” అంది.

ప్రక్కనే కూర్చునివున్న రజనిని హఠాత్తుగా వుద్రేకంతో తన వక్షస్థలం మీదికి లాక్కుని “నీమీద నాకు ప్రేమ నశించిందంటే నేను నమ్మను రజని. అది లేకపోతే నువ్వు నా మీదంత శ్రద్ధాసక్తులతో ఎందుకు సేవ చేస్తావు?” అన్నాడు.

రజని క్షణకాలం మాత్రమే ప్రసాద్ కౌగిలిలో యిమిడివుంది. నెమ్మదిగా పట్టు విడిపించుకుని “నువ్వే కాదు ప్రసాద్, ఆప్తులెవరయినావుంటే ఈవిధంగానే చేద్దును. అయినా మన యిద్దరి మధ్య వున్న బంధం, ఆంగీకారం. యింకాతెగిపోలేదు. అంతవరకు నా ధర్మం యిదే. నీకు స్వస్థత చిక్కినవెంటనే తెగతెంపులు చేసుకొని నిన్ను వదలి వెళ్ళిపోతాను” అంది. మాటలు ఎంతో సహజంగా, మృదువుగా వున్నాయి. వాటిల్లో కోపం గానీ, ఏవగింపు కాని ఏమాత్రము లేవు. భయంకరమైన నిశ్చయం కనబడింది. ప్రసాద్ దానికి తిరుగు లేదని గ్రహించి, “దాని కేమైనా ప్రత్యేక కారణముందా రజని! ఇందులో నా దోషమేమైనా వుందా?

“కారణమేమీ అక్కరలేదని మనము మొదటే అనుకున్నాము, ఉన్నా చెప్పవలసిన అవసరంకూడ లేదు. మన యిద్దరికి పూర్వం వున్న భావాలు యిప్పుడు లేవనీ నీకు తెలుసు. నాకు తెలుసు. ఇది చాలా సహజమైనదనీ, సమంజసమనీ నీకు తెలుసు. ఇందులో విచారించవలసినది కూడ ఏమీ లేదు. సహజీవనం తప్ప మిగిలినవి యథాప్రకారంగానే సాగుతాయి. రజని ఎప్పుడూ ఎవరి సొత్తుగా లేదు. యిక ముందుకూడ ఎవరి సొత్తు కాదు?'' అంది గంభీరంగా.

ప్రసాద్ తన జీవితంలో ఒక ఆధ్యాయం ముగిసిపోయిందని ఆఖరికి గ్రహించాడు. మిగిలినదేదో వదులుకుందామని “మన బంధం విడిపోయినంత మాత్రాన నామీద నువ్వు కక్ష పూనుతావా రజని” అన్నాడు.

“ఆలా నేను చెయ్యలేననికూడ నీకు తెలుసు ప్రసాద్, నా చేత చెప్పిద్దామని అడిగావు. అయినా నేను చెప్పుతాను. నీమీదవున్న ప్రేమానురాగాలు నశించిపోయాయి. గౌరవాభిమానాలు కాదు. అవి సకాలం సజీవంగానే వుంటాయి. అంతే ఇక దీని విషయం ఆపి వెయ్యి” అంది.

ఆనాడు హాస్పటల్ నుంచి తిరిగి వచ్చినప్పటినుంచి కమల మనస్సులో బాధపడసాగింది. తన అసభ్య ప్రవర్తనకు ఎంతో నొచ్చుకుంది. ప్రసాద్ వంటి ఆత్నబలంగల వ్యక్తి, తనను చూడడానికని, అంత బాధతో ఈనాడు బయటకు వచ్చి కన్నీరు కార్చిన దృశ్యం ఆమె హృదయంలో హత్తుకు పోయింది.

కన్నీరును అసహ్యించుకొనే అతనుకూడ కన్నీరు కార్చడంతో అతను ఎంత బాధపడ్డాడో ఆమె గ్రహించింది. ఆవ్యాజమైన కరుణ, జాలి ఉప్పెన వలె పొంగిపొర్లే ఆ అభాగిని హృదయంలో, కమలాకరంతో కలసి ఒక రోజున వుదయం ప్రసాద్ ని చూడటానికి బయలు దేరింది. కాని దారిలో కమలాకరం "ఏదో అర్జంటు పనుంది. ఆఫీసుకి త్వరగా వెళ్లాలి నేను సాయత్రం చూస్తాను నువ్వు వెళ్లు.” అని కమలను హాస్పటల్ వద్ద విడిచి వెళ్ళిపోయాడు. కమల “నేను కూడ సాయంకాలమే వెళ్తాను” అంది.

కమలాకరం భార్యను మందలించి ఇంతదూరంవచ్చి వెనుకకు వెళ్ళవలసిన అవసరం యేమిటి! రజనికూడ లోన వుంటుంది. ఆమె రోగిని వదలి ఒక్క క్షణంకూడ వుండదు” అన్నాడు.

అయిష్టంగానే కమల లోనికి వెళ్ళింది. రజని లోపల వుండేటట్లు అనుగ్రహించమని వెయ్యి దేవుళ్ళను ప్రార్థించింది మనస్సులో.కాని ఆమె ప్రార్థన పెడచెవినపడింది. తలుపు తెరచి వుంది. రజని గదిలో లేక పోవడం గమనించి వెనుకకు పోదామనుకొనే సమయంలో ప్రసాద్ ఆమెని చూసాడు, క్షణకాలం దిగ్భ్రాంతుడై పోయాడు. కాని వెంటనే “రా, కమలా! రా” అన్నాడు.

కమల భయవిహ్వలయై లోనికివచ్చి దగ్గరవున్న కుర్చీలో కూర్చుంటూ “నేను కమలాకరం కలిసి వచ్చాము. ఇక్కడకు వచ్చి పనివుందని ఆఫీసుకి వెళ్ళిపోయాడు. రజని యిక్కడ వుంటుందనుకున్నాను” అంది.

ప్రసాద్ నవ్వుతూ “ఈ తడబాటు ఎందుకు కమలా? నువ్వేమి తప్పుపని చెయ్యటం లేదు. నువ్వు యిక్కడకు వచ్చినది నన్ను చూడటానికా లేక రజనిని చూడటానికా?” అన్నాడు.

కమల “రజని కూడ వుంటుందనుకున్నాను. నాకు రాను రాను ఆమెమీద గౌరవాభిమానాలు ఎక్కువవుతున్నాయి. అద్భుత వ్యక్తి విచిత్ర వనిత” అంది అసందర్భంగా.

ప్రసాద్ క్షణకాలం మౌనం వహించి ''కాదని నేననను. కానీ ఆమె అవసరం నాకుతీరిపోయింది కమలా! యింకొకటి అవసరం వచ్చింది” అన్నాడు.

“అవసరం వచ్చినంత మాత్రాన అది తీరుతుందనుకోవడం అవివేకం ప్రసాద్ బాబూ ! వ్యక్తుల దృక్పధాలు వేరైనప్పుడు వ్యక్తుల అభీష్టాలూవేరుగానే వుంటాయి. బాటలు వేరుగానే వుంటాయి, గమ్యస్థానాలు వేరుగానే వుంటాయి” అంది.

“నువ్వు చెప్పింది ఒక విధంగా నిజమేమోనని సందేహము కలుగుతుంది. లేకపోతే నువ్వానాడు నన్ను అలా అవమానించి వుండేదానివి కాదు. పాషాణ హృదయాన్ని పదిల పరుచుకొని కారులో బయట కూర్చునివుండేదానిని కాదు. తోటి మానవుని యెడ నీ కనీసధర్మాన్ని కూడ ఆనాడు నువ్వు మరచిపోయావు కమలా! దానికి నిన్నెన్నడు నేను క్షమించను, ఆ సంఘటన జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా నిన్ను నేను అసహ్యించుకుంటూ వుంటాను” అన్నాడు.ప్రసాద్ “ముఖం క్షణకాలం ఏవగింపుతో నిండిపోయింది.

అది చూసి కమల భరించలేక పోయింది, “మరి మీరు అలా ఎందుకు చేసారు? నామీద కోపం చేతకదా మీరు ఆ అపాయంలో చిక్కుకున్నారు. ఆనాడు మీరు తాజమహల్ వద్ద కనుపించకపోతే నేననుకున్నాను. ఈ విషాద నాటకంలో యిదే నా అంతిమమట్టం. ఈ పాపంకూడ నా మెడకే చుట్టుకుంటుందా? అని. అదృష్టవశాత్తు అలా జరగలేదు. అయినా వొక విధంగా అలా జరిగితేనే మంచిదేమోననిపిస్తు వుంటుంది అప్పుడప్పుడూ, దానికి నేను పరోక్షంగానే బాధ్యురాలిని, నా కర్తవ్యం నేను నెరవేర్చలేనేమోననే భయం తీరిపోయింది. నా హృదయంలో ఈ భరించలేని బరువూ సహించలేని ఈ చిత్రహింస ఆనాటితో అంతమైపోను. బాధాకరమైన స్మృతి ఒక్కటే ఆఖరకు మిగిలేది”అంది.

కమల తన మరణాన్నికాంక్షిస్తోందని విని ప్రసాద్ లోలోన చాలా భయపడ్డాడు, “నీ పాతివత్యానికి నన్ను బలి చేస్తావా కమలా? ఆది మినహా నీకిక జీవితంలో వేరే కర్తవ్యంథర్మమూ లేదా?” అన్నాడు.

“ఉన్నాయో లేవో నాకు తెలియదు. కాని నేను మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నది అదొక్కటే. ఆ ధర్మానికి యితర విధులకీ వైరుధ్యం ఏర్పడితే నేను నా సర్వస్వము వినియోగించి ఆ మొదటి దానినే రక్షించుకుంటాను. ప్రాణప్రదంగా నేను కాపాడుకుంటాను” అంది.

ఆ మాటలు అంటూవుంటే కమల నేత్రాలు ఉజ్వలంగా ప్రకాశించాయి.ఆతీక్షణతని ప్రసాద్ భరించ లేకపోయాడు.

“కమలా! నేను నా జీవితంలో ఇంతవరకు ఓటమిని రుచి చూడలేదు. నన్ను తిరస్కరించిన స్త్రీలు నాకగు పడ లేదు కాని నేను నీ చేతుల్లో ఓడిపోతానేమోనని భయంగా వుంది” అన్నాడు.

కమల ఏదో మాట్లాడుతూ వుంటే లోపలికి ఒక పది మంది యువకులు, వొక యువతి లోనికివచ్చి వినయపూర్వకంగా నమస్కరించారు. యువతి ఎంతో ఆవేదనతోను నమ్రతతోను ముందుకు వచ్చి“మామయ్యా!మీరు ప్రమాదంలోచిక్కుకున్నారని యిప్పుడే మాకు తెలిసింది. అంతా ఎంతో ఆందోళనపడ్డాము, చూడటానికనివచ్చాము, దైవం మమ్మల్ని రక్షించాడు. లేకపోతే ఈ అనాధుల గతి ఏమయ్యేది??”అంది.

పదునెనిమిది సంవత్సరాల యువతి ఆమె. చామన ఛాయ, విశాలనేత్రాలు, అవయవాల్ని విడివిడిగా పరీక్షించి చూస్తే ఏమంత రూపసికాదనిపిస్తుంది. కాని కమలని ఆశ్చర్య పరచినదేమంటే ఆమెలోని సంపూర్ణత్వము శ్రావ్యమైన కంఠ స్వరమూను. మిగతా యువకులంతా అమెకంటే చిన్నవారులా కనబడుతున్నారు. వారంతా కూడా ఎంతో వినియపూర్వకంగా నిలబడియున్నారు.

ప్రసాద్ “ చంద్రికా! నిన్ను చూడాలని యిక్కడకు వచ్చిన పదిరోజులనుంచి నాలో కోరికగా వుంది. కాని మీకుపరీక్షరోజులనీ, యీ విషయం మీకు తెలియకుండావుంటేనే మంచిదని రజని చెప్పింది. అందుకనే కబురు పంపలేదు. నిన్నటితో అన్నీ అయిపోయాయికదా? ఎలా వ్రాసారు?.”

అంతా ఏకకంఠంతో బాగా వ్రాసామన్నారు. అంతవరకు ప్రసాద్ కమల అక్కడ వున్న సంగతే మరచిపోయాడు.అప్పుడది గుర్తించి కమలను వారికి పరిచయం చేసి “వీరంతా అనాథ విద్యార్థులు కమలా! వీరందరినీ నేను పెంచుకుంటున్నాను” అన్నాడు.

కమలకు ఆ మాటలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. అతి సామాన్యమైన వారిదుస్తులు, వేష భాషలు ఆమెలోని మాతృత్వ అనురాగపు గట్టులు తెంచి వేసాయి.

చంద్రికని ఆప్యాయంగా దగ్గర కూర్చో పెట్టుకొని “చంద్రిక ! చక్కటి పేరు. ఏం చదువుతున్నావు తల్లీ ?” అంది కమల.

“తల్లీ” అనే సంబోధన చంద్రిక కళ్ళల్లోకి కన్నీరు తెచ్చింది. కళ్ళు తుడుచుకుంటూ “అయిదు సంవత్సరాల క్రితంవరకు నాకు అక్షరజ్ఞానం లేదు. అంతా మామయ్య చలువ. అప్పటినుంచి పట్టుపట్టి చదివించారు. ఈ సంవత్సరమే ఇంటర్ పరీక్షకు వెళ్ళాను, నిన్ననే పరీక్షలయిపోయాయి. వీరంతా కూడా నాలాటి వారే. మా అందరి కోసమని ఒక యిల్లు అద్దెకు తీసుకున్నారు. అన్ని ఖర్చులు వారే పెట్టుకుంటున్నారు. లేకపోతే నాకు బిచ్చమెత్తుకోవటమే గత్యంతరం” అంది.

“ఆ గత్యంతరం లేకుండా ఆదుకునేవారు వారొక్కరే కాదు చంద్రిక ఇక ముందునుంచి. నేను కూడా వున్నానని మరచిపోకు” అంది కమల.

చంద్రిక గద్గదస్వరంతో “అక్క!” అని కమల గాఢాలింగనంలో యిమిడిపోయింది.

“నువ్వదృష్టవంతురాలివి చంద్రికా. కమల ఆదరము, అనురాగము అంత సులభంగా లభించవు. వాటికోసం రాత్రింబగళ్బు, తపస్సు చేస్తున్న వ్యక్తులు చాలమంది వున్నారు. కాని వారికెప్పుడూ అది ఆమడదూరంలోనే వుంటోంది'' అన్నాడు ప్రసాద్.

మాటల అర్థం కమల గ్రహించింది. చంద్రిక గ్రహిస్తుందేమోనన్న భయంతో మాటలు మార్చి “జీవితంలో నీకు మీ మామయ్య నేర్పలేని విషయాలు నువ్వు స్వతహాగా నేర్చుకోలేని విషయాలు చాలా వున్నాయి. వాటిని నీకు స్త్రీ లే నేర్పాలి. అందుకుతగినవ్యక్తి రజనికంటె ఇంకెవ్వరు లేరు. అల్పురాలినైనా అవసరం వస్తే నేను వున్నాను” అంది.

“మామయ్య నా కెప్పుడు ఏవిధమైన బోధనా చేయలేదు. వారు ఏదైనా చెబితే అక్షరాలా పాటిస్తానని వారికి తెలుసు రజని వద్దనే నేను విద్యాభ్యాసం చేసుకున్నాను” అంది.

“అది మంచిదే చంద్రిక! కాని మీ మామయ్య ఎదుట ఇంకొకమాట చెపుతాను. వారు నీతో ఎప్పుడైనా చెప్పేరో లేదో నాకు తెలియదు. కాని వారు చాలాసార్లు అంటూవుంటారు. కృతజ్ఞతకు మన జీవితంలో చోటే లేదు” అని “అది వ్యక్తిత్వాన్ని కప్పిపుచ్చుతుంది” అని. నేను జీవితంలో కృతజ్ఞతకు చోటు లేదంటే అంగీకరించను, కాని ఒక విషయం ఎప్పుడూ మరువబోకు చంద్రిక! కృతజ్ఞతరూపములో పరులు నీవద్ద నుంచి ఏమైనా యాచిస్తే నిరాకరించే అధికారం నీకువుంటుంది. అది యెన్నడూ యుక్తాయుక్త విచక్షణని కప్పిపుచ్చ గూడదు. ఈ ప్రమాదంనుంచే నిన్ను నువ్వు కాపాడుకోవాలని నా కనిపిస్తోంది. అది ఎప్పుడు జ్ఞాపకము వుంచుకో” అంది కమల.

కమల మాటలలోని అర్థం ప్రసాద్ గ్రహించాడు. చంద్రికను పెడదారులు త్రొక్కిస్తాడేమోనని భయంతో అనిన మాటలని గ్రహించాడు. అదే సమయానికి రజని లోనికి వచ్చింది. ఆమెను చూచిన వెంటనే అంతా ఆమెను చుట్టు ముట్టి వేసారు. అందరినీ ఆప్యాయంగా పలకరించింది.

“రజని! నువ్విక్కడ వుంటామేమొనని వచ్చాను. కాని నువ్విక్కడ లేవు మీ యింటికే వద్దామని బయలు దేరపోతున్నాను” అంది కమల.

“జీవితంలోని చిత్రం యిదేకమలా! సరిగా సమయానికి కావలసిన వ్యక్తి సాధారణంగా దొరకరు అర నిమిషంఆలశ్యంగా వస్తాడు. కాని అప్పటికే పుణ్యకాలంకాస్తా గడచిపోతుంది” అంది రజని నవ్వుతూ.

రజని మాటలు చంద్రికకు నవ్వు తెప్పించాయి. కిలకిలా నవ్వుతూ “మా రజనిపిన్ని యెప్పుడూ యింతే. మన మేం మాట్లాడినా ఏదో ఆధ్యాత్మికంగా మాట్లాడుతుంది, ఒక రోజున నాతో అంది. చంద్రికా! చందమామ చల్లటివాడని శాంతినీ, సుఖాన్నీ యిస్తాడని మనమంతా అంటాము. సూర్యరశ్మి మనకు చికాకు, చిరు కోపము కలిగిస్తుందీ. కాని వీరిద్దరిలోను ప్రకృతికి ఎవరు ముఖ్యం చెప్పు? ప్రకృతికేకాదు. సూర్యరశ్మి లేకపోతే చంద్రునకు వెన్నెలే వుండదు. మన స్పర్శజ్ఞానాలకుమించిన సువాసనలు చాలా వున్నాయి” అంది. ఆ మాటలలో అర్థం నా కిప్పటివరకు తెలియదు” అంది.

“ఆలోచించి చూస్తే రజని మాటలలో ఎప్పుడూ నిగూఢార్థం వుంటుంది చంద్రికా? అవి వెంటనే గ్రహించటం. అంత సులభం కాదు. అయినా వీటిలోనిసత్యం మనకు ఎప్పుడూ కనబడుతూనే వుంటుంది. నేనుకూడా మొదట ఆమె ఏదో చమత్కారంకోసమని మాటలను త్రుంచి విపరీతార్థంవస్తుందేమో నని అపోహపడ్డాను. కాని ఇప్పుడు పూర్తిగా మనస్సు మార్చుకున్నాను. తరచి తరచి చూస్తే వాటివిలువ కట్టడంకూడా కష్టం” అంది కమల.

“విలువ కట్టడమే కష్టమైనప్పుడు వాటిలో విలువుందని యెలా చెప్పగలం?'' అంది రజని నవ్వుతూ.

“నీతో వాదించి నెగ్గడం చాలా కష్టం రజనీ, కానీ అశక్తురాలిశ్రద్ధాంజలిని తిరస్కరించకుండా పరిస్థితుల ప్రాబల్యంవల్లనేనేమైనా నీ పరీక్షకు తట్టుకో లేకపోతేనన్ను పరాభవించక, ఇక నేను వెళ్ళాలి, ప్రసాద్ బాబూ! ఇంకా హాస్పటల్ లో ఎన్నాళ్ళు వుంటారు” అంది కమల.

“నాలుగైదురోజులకన్న ఎక్కన అక్కరలేదనుకుంటాను. అంతా రజని యిష్టం” అని రజని కేసి చూచాడు.

సమాధానం రజని చెప్ప లేదు. చంద్రిక చెప్పింది. “మామయ్య హాస్పటల్ లో యింకా ఎంత కాలంవుంటే అంత మంచిది. ఇక్కడే కాస్త విశ్రాంతి తీసుకుంటారు. బయటకు వస్తే ఎడతెరిపి లేని పని. ఎక్కడన్నా ఏ బీదవాడైనా కష్టాలలో వున్నాడంటే అక్కడకు బయలుదేరుతారు. ఏ పని లేకపోతే విపరీతమైన వేగంతో కారు నడుపుతూ ఏదో ప్రమాదంలో చిక్కుకుంటారు” అంది.

“ఇక నేను వెళ్తా రజని! మేమెంత అంటరానివారమైనా మా యింటికి ఆ తరువాత ఒకసారి కూడా రాలేదు నువ్వు” అంది కమల.

“ఎందుకు రాను కమలా, తప్పకుండా వస్తాను. కానీయీసారికూడా వంటరిగా రాను. తోడు తీసుకు వస్తాను, అంది” రజని.

“నీతో ఎవరు వచ్చినా వారికి సుస్వాగతమే లభిస్తుంది రజని” అని బయటకు వెళ్ళిపోయింది కమల.

*****

వారం రోజులకి ప్రసాద్ హాస్పటల్ నుంచి విడుదలయ్యాడు. పూర్తిగా స్వస్థత చిక్కింది. ఇంటికి తిరిగి వచ్చిన రెండు రోజులకి రజని యిల్లువదలి పెట్టింది. ప్రసాద్ వారించేడు వద్దన్నాడు. కాని రజని వినలేదు. ఇంటిలో వుండటానికి అభ్యంతర మేముంది రజని? సహజీవనం లేకపోయినా నహచర్యం మిగిలే వుందికదా? అన్నాడు.

“అభ్యంతర మేమి లేదు ప్రసాద్. కాని మన యిద్దరి జీవితాల్లోనూ ఒక అధ్యాయం ముగిసిపోయింది. నూతన అధ్యాయాన్ని నూతన ప్రదేశంలోనే ప్రారంభించాలని నా కోరిక” అంది రజని.

“కనీసం యిదయినా చెప్పి వెళ్లు రజనీ నువ్వు ఎక్కడకువెళ్లుతున్నావు?” అన్నాడు ప్రసాద్.

“లోడి రోడ్డులో ఒక చిన్న యిల్లు కాస్తచవుకగా దొరుకుతుంది. ముప్పై రూపాయిలు అద్దె. చౌకే కదూ!” అంది రజని.

రజని మాటలు ప్రసాద్ కి ఎంతో బాధకలిగించాయి. అయినా ఏమీ మాట్లాడలేదు. రజనితత్వం అతనికి మొదటి నుంచి తెలుసును, ఆమె ఒక నిశ్చయానికి వచ్చిన తరువాత ఆది యిక ఏమాత్రమైన కదిలించడమనేది అసంభవం.

“కారులో దించివస్తాను పద రజనీ!'' అన్నాడు ప్రసాద్ ,

“వద్దు ప్రసాద్. ఇప్పటి నుండి నాకు జీవితమందు తీపికలుగుతోంది. అది మొదట్లోనే త్వజించబడటం నాకు యిష్టం లేదు” అంది రజనీ నవ్వుతూ.

“అదిసరే రజనీ నీ సామానుఏది?” అన్నాడు ప్రసాద్ నవ్వుతూ.

“ఇదుగో ప్రసాద్, యీ రెండు పెట్టెలు, బెడ్డింగు మొదటిసారి వచ్చినప్పుడు నాతో తెచ్చుకున్నాను. అవే తీసుకు వెళ్తున్నాను” అంది.

“అయితే యిక వెళ్ళు రజనీ” అన్నాడు ప్రసాద్ దీర్ఘంగా నిట్టూర్చి.

********

రజనీ ఆ మరుసటి దినం నుంచి వుద్యోగంలో కూడా చేరింది. ఆమె అందాన్ని చూచి ఒక ప్రయివేట్ కంపెనీలో రెసెప్షనిస్ట్ వుద్యోగం ఆ కంపెనీ యజమాని యిచ్చాడు. రెండువందల రూపాయిలజీతం. ఒక నెల అడ్వాన్స్ జీతం కూడా యిచ్చాడు. వాటితో యింటికి కావలసిన సామానులన్నీ ఖరీదు చేసింది. ఆనాడు సాయంకాలం రజని రామం లాడ్జికి బయలుదేరింది. లాడ్జికి వెళ్ళేటప్పటికి రామం గది తాళం వేస్తున్నాడు. రజనీని చూచి ఆనందంతో సరిగ్గా నీవద్దకే బయలు దేరి వస్తున్నాను రజనీ” అన్నాడు.

నవ్వుతూ “వస్తున్నాననకండి. బయలుదేరుతున్నా ననండి, బాటసారి బయలు దేరిన తరువాత గమ్యస్థానం చేరే లోపున చాలా గండాలు గట్టెక్కి బయటపడాలికదా ? ఏమిటి యిన్నాళ్ళు బట్టి తమ దర్శనం కాలేదు!” అంది.

“నీకోసం నేను చాలాసార్లు మీయింటికి వచ్చాను” కాని ఎప్పుడూ హాస్పటల్ కి వెళ్ళావనే చెప్పారు. ప్రసాద్ కి ఎలా వుంది?” అన్నాడు రామం.

“పూర్తిగా బాగయి పోయాడు. యింటికి చేరుకున్నాడు” అన్నది.

“మంచిది. ఆయితే యిప్పుడెక్కడికి ప్రయాణం” అన్నాడు.

“నా వెంట రండి ఇంతకు ముందెప్పుడు మీరు వెళ్ళని ప్రదేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను'' అంది. సుమారు రెండు మెళ్ళదూరం నడిపించి రజని తన యింటికి తీసుకువచ్చి తాళం తీసి లోపలికి రండి” అంది,

రామం అత్యంతాశ్చర్యంతో "ఇది ఏమిటి రజనీ యిది ఎవరి యిల్లు!''.

పరుల యింటిని నాయింటిగా భావిస్తున్నానని నా మీద మరొక నింద మోపారు. అందుకే మీరు బాధపడి నా మీద కోపగించి నన్ను నానా దుర్భాషలు ఆడారు, అప్పుడు మీరు నన్నడిగారు. ఈ యింటిలో వుండటానికి ఎంత అద్దెయిస్తున్నావు రజనీ'' అని. అప్పుడు నేను భాధపడి ఆ ప్రశ్నకు సమాధానం మరొక సారి చెప్తానన్నాను. ఇపుడు చెప్తున్నాను “ముప్పయి రూపాయలు” అంది.

రామం ఆశ్చర్యానికి పట్టపగ్గాలు లేవు "ఏమిటి రజనీ నీవు మాట్లాడేది నాకేమి అర్ధం కావటం లేదు' అన్నాడు.

“అంటే దాని అర్థం నేను ప్రసాద్ యిల్లు పదలి వేసేను. నా పూర్వపు సంబంధం నేను తెగతెంపులు చేసుకున్నాను. ఇప్పుడు కొత్తవారి కోసం వెదుకుతున్నాను. ఉద్యోగంలో కూడ చేరాను. నెలకు రెండువందల రూపాయిల జీతం. వచ్చేపోయే వాళ్ళ కేసి చిరునవ్వు విసరి “హలోమే ఐ హెల్ప్ యు అనడమే నాపని” అంది నవ్వుతూ.

“ఇదంతా నిజమేనా రజనీ ! లేక పరిహాసమా” అన్నాడు రామం.

“అక్షరాల నిజం రామం బాబూ. నమ్మకం లేకపోతే రేపు నాతోరండి” అంది.

అప్పటికి రామం రజని చెప్పినది నిజమని గ్రహించాడు. “ఇంత హఠాత్తుగా యీ పని ఎందుకు రజనీ? ప్రసాద్ కు నీకు యింత హఠాత్తుగా యీ విభేదం ఎలా సంభవించింది? ఇదంతా నాకు అగమ్య గోచరంగావుంది. దుఃఖించాలో, సంతోషించాలో కూడ తెలియటం లేదు” అన్నాడు.

“ఇందులో మీరు దుఃఖించవలసినది ఏమిలేదు, మీరు మొదటినుంచి యిదే గదా ఆశించారు? ఈ యీర్యతోనే నన్ను నానా మాటలు అనేవారు. ఇక మీ అభీష్టం ఫలించినప్పుడు దుఃఖమెందుకు చెప్పండి” అంది.

“ఎందుకో నాకు తెలియదు రజనీ, కాని నాకు ఆలోచించిన కొలది దుఃఖమే కలుగుతోంది. దీనికి కొంతవరకూ కారణభూతుడిని నేనే. ఆలోచన అందుకు యింకా దోహదమవుతోంది. ఈ పరిణామం మంచిదో చెడుదో నాకు తెలియదు. కాని దీని నుంచి చెడే ప్రాప్తిస్తేనాకు జీవితంలో మనశ్శాంతి వుండదు” అన్నాడు.

రజని లోపలికి దారితీసి “మనోదౌర్బల్యం కలవారికి మనశ్శాంతి ఏలా లభించగలదు చెప్పండి! అయినా అదంతా తీరికగా ఆలోచిద్దాం ముందు లోనికి పదండి” అంది.

రామం లోపల అడుగుపెట్టి గది అంతా పరిక్షించి చూచాడు. గది అంతా ఎంతో శూన్యంగా, నిరాడంబరంగా వుంది. కాని కుర్చీలు కాని, బల్లలు కాని, మంచాలు కాని ఏమి లేవు. ఒక మూలకొక బెడ్డింగు చుట్టబడివుంది. ఇంకొక మూల కొకేలానికి కొన్ని చీరలు వేలాడుతున్నాయి, పక్కగా ఒక పెట్టెవుంది అంతే.

“కుర్చీలు, సోఫాలు ఇక్కడ లేవు మీరు చాపమీద కూర్చోవాలి” అంది రజని చాపపరచి.

ఆదృశ్యంచూసేసరికి రామం కళ్లలో సన్నగా నీరు తిరిగింది. అందుకు నాకేమి అభ్యంతరం లేదు రజనీ. కాని ఐశ్వర్యానికి అలవాటుపడిన నీవు యీ దారిద్య్రాన్ని ఏలా భరించగలుగుచున్నావు?” అన్నాడు.

“ఇదేమంత కష్టం కాదు. మానవుని మనస్సు ఎంతో చిత్రమైంది. కష్టాలు ఎదురయ్యే వరకు వాటిని మనం ఎదుర్కోలేమని భయపడతాము, సంకోచిస్తాము కాని నిజంగా సమయం వచ్చేటప్పటికి వాటిని సునాయాసంగా దాటివస్తాము. ఈ మహత్తరమైన శక్తి మానవుని సదారక్షిస్తూ వుంటుంది.” అంది.

“వేదాంతం మాట్లాడకు రజనీ, నిజంగా నీకు ఈ దారిద్యం భరించటం కష్టంగా లేదా?”అన్నాడు. “భరించక నేనేమి చెయ్యను చెప్పండి. కష్టాలలో ఆదుకునే ఆప్తులు నాకెందరున్నారు చెప్పండి. ఎవరింటికి వెళ్ళినా చీదరించుకుంటూంటారు” అంది.

ఆమాటలు రామానికెంతో బాధకలిగించాయి. హృదయం ఎంతో బరువెక్కిపోయింది. “అలాంటిఆప్తులు లేకపోలేదు రజనీ కాని వారిమీద నీకు నమ్మకం లేదు అది వారి దురదృష్టం.” అన్నాడు.

“వారిలో వారికి నమ్మకం లేనప్పుడు ఇతరులను నమ్మమనటం న్యాయమా చెప్పండి! ఆత్మవిశ్వాసం లేని వారితో ముందడుగు వెయ్యటం ఏమంత శ్రేయదాయకమయినది కాదని నా అభిప్రాయం. పరిస్థితులను పరిణామాలను ప్రతిఘటించే ధైర్యం కావాలి రామం బాబూ" అంది.

రజని మాటలు రామం మనస్సులో కలవరం లేవదీశాయి, ఏదో అనబోతుంటే, “ఇప్పుడు నాకా వివాదంలో దిగడమంటే యిష్టం లేదు రామం బాబూ ముందర నా ఆతిధ్యం స్వీకరించండి" అంది.

రామం మాట్లాడకుండా వూరుకున్నాడు. వంట ప్రయత్నం చేస్తూ “మీరోనాడు నేను యితరుల యింట్లో మీకు భోజనం పెట్టానని బాధపడి మీరు సరిగ్గా భోజనం చేయలేదు. ఈసారి పదార్ధాలన్నీ నావే. ప్రయత్నమంతా నాదే. నాయింటిలో మొదటి భోజనం మీకే పెడ్తున్నాను. ఈసారైనా మీరు కడుపు నిండా భోజనం చెయ్యండి?” అంది.

ఆ ఆప్యాయత రామాన్ని కరిగించి వేసింది.

“నీకెందుకు యీ ఆతురత రజనీ? నేను సరిగ్గా భోజనం చెయ్యకపోతే నువ్వెందుకు బాధపడాలి? ఇది చాలా అల్పమైన విషయం కాదా? అన్నాడు రామం.

“ఇది ఆడవారిలోని బలహీనతలలో ఒకటి. ఆప్తులెవరయినా వారు వడ్డిస్తున్నప్పుడు సరిగా కడుపునిండా భోజనం చెయ్యకపోతే చాలా బాధ కలుగుతుంది, ఆప్యాయం ఎక్కువగా వుంటుంది. మగవారు దీనిని అట్టే పట్టించుకోరు, కాని ఆడవారి సంగతి వేరు, ఇంటికి వచ్చి సరిగా అన్నం తినకపోతే వారిని కించపరచినట్లు బాధపడతారు ఆంది.

“ఇదే నిజమైతే ఆ ఆడవారిమిద కోపగించిన వారు కక్ష తీర్చుకోవడానికివే సులభమైన మార్గం” అన్నాడు నవ్వుతూ,

రజనికూడ నవ్వుతూ “ కాదని నేనను. కాని వారు కర్కశ హృదయులని మాత్రం నేనంటాను” అంది.

“కాదని నేనూ ఆనను” అని నవ్వుతూ “ఇదే సమయము ఇంకోక ప్రశ్నకు కూడా సమాధానం చెప్పు రజనీ, ఆడవారిని అర్థం చేసుకోవటం అసంభవమనీ, వారి ఆలోచనల్ని, చేష్టల్ని గ్రహించుట దుర్లభమనీ, వారు నిగూఢ హృదయులనీ, చంచలస్వభావులనీ నలుగురూ అంటుంటారు అది నిజమేనా?” అన్నాడు రామం.

రజని “ స్త్రీ నయినా నాకు మీ ప్రశ్నకు సమాధానం చెప్పడం సులభం కాదు. స్త్రీ, పురుషుల మనస్తత్వాలకు విభేదం వుందనే విషయం వివాదాంశమైనది కాదు. ప్రకృతిలోనే అలా వుంది. జీవితంలో స్త్రీ పురుషుల కర్తవ్యము వేరు, అందుకు తగినవిధంగానే వారి వారి హృదయాలు కూడ వేరుగా నిర్మించబడ్డాయి. స్త్రీలు చంచలస్వభావులే కావచ్చు. కాని వారిలోని కార్య దీక్ష, త్యాగ శీలం, కరుణ, అనురాగము మీలోచాలా అరుదుగా కనబడుతాయి. దానికి కారణం అతిసులభమైనది. ప్రకృతి స్త్రీలకే మాతృత్వం ప్రసాదించింది” అంది.

రజని విస్తరిలో రకరకాల పదార్థాలు వడ్డించి “ఇక ఆలస్యం చెయ్యకండి” అంది.

రామం ఆశ్చర్యంతో “మరి నువ్వో” అన్నాడు.

“నేను తినటమే ప్రారంభించానంటే మీ సంగతే మరచిపోతాను. మీకు వడ్డించి తరువాత నేను కూర్చుంటాను” అంది.

“అలాంటి అన్యాయపు మాటలనకు రజనీ. ఇప్పటికి నేను రెండుసార్లు నీతో భోజనం చేసాను. మా అమ్మనే మరపించే అప్యాయతతో నాకు భోజనం పెట్టావు. అయినా అప్పుడు లేని శ్రద్ధాసక్తులు యిప్పుడెందుకు” అన్నాడు రామం.

రజనీ నవ్వుతూ “అప్పుడు పరులయింటిలో మీకు నేను అన్నం పెట్టాను. ఇప్పుడు వేరు. మీ కడుపునిండా భోజనం చేస్తుండగా చూస్తూంటే నాకెంతో తృప్తి కలుగుతుంది. అదీ నాకు కలగకుండా నాకు అన్యాయం చెయ్యకండి” అంది.

“ఇది నేను సహించను. రజనీ? నువ్వలా నిలబడి వడ్డిస్తూంటే నేను సరిగ్గా భోజనంకూడ చెయ్యలేను. లాభం లేదు రజనీ నువ్వుకూడ నా పక్కన కూర్చుని భోజనం చెయ్యాలి” అన్నాడు.

“సరే రామం బాబూ! అతిథులు మీరు. మిమ్మల్ని ఆయిష్టపరచటం నా అభిమతంకాదు'' అంది.

“మాటి మాటికి అతిథి అంటూంటే నాకు కష్టంగా వుంటోంది రజనీ! నేను నీకు అతిథిని మాత్రమైనా? అంత కంటే ఇంకేమీ కానా?” అన్నాడు రామం.

రజని నవ్వుతూ, “యిప్పుడు ఇంకేమి కాదు రామం బాబూ! ఆ తరువాత చెప్పలేను అది మీ యిష్టాయిష్టాల మీద ఆధారపడి వుంటుంది. ఇక ఆలస్యం చెయ్యకండి. అప్పుడే ఎనిమది దాటిపోయింది. మీరు చాలా స్వార్థపరులు. భోజనాలయిన తర్వాత అంతా సర్దుకునేసరికి యింకొక గంట పడుతుంది, మీరు తీయని తమలపాకులు నములుతూ తన్మయులయె తరుణం కోసం వేచివుంటారు. మాలాటి అబలలు అలసివచ్చేసరికి ...'' అని యింకా అనబోతూవుంటే రామం చెవులు మూసుకొని ఇంక చాలు రజనీ'' ఆకలి అవుతోంది అన్నాడు.

భోజనాలయిన తర్వాత రజని తమలపాకులందించి “ఆకులకి సున్నం వ్రాసుకోండి. అన్నీ మీకు చేసి పెట్టడానికి మీకు నేనేమి అర్ధాంగిని కాదు” అంది.

“అర్థాంగివి కాకపోవచ్చు రజనీ. కాని అత్మీయురాలివే కదా!" అన్నాడు.

సున్నితమైన తన వేళ్ళతో యీనెలు తీసి సున్నం వ్రాసి రామం చేతికందిస్తూ “మీకు తెలుసునా నేను యింత యీ వుపకారం ఎవ్వరికీ చెయ్యలేదు. ఇలాంటి పనులు చేయడమంటే నాకొక విధమైన అనహ్యంకూడ వుండేది? అంది.

“అయితే ఈనాడు అడగకుండానే ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావు రజనీ! “ అన్నాడు.

“ఆ ప్రశ్నకి సమాధానాన్నే నేను నా హృదయంలో వెదుకుతున్నాను, కానీ ఎక్కడా ఆచూకీ లేదు. సమాధానం దొరికిననాడు ఆలస్యమవకపోతే తప్పక మీకు చెప్తాను. దగ్గర లేకపోతే నేను మీకు ఉత్తరం వ్రాసాను” అంది.

“ఉత్తరం వ్రాయవలసిన అవసరం కలగకూడదనే నేను పదే పదే ప్రార్థిస్తూంటాను రజనీ” అన్నాడు .

“కాని యిది ఎప్పుడో ఒకప్పుడు సంభవించక తప్పదు కదా! నేను ఢిల్లీలో చిరకాలం వుండను. మీరు వుండినా కొద్దికాలం పోయిన తర్వాత అపరిచితులు అడుగుపెట్టి అంతా స్వాధీనం చేసుకొని “నీ సర్వస్వంలో నాది సగం” అని అహంభావంతో అంటారు. అదివారం నాడు ఏమి తోచక యింటికి వచ్చి తలుపుతట్టితే అపరిచిత స్త్రీ ఎవరో తలుపు తెరచి నన్ను చూచి “ఎవరు మీరు?'' అని నన్నడుగుతారు. అహంభావంతో ''రజనిని” అనే శబ్దం వుచ్చరించినప్పుడు లోనికి వెళ్ళివచ్చి వారి స్మృతిపథంలో అలాంటి శబ్దాలకిక తావు లేదుట” అని అంటారు.

“అంతా అబద్దం! అభూతకల్పన'' అన్నాడు రామం.

రజని నవ్వుతూ “అభూతకల్పనో కాదో తర్వాత ఆలోచిద్దాము. కాని యిది భూతాలు సంచరించే సమయం అప్పుడే ఆలస్యమయింది. ఈ రాత్రికి మీరు యిక్కడే పడుకోకూడదా? సరదాగా కబుర్లు చెప్పుకుని వుండొచ్చు” అంది.

ఈమాటలు విని రామం ఉన్నదొక్క గదినీ కలియ చూచి ఎంతో ఆశ్చర్యంతో “ఏమిటి నువ్వనేది రజనీ? పరాచిక మాడుతున్నావా? పరాభవిస్తున్నావా?” అన్నాడు.

“పరాచకమూ లేదు, పరాభవము లేదు రామం బాబూ! పరీక్షిస్తున్నాను. కొద్ది కాలం క్రితమే మీరు “ఆశయం యిచ్చేఆప్తులున్నారు రజనీ ! కావి వారిమీద నాకు నమ్మకం లేదు'' అన్నారు. ఒక్క రాత్రి నాతో ఈ ఇంటిలో ఏకాంతంగా గడపటానికి భయంతో వణికిపోయే మీరు మీ యింటిలో నాకు ఆశయం ఎలా యివ్వగలరు! మీ మనస్సును మీకు విశదపర్చటానికే నేను అలా అన్నాను'' అంది.

రామం అభిమానంతో అవమానంతో అవమానంతో క్రుంగిపోయాడు. జీవితంలో నన్నెవరూ యింతవరకు నేనింత అవమానంతో సిగ్గుపడేట్లు చేయలేదు రజనీ. నా చేత్తోనే చెంపమీద చెళ్ళుమని కొట్టావు . దుఃఖంలో నైనా నీచాకచక్యానికి నేను “శభాష్” అనక తప్పదు” అన్నాడు.

“ఎవరినీ 'శభాష్' అనవలసిన అగత్యం లేదు రామం బాబూ! మీ హృదయం మీరు భద్రపరచుకొని ముందుకు సాగిపొండి. జారవిడచారంటే మళ్ళీ మీకు చిక్కను” అంది.

రామం హఠాత్తుగా లేచినిలబడి “నీ హెచ్చరికని నేను జ్ఞాపకముంచుకోవడానికి ప్రయత్నిస్తాను రజనీ” కాని ఫలితం గురించి నేనేమి చెప్పలేను'' ఇక నేను వెళతాను.

రజని కూడ నిలబడి "చెప్పటం మరచిపోయాను. రేపు విశాల యిక్కడకు వస్తోంది. కలుసుకోవాలని కోరికగా వుందన్నారు. స్టేషన్ కు మీరూ రాకూడదా?” అంది.

విశాల రాక సమాచారం విని రామం ముఖం విప్పారింది, “ఆలాగే వస్తాను రజనీ. సాయంకాలం రైలు స్టేషనుకి వస్తాను” అన్నాడు.

*****

షేర్ చేయబడినవి

NEW REALESED