Aprasyulu - 3 books and stories free download online pdf in Telugu

అప్రాశ్యులు - 3

అప్రాశ్యులు

భీమేశ్వర చల్లా (సి.బి.రావు)

3

అందరు శనివారం సాయంకాలం ఆగ్రా బయలు దేరారు. కమల రానని చాలాపట్టుపట్టింది. కాని చివరకి కమలాకరం బలవంతంమీద బయలు దేరక తప్పింది కాదు, కాలం గడచేకొలదీ ప్రసాద్ కోపం తగ్గింది. చెంప పెట్టు పెట్టినా అతను దానిని పట్టించుకోకుండా మరునాడేవచ్చి క్షమాపణ చెప్పుకోవటం ఆమెకి ఎంతో తృప్తినిచ్చింది. అప్పుడు కూడా తన ప్రవర్తన కఠినంగా వున్నా, అతను పట్టించుకోలేదు. చివరకు కమలకి యిష్టం లేకపోతే తను రావడం మానేస్తానని కమలాకరంతో చెప్పాడుట కూడాను, అలాంటి పరిస్థితులలో తాను రానని నిరాకరించటం అసమంజసంగా వుంటుందని కమల ప్రయాణానికి బయలు దేరింది.

రజని ఎంతవద్దన్నా ప్రసాద్ స్టీరింగ్ వద్ద కూర్చున్నాడు, నున్నటి ఆ తారురోడ్డుమీద విద్యుద్వేగంతో పోతున్న ఆ కారులోని వారంతా భయంతో వణకసాగారు. కమలాకరం, రామం ఎంత వారించినా ప్రసాద్ వినలేదు. ఆ పరిస్థితిలో ప్రసాద్ ని చూచి కమలకు భయంకూడా వేసింది. ముఖంలోని నరాలన్నీ వుబికి వున్నాయి. గాలికి “జుట్టంతా అగ్నిజ్వాలలా ఎగురుతోంది. ఎవరిమాటల్ని చెవిని వేసుకోకుండా తదేకంగా ముందుకు చూస్తూ నడుపుతున్నాడు. ముందరిసీటులో ప్రసాద్, రామాల మధ్య రజని కూర్చుని వుంది. వెనుక సీటులో కమలా, కమలాకరం కూర్చున్నారు. గాలికి రజని పమిట చెదిరి రామం ముఖం మీద పడి పూర్తిగా కప్పి వేసింది. రామంకు మత్తెక్కినట్లయి క్షణం చీరనుతన చేతిలో పట్టుకుని వుండిపోయాడు. రజని నెమ్మదిగా చీరని లాగుకుంటూ “రామంగారిలో కొన్ని దుశ్శాసనుని లక్షణాలు మూర్తీభవించాయని నాకిప్పటివరకు తెలియదు” అంది నవ్వుతూ. అదృష్టవశాత్తు గాలి విసురులో ఆ మాటలు రామంకి తప్ప ఎవరికి వినబడ లేదు. ఇంకా రజని ఏమయినా అంటుందేమోననే భయంతో రామం “మీకు నమస్కారం పెడతాను. కమలవుండగా మీరు అలాంటిమాటలు మాట్లాడకండి. మీకు పుణ్యముంటుంది” అన్నాడు.

రజని నవ్వుతూ “దుశ్శాసనుడు ధైర్యవంతుడు. నిండు సభలో పాంచాలిని పరాభవించాడు. నలుగురికీ భయపడలేదు, కానీ రామంగారు” అంది.

రజని నవ్వువిని కమలా కమలాకరాలు ఆశ్చర్యపోయేరు. ప్రాణభయంతో వారు సతమతమవుతూంటే ఈమె పరిహాసాలాడుతూ పకపక నవ్వటం వారిని దిగ్బాంతులను చేసింది. కృంగిపోతున్న ధైర్యాన్నంతా కూడదీసుకుని కమల “రజనీ ప్రాణం మీద నీకు తీపి లేదా? ఇంత వేగంగా పోతుంటే ఏక్షణంలో నైనా ప్రాణాపాయం సంభవించును కదా?” అంది.

రజని, “తీపి వున్నంత మాత్రాన అది మనం తప్పించగలమా చెప్పండి ఏక్షణంలో నైనా అలా జరగవచ్చని మీరే చెప్పారు. అందుకనే ఉన్న సమయంలోనే సాధ్యమయినంత వరకు జీవితంలోని సారాన్ని పీల్చివెయ్యాలి అలా చెయ్యకపోతే చివరకు ఇహము, పరము రెండూ శూన్య మవుతాయి.”

కమల కోపంతో “అందుకని ఆత్మహత్య చేసుకోమంటారా మీరు?” అని గట్టిగా “ప్రసాద రావు గారూ మీరు కారు నెమ్మదిగా నడుపుతారా? లేకపోతే కారులోంచి బయటకు దూకమంటారా! చెప్పండి” అంది.

కమల మాటలు విని ప్రసాద్ నవ్వుతూ “ ప్రాణభయంతో కారును నెమ్మదిగా డ్రైవు చెయ్యమంటూలేకపోతే ప్రాణం తీసుకుంటానంటున్నారేమిటి మీరు. చివరకు మిగిలేది మృతకళేబరమే కదా?” అని కారును కొంచెం స్లో చేసాడు. అది చూచి రజని చాలా ఆశ్చర్యమయింది ప్రసాద్ చేత కారు నెమ్మదిగా నడిపించే శక్తి ఎవ్వరికీ లేదని ఆమె అనుకుంటూ వచ్చింది. అసలు నడుపుతూ వున్నప్పుడు మాట్లాడటమనే అలవాటతనికి లేదు. అలాంటి వ్యక్తి ఇలా ప్రవర్తించేసరికి, రజనికి నిజంగా నోటమాట రాలేదు. మదపుటేనుగుని లొంగతీసి మావటివాడు లభించాడనుకుంది. ప్రసాద్ రజని ఆలోచనలను గ్రహించి మరుక్షణంలోనే మామూలు వేగంకి కారును తీసుకువచ్చాడు.

రెండు గంటలలోనే ఆగ్రా చేరుకున్నారు. తిన్నగా తాజ్ వద్దకే వచ్చారు. నిశ్చలమైన ఆ పచ్చటి పున్నమి వెన్నెలో తాజ్ మహల్ అనిర్వచనీయమైన అమావాస్య అందంతో కన్నుల ముందు ఆవిష్కరించింది.

కారు ఆగిన మరుక్షణంలోనే కమల తన్మయంతో తాజ్ వైపుకు పరుగెట్టింది. అది చూచి కమలాకరం కాస్త కంగారుపడ్డాడు. కమలా? ఆగు. ఎక్కడకు వెళ్తున్నావు?” అన్నాడు.

“ఆపబోకండి కమలాకరం బాబూ ! ఆమెలో అణచి వున్న ఆవేశాలకి యి రాత్రి ఆసరా దొరికింది. ఇక ఆమెను హరి బ్రహ్మాదులు కూడ యీ రాత్రి అదుపులో వుంచలేరు” అంది రజని.

ప్రసాద్ నవ్వుతూ “హరి బహ్మాదుల దాకా పోతావెందుకు రజనీ! ప్రక్కన వున్న ప్రసాద్ ను పరిగణించ లేదెందుచేత ? అన్నాడు.

రజని కూడా నవ్వుతూ “పరిగణించక పోలేదు ప్రియా! పనికిరావని మాత్రం అనుకున్నాను ప్రగల్బాలికి కూడా పరీక్ష వుంటుంది. ప్రసాద్ బాబు ” అని ఆమెకూడా నవ్వుతూ పరుగెట్టుకుని వెళ్లి పోయింది.

ఆమె ఆ వికృత నవ్వు, ఆమె ప్రవర్తన ఎందుకో కమలాకరాన్ని కలవర పెట్టాయి ఎందుకో మనస్సు అశుభం సూచించసాగింది. కమల గురించి మనస్సు ఆతురత పడ జొచ్చింది. అతను “రామం కమల ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు ఎందుకో కలవరపాటుగా వుంది. మన యిద్దరము వెళ్ళి వెదుకుదాము” అన్నాడు.

ఆ మాటలు రామానికి ఆశ్చర్యం కలగజేస్తాయి. కమలాకరం ఎంత మిత భాషో, గంభీరుడో, నిశ్చలతో, అతనికి తెలుసు. అలాంటి వాడు ఈనాడు ఈవిధంగా అనేటప్పటికి రామానికి కూడా ఎందుకో అశాంతి కలుగ జేసింది.

రామం సమాధానం చెప్పేలోపల ప్రసాద్ “ఇలా గాభరా పడటం నీ స్వభావానికే విరుద్ధం, కమలాకరం. కమల గురించి కంగారుపడకు. నేను హనుమంతుడిలాంటి వాడిని. నాశక్తి, నాకే తెలియదు” అని ప్రసాద్ కూడా పరుగెట్టసాగేడు.

దానితో కమలాకరానికి నిజంగా కంగారు పుట్టింది. అది గమనించి రామం ఈ పుచ్చపువ్వు లాంటి ఈ పండు వెన్నెల- చలవ రాత్రి ఈ చల్లదనం మనల్ని మత్తెక్కించి మైమరపిస్తోంది” అన్నాడు.

ఇద్దరు ఓదగ్గరకు వచ్చి చూస్తే అక్కడ చాలా మంది జనం వున్నారు. కాని వారిలో ప్రసాద్, రజనీ, కమలలు కనపడలేదు. ఇరువురు చెరొక వైపు విడిపోయి వెదకటం మొదలు పెట్టారు.

ప్రసాద్ కమలకోసం తాజ్ మహల్ లోపల ఎంత గాలించినా కనబడ లేదు. చివరకు అక్కడ వున్న మీనారెట్ కెక్కి వుండునేమోనను సంశయం కలిగి, అవికూడా గాలించేడు, చివరకు మూడవ ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడు. ఒంటరిగా చిట్టచివర నుంచుని పరధ్యానంగా బయటకు చూస్తోంది. నెమ్మదిగా దగ్గరకు వెళ్లి మెల్లిగా “కమలా!, అనిపిలిచాడు. కాని మొదట పిలుపుకి ఆమె సమాధానం చెప్పలేదు. ప్రసాద్ ఈసారి కొంచెం గట్టిగా ‘కమలా’ అని పిలిచాడు. ఆ పిలుపు కూడా ఆమెకు వినబడలేదు. కాని ఆస్తంభంలో ప్రతి ధ్వనించిన ఆ పిలుపు వినబడింది. హఠాత్తుగా నలువైపులా వినబడిన ఆ ప్రతిధ్వనికి ఆమె తుళ్ళిపడి ముందుకు అడుగు వేయబోయింది. అడుగు ముందర అంతా శూన్యం. ప్రసాద్ వెంటనే ఆమె భుజస్కంధంను గట్టిగా పట్టుకోని వెనక్కిలాగాడు. ఆమె తుళ్ళి అతని మీద పడింది. కమల పిలుపు ఎవరిదో, ఆ వ్యక్తి ఎవరో అవగాహన మయింది. అలాంటి సమయంలో బిడియపడటమేమంత ఆశ్చర్యకరమైన సంగతి కాదు. కాని ఆమెలో ఏదో అవ్యకమైన భయం ఆవరించింది క్షణకాలం ఆమెనోట మాట రాలేదు 'మీరా' అని మాత్రం అనగలిగింది. కాని ప్రసాద్ కమల ముఖం తదేకంగా చూస్తూ” నన్ను నువ్వు గుర్తుపట్టినా నన్ను చూచి అసహ్యంచుకుంటావేమోనని నేను భయపడ్డాను. కాని నీ ముఖంలో ఎక్కడ ఏవగింపు కనబడటం లేదు. బలహీనత, భయము కనబడుతున్నాయి. నాకు యిదే ఎప్పుడు అర్ధం కాదు. నన్ను చూచి నువ్వు ఎందుకు భయపడతావు? నాలో అంత భయానకమైన దేముంది? కాని అన్నింటిలోకి ఆశ్చర్యకరమైన దేమంటే నాకు నువ్వంటే తగని భయం ప్రపంచకంలో యింకెవ్వరికి ఇప్పటివరకు భయపడలేదు. నేను చేయదలచుకున్న పనిని చెయ్యకుండా ఎవరు అడ్డగించలేకపోయారు. ఇతరుల యిష్టాయిష్టాలతో నా కేమి నిమిత్తం వుండేది కాదు. కట్టుదిట్టాలు, క్రమశిక్షణ నాకు ఎప్పుడూ లేవు. కాని ఈనాడు నీ మాటని జవదాటటమంటే ఎందుకో మనస్సు వెనక్కు లాగుతూంటుంది. భయం వేస్తూంటుంది నీకు నామీద ఆగ్రహం వచ్చిందనే ఆలోచన నాకు” అని ఇంకేదో చెప్పబోతుంటే కమల అడ్డం వచ్చింది.

ఆమెకు భయంతో ముచ్చమటలు పోశాయి. “ఏమిటలా మాటాడుతున్నారు? మిగతా వాళ్లంతా ఎక్కడని, నన్ను క్రిందకు వెళ్లనీయండి” అంది.

నిజానికి క్రిందకు దిగడానికి ప్రసాదేమి అడ్డం లేడు. అతను “వెళ్లు కమలా, నిన్ను నేను బలవంతగా యిక్కడ వుంచాలనే కోరిక నాకు లేదు” అన్నాడు. కాని కమల ఎంత ప్రయత్నించినా కాలు కదప లేకపోయింది. భయంతో వణికిపోతూంది. దానితో పాటు ఆమెలో ఒక విధమైన బలహీనత కూడా ప్రవేశించింది. క్రిందకు దిగటానికి ప్రయత్నించిన కొలది ఆమెలోని బలహీనత ఎక్కవ కావొచ్చింది. చివరకు అక్కడ నిలబడే శక్తి కూడా ఆమెలో క్షీణించిపోయి అక్కడే ఒక మూల కూర్చుండి పోయింది. ఆమె శారీరక పరిస్థితి చూచి ప్రసాద్ కి విపరీతమైన జాలి కలిగింది.

“చలి వేస్తున్నదా? కమలా” అని అడిగాడు

కమల వణుకుతూ “అవునని” తలవూపింది. ప్రసాద్ వెంటనే తన కోటు తీసి ఆమెపై కప్పి వుంచాడు. నిజానికి ఆమెకేమి చలి వెయ్యలేదు. కానీ ఆమె అ ప్రయత్నంగా అవునని తల వూపింది. కాని ఆశ్చర్యకరమైన దేమంటే దానితో ఆమెలోని ఆ వణుకు పూర్తిగా ఆగిపోయింది. కోటును దగ్గగా లాక్కుని అలాగే లాక్కుని వుండిపోయింది. ప్రసాద్ కూడా ఆ తరువాత కొద్దిక్షణాల వరకు మాట్లాడలేదు. బయట వెన్నెల విరుస్తూంటే చీకటిలో ఆ మారుమూల భయంతో నక్కి కూర్చుని వున్న ఆ అసహాయ స్త్రీ పరిస్థితి ప్రసాద్ కి ఎంతో జాలి వేసింది.” ఇక క్రిందకు వెళ్దాము పద, కమలా, వారంతా మనకోసం వెతుకుతూ వుంటారు. కాని వెళ్లేలోపున నాకు నువ్వొక వాగ్దానం చెయ్యాలి. నా యెడ నీ మనస్సులో ద్వేషానికి తావివ్వవని నాకు మాటివ్వాలి.” అన్నాడు.

“ప్రపంచంలో నాకు ఎవ్వరిమీద ద్వేషం లేదు. ప్రసాద్ బాబూ!. కాని మీరు నాక్కూడ ఒక మాట యివ్వాలి. మీ అభిప్రాయాలు, ఆశయాలు, నాకు తెలుసును. వాటితో నేను సుతరాము అంగీకరించను వాటి గురించి నేను ఆలోచన కూడా చెయ్యను. నేను అల్పసంతృపురాలిని. నాకు వాటితో పని లేదు. మీ ఆశయాల నిరూపణకి నన్ను బలి చెయ్యడానికి, ప్రయత్నించకండి. నాహృదయంలో అనవసరంగా చిచ్చు పెట్టకండి, ఏ పాప మెరుగని నా జీవితాన్ని నాశనం చెయ్యకండి. వేటకాడులాగ నన్ను వెంటాడకండి. చెంపపెట్టు పెట్టానని పగ పట్టిన పాములా నామీద పగ తీర్చుకుంటారా?” అని అటు ఇటు కమల చేతుల్లో ముఖం దాచుకొని ఏడవటం మొదలుపెట్టింది. సానుభూతి పురుష సహజమైనా ప్రేమాభిమానాలు వెల్లివిరిసేయి. కానీ ప్రసాద్ లో అలాంటి భావాలేమి కలగలేదు. అతను ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించలేదు. సానుభూతి వాక్యాలైనా పలుక లేదు.

కఠినంగా “కన్నీళ్ళంటే నాకు తగని కోపం. కమల! మానవత్వానికి అవి మాయని మచ్చ. అందులో ఏడవ వలసిందేమీ లేదు. కన్నీళ్లకి కరిగిపోయే నిర్భలుడిని కాదు నేను- ఇక కట్టిపెట్టు కమలా? అన్నాడు.

కట్టిపెట్టడానికి కమల తన శక్తినంతా కూడ దీసుకొని ప్రయత్నించింది. కాని సఫలీకృతురాలు కాలేక పోయింది గట్టు తెగిన ప్రవాహంలో దుఃఖం ఉబుకు వచ్చింది.

కొంతమంది స్త్రీలకు కన్నీరు యింత సులభంగా ఎలా స్రవిస్తాయి నాకర్థం కాదు. రజని కంట కన్నీరు చూడాలని నేను చాలాసార్లు ప్రయత్నించాను. కాని ఎప్పుడూ ప్రయత్నం ఫలించలేదు. ఆత్మాభిమానం వున్న వారెవరు పరుల ఎదుట కన్నీరు కార్చరు” అన్నాడు ప్రసాద్.

ఆ మాటలతో కమలలోని పౌరుషం పైకి వుబికింది. దుఃఖం క్రోధంగా మారింది. మీరు కర్కశ హృదయులు. మీలో దయాదాక్షిణ్యము బొత్తిగా శూన్యం. మీరు మానవాతీతులనుకుంటున్నారేమో? మీరు మానవాధములు మాత్రమే” అంది.

ప్రసాద్ నవ్వుతూ “శభాష్ కమలా, క్రోధం నీకు సహజమైనది. కాని కన్నీరు కాదు. కన్నీరు కార్చినా మనస్సుకరగిద్దామనుకోవటం కేవలం నామమాత్రమే. ఇప్పటివరకు నీవు ఆడిన నాటకమంతా వృధా ప్రయాస. యిక సహజంగా మళ్లీ ప్రారంభించు” అన్నాడు.

తన కన్నీరంతా బూటకమనేటప్పటికి కమల కోపం పట్టపగ్గాలు తెంచుకుపోయింది, తన ఒళ్లు తానే మరచి పోయింది. కుతకుత మనే క్రోధంతో ఏం చెయ్యాలో తెలియక చివాలున లేచి ప్రసాద్ కి చెంపపెట్టు పెట్టబోయింది. కాని ప్రసాద్ ఆమె చెయ్యి పట్టుకుని పక పక నవ్వుతూ “ఈసారి గురి తప్పావే - కమలా?- అయినా ఫరవాలేదు. క్రోధంతో ప్రజ్వరిల్లే నీనయనాలు నన్ను సమ్మోహితుని చేస్తున్నాయి, ఇప్పుడే నువ్వెంతో సహజంగా కనబడుతున్నావు, రజనిని పిలిచి నిన్ను ఇప్పుడు చూపించాలని కోరికగా వుంది. ఒక సారి నేను క్రోధంతో స్త్రీలు అందంగా వుంటారని అంటే రజని కాదంది. “ఆ సమయంలో నన్ను ఆకర్షించేది అందం కాదు. క్రోధం మాత్రమే అంది” ఇప్పుడు నిన్ను చూపించి ఆమెను అడగాలి. ఇది అందమా క్రోధమా రజని అని అన్నాడు.

కమల తన చెయ్యి చివాలున ప్రసాద్ చేతిలో నుంచి లాగుకొని “నువ్వంటేనే నాకసహ్యం. నీ ముఖం చూస్తేనే నాకసహ్యం వెళ్ళిపో యిక్కడ నుంచి” అంది.

ఆ మాటలు విని ప్రసాద్ ఉద్రిక్తచిత్తుడై కోపంతో మండిపోయాడు. కమల మాటలకన్న ఆమె ముఖంలో దృగ్గోచరమైన ద్వేషమే అతనిని వుత్తేజితుని చేసింది. గాయపడిన సింహంలా గర్జిస్తూ - “కమలా ! నువ్వన్నమాటలే నిజమయితే నాకిక జీవితంతో పని లేదు, ద్వేషాన్ని నీ హృదయంలో నేను సహించలేను.” అని చివాలున క్రిందకు దూకడానికి ప్రయత్నించబోయాడు.

అది చూచి కమల కంగారుగా, ప్రసాద్ చెయ్యి పట్టుకోని వెనక్కు లాగుతూ “అది నిజం కాదు. ప్రసాద్ బాబూ! అది నిజం కాదు. కోపంతో అన్న మాటలు” అంది గద్గద స్వరంతో.

ప్రసాద్ అప్పుడు ఆ ప్రయత్నం మాని “కమలా! యీ విషయంలో పరిహాసం ప్రళయానికే దారి తీస్తుంది. ఇదేనా బలహీనత” అన్నాడు.

కమల యింకా హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన నుంచి పూర్తిగా కోలుకోలేదు, క్షణకాలం ప్రసాద్ ముఖంలోకి తీక్షణంగా చూచి గబగబ మెట్లు దిగసాగింది. ఆమెను వారిద్దామని ప్రసాద్ ముందు ఒక్క అడుగు వేసి ఆమె చెయ్యి పట్టుకున్నాడు కాని కమల చూపుల తీక్షణత తాళ లేక మరుచటి క్షణంలో పట్టు జారవిడిచారు. కమల చర చర మెట్లుదిగిపోయింది.

ఈలోగా కమలాకరం, రామం, కమలకోసం నాలుగు మూలలా గాలించారు. రామం భవనం వదలి వెనుక వున్న వుద్యానవనంలో వెదకసాగేడు. అక్కడ కూడా చాలా మంది జనం గుమిగూడి వున్నారు. వెదుకుతూ వుంటే వెనుక భుజంమీద ఎవరో చెయ్యి వేసినట్లయి వెనుదిరిగి చూచాడు, కమల కోసం కాని ఆమె కమల కాదు.

రజనిని చూచి నవ్వుతూ “నువ్వా రజనీ, కమల కోసం వెదుకుతున్నాను ఎక్కడా జాడ తెలియడం లేదు” అన్నాడు

రజని చిరుకోపం ప్రదర్శిస్తూ “అందరు కమలకోసం వెదకేవారే! నా కోసం వెదకేవారే లేరు. నా కోసం ఆతురత పడే వారే లేరు. ఏమండీ నేనంత అవాంఛిత వ్యక్తినాచెప్పండి?” అంది.

“ఇతరులు నీ గురించి కంగారు పడవలసిన అవసరం లేదని అందరికి తెలుసు. అరణ్యంలో వదలి వేసినా ఆర నిముషములో ఆశ్రయం పొందగలవు”అన్నాడు రామం.

“అవును. నాలాంటి వారెప్పుడు ఎవరో ఒకరి ఆశ్రయంలోనే వుంటూంటారు. ఎవరో ఒకరి నీడలోనే బతుకుతాను విసుగెత్తి వొకరు వదలి వేస్తే ఇంకొకరి చెంత చేరుతాను. విరహతాపంతో వెయ్యి మంది అర్రులు చాచితే వంతులు వేస్తాను అంతేనా మీరనేది” అంది.

రామానికి రజని పరిహాసపు ధోరణి అలవాటయి పోయింది. అయినా ఆమె తనను గురించే ఆ విధంగా అంటూంటే సహించ లేకపోయాడు.

“రామాన్ని నువ్వింక సరిగా అర్థం చేసుకోలేకపోయాను, లేకపోతే యిలాంటి మాటలు పరిహాసానికైనా అనవు,” అన్నాడు

రజని రామానికి కోపం వచ్చిందని గ్రహించి “వెన్నెల రాత్రులలో కూడా మరింత వేడి ఎలా ఎక్కుతారో నాకర్ధం కాదు. పదండి కాస్త తిరిగి వద్దాము ” అంది.

ఇరువురు బయలుదేరారు. తిరిగి తిరిగి అలసి ఒక చోట కూర్చున్నారు. ఆ వెన్నెలలో రజని ప్రక్కన కూర్చుని వున్న రామంకీ మనస్సులో రమ్యమైన ఆచనలు చెలరేగసాగాయి, “తెల్లటి యీ వెన్నెలలో, తెల్లటి భవనం. నన్నెక్కడికో తరుముకుపోతుంది రజని, పున్నమినాడు యి దృశ్యం యింత అందంగా వుంటుందని నేనూహించలేదు” అన్నాడు.

“కాదు అమావాస్యనాడు యింకా అందంగా వుంటుంది. చుట్టూ నల్లటి కారు నలుపు మధ్యన తెల్లటి భవనం ఆ దృశ్యం యింకా మనోహరంగా వుంటుంది. ఇప్పుడు తెలుపులో తెలుపు లీనమయిపోతుంది. అప్పుడు నలుపులో తెలుపు నలువైపులా దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది” అంది రజని :

“తెల్లటి శరీర ఛాయగల నీబోటి స్త్రీ నల్లటి క్లేశాలను విరబోసుకొని నల్లటి చీరె తెల్లటి జాకెట్లు వేసుకొని వెన్నెలలో ఏకాంతంగా విహరిస్తూ వుంటే...” అని రామం అంటూంటే!

“కామినీ భూతమని అందరు హడలి చస్తారు” అని చిరునవ్వుతో అయినా మీరు ఢిల్లీలో బయలు దేరేముందే చెప్పలేకపోయారా- యీ సంగతి ? నల్లటి చీరె, రవిక వేసుకునే దానిని అయినా తెల్లటి చీరె, పచ్చటి యీ రవికా నాకు శోభించటం లేదా చెప్పండి ?” అంది.

పరధ్యానంగా ప్రక్కలకు చూస్తున్న రామం నిండుగా రజనిని పరీక్షించి చూస్తూ “నన్నెందుకిలా ఉన్మాదుని చేస్తున్నావు రజనీ! శరీర సౌందర్యానికి, నేనిలా చలిస్తున్నానంటే నేను నీచుడిని కాదా?” అన్నాడు.

రజని నవ్వుతూ “నీచులు కారు – రసికులు” అంది.

“పరిహాసం కాదు - రజని నేను దీని గురించే చాలాసార్లు మనస్సులో మదనపడుతూంటాను. నీ సౌందర్యం నన్నెందుకు తన్మయుని చేస్తుంది? నిజం చెప్పు, ఈ అంధునికి దారి చూపించు” అన్నాడు రామం:

“అంధునికి నేత్రాలంటే వుండవు రామం బాబూ. కాని ఆత్మ అనేది ఒకటి వుటుంది. సాధారణంగా నేత్రాలలోటును కూడా అదే పూర్తి చేస్తూ వుంటుంది. అదే ఎప్పుడూ దారి చూపిస్తుంది. అయినా మీరు దీని గురించి బాధపడవలసిన అవసరమేమి లేదు. ఈ ఆకర్షణే శూన్యమయితే సృష్టి అంతరించి పోతుంది. ఔన్నత్య మనేది దీనిని అదుపు ఆజ్ఞలలో వుంచుకోవడంలోనే వుంటుంది, సౌందర్య పిపాస సర్వకాలం లోనూ మానవ హృదయాలలో మెదులుతూనే వుంటుంది. అది మరుగున వుండవచ్చు కాని మాసి పోదు” అంది .

రామం హృదయం లోంచి ఏదో బరువు తీసినట్టయింది, దీర్ఘంగా నిట్టూర్చి “అయితే యిందులో దోషం లేదు ! ఇతర బంధనాల తోటి దీనికి నిమిత్తం లేదా ? మనం చేసే చేష్టల వలన యింక ఏ యితర మానవునికి చాలా కష్టము కలుగకుండా చూచుకోవడం మన కనీస ధర్మం కాదా?” అన్నాడు.

“మీరలా చుట్ట చుట్టి మాట్లాడతారెందుకు? అడగదలచినది స్పష్టంగా ఎందుకు అడగరు? మీరనేది వివాహితను ప్రేమించడం దోషము కాదా అని కాదా ? కాదుముమ్మాటికీ కాదు. ఎందుకంటే ప్రేమించడం ప్రేమించకపోవడం మన యిష్టాయిష్టాలతో నిమిత్తం లేదు. అది ఏలా సంభవిస్తుదో ఏలా పరిణమిస్తుందో ఎవరూ చెప్పలేరు. ఒక వేళ మనం ప్రేమించే వ్యక్తి వివాహితులయినంత మాత్రాన అందులో మన తప్పేముంది. మనస్సులోని భావాల్ని ఆలోచనల్ని అనురాగాన్ని శాసించే అధికారం ఎవరకు లేదు. మనస్సుని మనం శాసించలేక పోయినప్పుడు వాటి చేష్టల్ని మన తప్పులుగా అంట కట్టడం అన్యాయం కాదా? అందుకని స్వేచ్ఛావిహారం చెయ్యమని చెప్పడం లేదు. మీరు చెప్పినట్లు సాధ్యమైనంత వరకూ దాని వలన ఆ వ్యక్తిపై ఆధారపడిన వ్యక్తికి భర్త లేక భార్యకి అన్యాయం జరగకుండా చూచుకోవాలి. అంతే” అంది రజిని.

“అంటే నువ్వనేది-వివాహమయిన వారిని మనస్సులో ప్రేమానురాగాలతో పూజించడంలో తప్పేమీ లేదంటావంతే ? ఏదో దోషం చేస్తున్నామని మనస్సులో మనం బాధపడవలసిన అవసరం లేదంటావు”? అన్నాడు రామం.

“మీరు మనస్సులో బాధ పడవలసిన అవసరం అసలు లేనేలేదు. ఎందుకంటే నేను వివాహితను కాను. సర్వ స్వతంతురాలైన స్త్రీని” అంది రజని.

రామం కొంచెం కోపంతో “నేను నాగురించి మాట్లాడటం లేదు రజని! జనరల్గా మాట్లాడుతున్నాను. అన్నింటినీ యిలా అర్థం తీస్తే ఎలా?” అన్నాడు.

“మీరు ఏ వ్యక్తిని మనస్సులో వుంచుకొని మాట్లాడుతున్నారో తెలుస్తూనే వుంది. నాకు ప్రపంచంలో ఏ బంధనలు లేవు మనస్సులో అంతకంటే లేవు, మీ మనస్సులో మీరు వాటిని నిర్మించుకుని మధనపడకండి” అంది.

రామానికి ఆ విషయంలో సంభాషణ పొడిగించటం యిష్టం లేకపోయింది. మౌనంగా వూరుకున్నాడు. కాని రజని వూరుకోలేదు. “దుఃఖాల్ని, నిరాశల్ని, నిస్పృహల్ని, మనస్సులో అణుచుకుని వుంచుకోవటం అనవసరమని నేను అనడం లేదు. జీవితపు రణరంగంలో గాయపడని హృదయాలు చాలా అరుదుగా వుంటాయి. ఏదో ఒక బాణం దూసుకు పోతుంది. బాధపెడుతుంది. నేను కాదనను. కాని, ఆగాయన్ని పదిలంగా భద్రపరచుకోడానికి ప్రయత్నిస్తారు కోందరు. అదే ఆత్మవంచన అంటాను నేను. ఇంకొకటి. ఆలోచనలు ఆశయాల – వాంఛలు- పరిపరి విధాల మనస్సులో చెలరేగుతాయి- అసంబంద్దమైన, అన్యాయమైన కోరికల్ని అణచుకోవడానికి ప్రయత్నించడం మంచిదే- కాని ఆలాంటి కోరికలు మనస్సులో కలిగాయని బాధపడడం అనవసరము- అవివేకము కూడాను. అంతర్గతంలోని కోరికలలో సహజమైనవి కానీ అసహజమయినవి కానీ - గర్వించగలిగినవి కొన్ని, సిగ్గు పడవలసినవి కొన్ని అంటూ విభేదాలు లేవు. అన్నీ ఒకే తరగతికి చెందుతాయి . మనం పాటించవలసిన సూత్రంఒక్కటే క్రియరూపేణ పెట్టవలసి వచ్చినప్పుడు వాటి పరిమాణాల గురించి ఆలోచించి నిర్ణయానికి రావాలి ఇంకొక మాట మీహృదయంలో స్థానం అందరికి అనవసరంగా యివ్వకండి. తరువాత చాలా బాధ పడవలసి వస్తుంది” అంది.

ఆ చివర మాటలు వింటుంటే రామం హృదయంలో అత్యంతమైన అశాంతి చెలరేగింది, కళ్లల్లో నీరు నిండు కుంది. ఎంత ఆపుకుందామన్నా అవి ఆగలేదు. పక్కకు ముఖం తిప్పుకుని తుడుచుకోవడానికని రుమాలుకోసం జేబులు వెదకసాగాడు. కాని కావలసినది దొరకలేదు. ఆది రజని పసికట్టి “ఏది ఇలా చూడండి రామంబాబూ? దాచుకోవలసింది యిందులో ఏమి లేదు” అంది.

కన్నీరుతో నిండిన ఆ కళ్ళను, రుమాలుతో తుడుస్తూ “కన్నీరు మానవత్వానికే మాయని మచ్చ, అవి మండి పడతాడు ప్రసాద్. కాని అది నేను అంగీకరించను. “మనోదౌర్బల్యానికి నిదర్శనమని మాత్రంఅంటాను.” అంది.

“మనోదౌర్బల్యమే కావచ్చును, కాని నువ్వే చెప్పేవు కదా , మనస్సుని శాసించడం చాలా కష్టం అని. ఆయినా నాకింత సునాయాసంగా ఏలా కన్నీరుబికి వస్తుందో నా కర్థం కాదు! ఆఖరికి విషాదకరమైన పాటలు వింటూంటే కూడా కన్నీరుబికి వస్తుంది” అన్నాడు రామం.

“మీకు సంగీతమంటేయిష్టమని నాకుయింకా తెలియదు. నన్ను పాటలు పాడమంటారా చెప్పండి?” అంది.

ఆశ్చర్యంతో “సంగీత సాధన కూడా చేశావా రజని! నాకు యీ ఆలోచన తట్టనైనా లేదు. ఎందుకో సంగీతానికి నీకు సరిపడడని నాలో ఒక భావం నాటుకుపోయింది” అన్నాడు రామం.

“అలా ఏలా అనుకున్నారు చెప్పండి – మాబోటివారికి సంగీత సాధనం- నృత్యం చాలా సానుకూలంగా వుంటాయి కదూ. చిన్నతనం నుంచి సాధన చేశాను. నృత్వం సాధన చేసాను కాని నాకు నచ్చలేదు - వదలి వేసాను. కాని సంగీతమంటే నాకు యిష్టమే- ఏమేమి పాటలు పాడమంటారు చెప్పండి” అంది రజని నవ్వుతూ.

ఆ తరువాత సుమారు ఒక గంట వరకు రామం రజని మధుర కంఠ స్వరాన్ని మైమరచి విన్నాడు. పాట కచేరీ పూర్తిగా అయిపోయిం తర్వాత రజని. “గంట సేపు నాకు కంఠశోష కలిగించారు. ప్రతిఫలం యివ్వకుండా మిమ్మల్ని నేను వదలి పెట్టను” అంది.

రామం కంటితడి తుడుచుకుంటూ “యివ్వడానికి నాదగ్గర ఏముంది రజని: వున్నదొక్కటి నీ కక్కర లేదు. ఇక నేనేం చెయ్యను?” అన్నాడు.

“అది నా కక్కర లేదని నేను అనలేదు. అది మీ దగ్గర వుంచుకుంటే నాకు మంచిదని నేనన్నాను. కాని మీరే చెప్పారు. వీటికి యిష్టాయిష్టాలతో నిమిత్తం లేదని అయినా అవసరం రావచ్చును. అప్పుడు యాచిస్తాను కాదనరు కదూ?” అంది రజని.

రామం పూర్తిగా కరిగిపోయాడు. “నువ్వు మాట్లాడే దానిలో పరిహాసమేదో పరమార్థమేదో? ఎంత పరీక్షించినా నాకు ప్రసన్నమవదు రజనీ. కానీ యిదే నిజమవుతే నేను నీకీనాడు వాగ్దానం చేస్తూన్నాను. సర్వకాల సర్వావస్తలలోను నీకు నేను అండగా నిలబడుతాను. కాని యిదంతా పరిహాసానికంటున్నానని నీ మనస్సు చెప్తోంది. నీకు నేను అవసరం లేదు. నీ సహాయమే అందరికి కావలసి వస్తుంది. నిశ్చలమైన మనస్సు ధృడమైన విశ్వాసాలు. నీకు పరుల అవసరమేముంది? లేదు రజనీ! నీకు సహాయం చేసే అదృష్టం నాకు కలుగదు. నేను అందుకు నోచుకోలేదు. పైగా భవిష్యత్తులో నీ అవసరమే నాకుంటుంది” అన్నాడు.

“నిజంగా ఏమైనా సహాయం చెయ్యవలసి వస్తుందేమోనని మీరు అలా అంటారు. నోరు జారి - నాకు అండగా వుంటానన్నారు. కాని వెంటనే, ఏమో రజని “రాక్షసి – మాటయిచ్చేనంటే పట్టుకు వదలదని మాట మార్చి వేస్తారు. భలేవారు మీరు. అమాయకులనుకున్నాను. కాని నిజంగా మీరు దేవాంతకులు” అంది రజని నవ్వుతూ.

“ఏడుస్తూ వున్న వాళ్లని నవ్వించడము - నవ్వుతున్న వాళ్లని ఏడిపించటం నీకు పుట్టుకతోనే లభించిన విద్యలా వుంది” అన్నాడు రామం నవ్వుతూ.

“ఇప్పుడు మీరు నవ్వుతున్నారు. ఇంకా సేపు పోయిన తర్వాత ఏమవుతుందో చెప్పలేము, అందుకని యిప్పుడే లేవండి. చాలా ఆలస్యమయింది. నేను చాలా అలసి పోయాను నిద్ర ముంచుకు వస్తూంది. కాసేపు యిక్కడే పడుకుంటాను. మీరు వెళ్లి కాస్త వారిని వెదకి తీసురండి యిక్కడికి - అని అక్కడే ఆ గడ్డిలో పవ్వళించింది. ఆకుపచ్చటి ఆనున్నటి గడ్డిపై వెన్నెలలో, వంపులతో వయ్యారంగే పవ్వళించిన ఆ సుందరాంగి సౌందర్యం రామాన్ని సమ్మోహితుని చేసింది. వెన్నెలలో లీనమైన ఆమె చీరె పచ్చటి ఆ గడ్డిలో ఆమెకొక వింత శోభ నిచ్చింది. రామానికి, ఆమెను వదలి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేకపోయింది.

“లేదు రజని, వెళ్ళితే యిద్దరము కలసి వెళదాం లేకపోతే ఇక్కడే వుందాము. వాళ్లే వెదుక్కుంటూ వస్తారు” అన్నాడు.

“అలసిపోయి కాస్త అలసట తీర్చుకుంటానంటే మీరనవలసిన మాటలివేనా చెప్పండి? బొత్తిగా మీలో కృతజ్ఞత లేదు, గంటసేపు నాచేత గ్రామఫోనులా మీరు కావలసిన పాటలన్నీ పాడించుకున్నారు. ఇప్పుడు కాస్త సహాయం చేసి పెట్టమంటే చెయ్యనంటున్నారు. పైగా ప్రగల్భాలు పలికారు.” అంది రజని.

“అది కాదు రజని, నిన్ను వొంటరిగా యిక్కడ వదలి ...”

“వదలితే ఏమవుతుంది ! ఇదేమి అరణ్యం కాదు. ఇక్కడున్న వారంతా మీలాంటి మనుష్యులే. మీరు లేనప్పుడు వారేమైనా చేసి పోతారేమోనని భయం మీకక్కర లేదు. ఒక వేళయిది అరణ్యమే అయినా, మీరన్నట్లు అర నిమిషంలో ఆశ్రయం చేరుకుంటానని” అంది.

రామం యిక వెళ్ళక తప్పలేదు. రజని మీద కొంచెం కోపం కూడా వచ్చింది. కాని ఆమెతో వాదించి నెగ్గటం అసంభవమని అతనికి తెలుసు. మిగతా ముగ్గురి అన్వేషణార్ధం బయలుదేరాడు. కాని మనస్సు పీకుతునే వుంది. రజని వద్దకు తిరిగి పోవాలనే కోరికను బలవంతాన అణచుకొని తాజ్ మహల్ చుట్టూ తిరగసాగాడు. మనస్సు రజని వద్ద వదలి వచ్చాడు. శరీరం మాత్రం వెదకసాగింది. ఆ కారణం వల్లనే అతనికి ఎవరు కనబడ లేదు. తిరిగి తిరిగి అలసిపోయి వెనుదిరిగి వస్తూంటే కమలాకరం కనబడ్డాడు.

కమల మీనారట్ దిగి కమలాకరంకోసం వెదికి వెదికి చివరకు కలుసుకుంది. కమలను చూచి వెంటనే కమలాకరానికి కలిగిన సంతోషానికి హద్దులు లేవు. కమలకూడా ఆనందంతో వుప్పొంగిపోయింది. ఇరువురు దగ్గరలో వున్న వుద్యానవనం కొలను వద్ద కూర్చుని తనివితీరా అనురాగాన్ని ఆస్వాదించారు.

కమల జరిగింది చెప్పడానికి ప్రయత్నించింది. కాని చెప్పలేకపోయింది. జరిగినదంతా వొక పీడకలలా ఆమెకు కనబడింది. దానిని మరచిపోవడానికి చేసే ప్రయత్నమే కమలాకరంపై అత్యధికమైన అనురాగంగా పరిణమించింది.

“ఈ భవనమే అవిచ్ఛన్నమైన భార్యాభర్తల ప్రేమకు నిదర్శనము. దీనిని కట్టించి షాహజహాను తనకు ముంతాజ్ పైన వున్న ప్రేమను అమరం చేసాడు. మరణం తర్వాత ఏ భర్త యింతకంటే ఎక్కువ యింకేమి చెయ్యలేడు. భార్యాభర్తల బంధం క్షణికమని, క్షణభంగుర మని పలికేవారికీ యిదే తిరుగులేని తార్కాణం. అలా అనే వారంతా కుత్సితులు. కామాంధులు. కఠిన హృదయులు” అంది కమల.

“అంత కోపం పనికి రాదు. కమలా, ఎవరి ఆత్మకు తోచిన రీతిగా వారనుసరిస్తారు. ఇతరుల అభిప్రాయాలు, చేష్టలను విమర్శించి తీర్పు చెప్పే అధికారం ఎవరికీ లేదు - ఇది మంచిది. ఇది చెడ్డది. యిది వుత్తమమైనదీ యిది కుత్సితమని, శాసించే అధికారం ఎవరికీ లేదు. ఇవన్నీ మానవ కల్పితాలు దైవకల్పితాలు వేరు” అన్నాడు కమలాకరం.

“ఇతరుల అభిప్రాయాలతో నాకు నిమిత్తం లేదు. కాని వారి అభిప్రాయాలని యితరుల నెత్తిన బలవంతాన రుద్ది వారిని బాధించి మనోవోభ కలిగించడం అన్యాయం కాదా ?” ప్రశ్నించింది కమల.

“అదే నిజమయితే అది అన్యాయమే కమలా? కాని నువ్వు ఎవరిని వుద్దేశించి అలా అంటున్నావు?”

కమల కెందుకో ఆ వ్యక్తి పేరు చెప్పడం యిష్టం లేకపోయింది. “పోనీ అది వదిలెయ్యండి, కాని యిది నాకు చెప్పండి.. మన విధి, కర్తవ్యము, బాధ్యత మనకు తెలిసి వుండికూడా మనస్సు మనల్ని తప్పుదారి ఎందుకు పట్టిస్తుంది మన శరీరంలోని ఒక భాగమైన మన మనస్సును మనం ఎందుకు శాసించలేము!” అంది.

శాంతస్వరంతో “మనస్సుని శాసించగల వ్యక్తులు కూడా వున్నారు కమలా, వారే జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు. వారి స్మృతీ యితరుల హృదయాలలో అజేయంగా హత్తుకొని పోతుంది. మిగతా వారంతా మట్టిలో కలిసిపోతారు మనమంతా యీ రెండవ తరగతికి చెందిన వ్యక్తులం. క్రోధం - కామం - ఇచ్చ -యీర్ష్య,యివన్నీ విజృంభించి వ్యక్తిత్వాన్నే మటుమాయం చేస్తాయి” అన్నాడు.

“మానవుడు దైవనిర్మితమయినప్పుడు యివన్నీ దైవనిర్మితాలు కావా? అలాంటి సమయంలో వాటిని అణచుకుని సిగ్గుపడవలసిన అవసరం ఏమిటి?” అంది.

“ఇవి దైవనిర్మితాలు కావని ఎవరు అనరు, కాని సృష్టిలో మంచి చెడు లేవా? ఆ విధంగానే మానవునిలో కూడా దైవం కొంత చెడు సృష్టించాడు. అదే లేకపోతే మానవుడు దైవసమానుడవుతాడు .. చివరకు దైవాన్నే ధిక్కరిస్తాడు. మానవుని ఎదుట దైవమే నిస్సహాయుడవుతాడు.”

"అయితే మీరనేది దైవస్వలాభం కోసం యీ లోపాలన్నీ సృష్టించాడంటం, సృష్టికర్త అంత స్వలాభపరుడా?"

సమాధానం చెప్పబోయే సమయానికి రామం ఎదురయ్యాడు. "మీరిద్దరు యిక్కడ వున్నారా? మీకోసం వెతకి నా ప్రాణాలు పోయే పరిస్థితిలోకి వచ్చాను. మీరు చల్లగా యిక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారు" అన్నాడు అక్కడ కూర్చుంటూ.

“మీరు అంత వెదకటానికి మేమేమైనా ఎక్కడైనా పొంచి వున్నామా చెప్పండి. ఇక్కడే కదా వున్నాము. కాస్త మీరు పరికించి చూస్తే కనబడి వుండేవాళ్లము. మనస్సు ఎక్కడో వదలి వచ్చినట్లున్నారు" అంది కాస్త నవ్వుతూ కమల.

కమల మాటలు విని రామం కాస్త కంగారుపడ్డాడు. "అబ్బే అదేమీ లేదు. చీకట్లో కూర్చున్నారు మీరు" అన్నాడు.

నవ్వుతూ "చీకటంటావేమిటి రామం?. పుచ్చపువ్వులాంటి యీ పండువెన్నెలని. నీకేదో మతి భ్రమ కలిగినట్లుంది" అన్నాడు కమలాకరం.

మాట తప్పిద్దామని లేనిమాట తెచ్చుకుని, "కలిగిందేదో కలిగింది గాని, మీరింకలేవండి. మిమ్మల్నందరినీ కూడా తీసుకురమ్మని రజని ఆదేశించింది. అంతా స్వార్థపరులు. ఆవిడ అక్కడ వుంది. మీరు యిక్కడ కూర్చుని చల్లగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇక ప్రసాద్ యెక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఒకళ్ల ధ్యాస యింకొకళ్లకి లేదు. అంతా కలసి వచ్చేం. తర్వాత యిక్కడ ఏవరికి వారే యమునా తీరే అంటే ఎలా.. మధ్యన నా మీద పడిందిదంతా?" అన్నాడూ.

“రామం మనసులో యీర్ష్య దహించుకుపోతుంది. వెన్నెల వేడిమి పుట్టిస్తోంది. యీ చల్లదనం చికాకు కలిగిస్తోంది. బ్రహ్మచారులతో బాధే యిది. వారికి లభించని సుఖమితర్లకి లభిస్తే వోర్చలేరు" అంది కమల నవ్వుతూ.

"అలాంటి అన్యాయపు మాటలు మాట్లాడకండి మాబోటి వారిని చూస్తే మీకంతా పరిహాసమే. వివాహం వ్యక్తులని స్వార్ధపరుల్ని చేస్తుంది. స్త్రీల దృక్పధంలొ ప్రపంచమంతా మరుగునపడి, వారు వారి భర్త మిగులుతారు. ఇక వీరు దేనిని గురించి పట్టించుకోరు" అన్నాడు.

"రజని యిక్కడ వుంటే చప్పట్లు చరిచి నవ్వుతూ శబాష్ రామంబాబు అనును. మీరనిన యీ మాటలు రజనికి శోభిస్తాయి. మీ నోటివెంట వస్తే చాలా అసహజంగా వున్నాయి" అంది కమల పకపక నవ్వుతూ.

"మీరలా అనుకోవచ్చు,కాని రజని మాత్రం అసహజపు మాటలు అనదని నాకు నమ్మకం" అన్నాడు రామం.

కమలాకరం వీరిద్దరి సంభాషణ ఎంటొ కుతూహలంతో వింటున్నాడు. కమల మాటలలోని చురుకుతనం అతనికిఆశ్చర్యం కలగజేసింది. ఆమె మాటలు రామానికి కొంచెం బాధ కలిగించాయని గ్రహించి, “అదేదో ఆవిడనే అడిగి తెలుసుకుందాము పదండి. ఆవిడ ఎక్కడుంది ?” అన్నాడు.

ముగ్గురు కలిసి రజని వున్న ప్రదేశానికి వచ్చారు. వారు వచ్చేసరికి రజని గాఢ నిద్రలో వుంది. వెన్నెలలో ఆదృశ్యం ఎంతో మనోహరంగా వుంది. ఖాంతము. సంపూర్ణత ఆమె సుందరవదనంలో తాండవిస్తున్నాయి. పరిపూర్ణమైన ఆమె అవయవాలు నిద్రలో నిండుగా కాన వస్తున్నాయి. చిత్రకారుడు మక్కువతో చిత్రించిన చిత్రంలా గోచరించిస్తోంది. శిల్పి జీవితమంతా కష్టపడి సంపూర్ణత్వం సాధించిన చలువ రాతి విగ్రహంలా కనబడింది. రెండుమూడు నిమిషాలు ముగ్గురూ మైమరచి అదృశ్యం చూచారు. కమలాకరం కూడా తనను తాను మరచిపోయి నిశ్శబ్దుడై నిలబడిపోయాడు.

రజని, అని పిలచినా జవాబు లేదు. “గాఢనిద్రలో పున్నట్లుంది. యీ సుందర దృశ్యాన్ని ఎంత చూచినా తనివి తీరటం లేదు. ఆమె నిద్ర లేపి అంతా పాడు చెయ్యటం నా కిష్టం లేదు” అంది కమల.

రామం దగ్గరకు వెళ్లి రజనీ అని గట్టిగా పిలిచాడు. ఆ పిలుపుతో రజని వులిక్కిపడిప్రసాద్ అని గట్టిగా అంది - కళ్ళు విప్పకుండానే. ఆమాటలు విని రామం మనస్సు చివుక్కుమంది. కాని వెంటనే అక్కడ, కమలా, కమలాకరం వున్నారని తెలుసుకొని “కాదు రజనినేను” అన్నాడు.

రజని కళ్లు తెరచి వారి ముగ్గురినీ చూచి “పాడుకల వచ్చింది.” అని మధ్యలో ఆగిపోయి “ప్రసాద్ యేడి” అంది.

“ఎంత వెదికినా కనబడలేదు. ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు. ఇక్కడకు మనం వచ్చిన తర్వాత ఎవ్వరికి కనబడినట్లు లేదు” అన్నాడు రామం.

కమల జరిగినది చెప్తామని ప్రయత్నించింది. కాని ఎందుకో ఆమెకు అది చెప్పకుండా వుంటేనే మంచిదనిపించి మౌనంగా వుండిపోయింది. ఆ తర్వాత అరగంట సేపు అందరు ప్రసాద్ కోసం అంతా గాలించారు. కాని జాడ ఏమి తెలియలేదు. చివరకు పార్కు చేసిన కారువద్దకు వెళ్ళి చూస్తే అక్కడ అది కూడా తెలియలేదు.

కారు తీసుకుని వెళ్ళిపోయాడు. “చిత్రంగా వుంది. ఇంతసభ్యంగా ప్రవర్తిస్తాడనుకోలేదు. ఎవరితోను ఏమి చెప్పనైనాలేదు” అన్నాడు రామం.

*****

షేర్ చేయబడినవి

NEW REALESED