Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

దేవుడు వేసిన శిక్ష

దేవుడు వేసిన శిక్ష.

ఉదయం 5:30 గంటలయింది. శీతాకాలం కావడంతో జన సంచారం పెద్దగా లేదు.ఎప్పుడు డ్యూటీ కరెక్ట్ గా చేసే బాలభానుడు ప్రపంచానికి వెలుగు చూపి ఆ గోదావరి నదిలో తన అందం చూసుకుంటున్నాడు.

ఏరా రాజు బారెడు పొద్దెక్కింది ఇంకా మంచం మీద నుంచి లేవలేదా గోదావరిలోకి వెళ్ళవా అంటూ తల్లి కసిరిన కేకతో
మంచం మీద నుంచి బద్దకంగా లేచి దుప్పటి మడతపెట్టి గూట్లో ఉన్న వేప పుల్ల తీసుకుని నోట్లో పెట్టుకుని గోదావరి ఒడ్డుకి 
పరిగెత్తాడు.

ఏదిక్కు లేకపోతే గోదావరే దిక్కు అంటారు కదా. అలాగే అభాగ్యులందరికీ గోదావరి తీరం కడుపు నింపుతుంది 
అలా రాజుకి బ్రతకడానికి ఆ గోదావరి ఆధారం. ఆ గోదావరి తీరంలోని చిన్నపాక లో వారి కాపురం. నిండా పదేళ్లు కూడా ఉండవు. కుటుంబానికి ఆధారం వాడే. ఆ చిన్న వయసులో ఏం పని చేయగలడు అనే ఆలోచన అందరికీ వస్తుంది.

 ఇంతకీ గోదావరి రాజు కడుపుఎలా నింపుతోంది. రాజమహేంద్రవరానికి ప్రత్యేక ఆకర్షణ ఈ గోదావరి. ఆ గోదావరి నది మీద నిర్మించిన వారధి మీద రోజు ఎన్నో రైళ్లు అటు ఇటు తిరుగుతుంటాయి. 

విజయవాడ వైపు వెళ్లే రైళ్లు విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్లు తప్పనిసరిగా ఈ వారధి దాటే వెళ్లాలి. అందుకే ఈ బ్రిడ్జి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది

ఎంతోమంది ప్రయాణికులు గోదావరి బ్రిడ్జి రాగానే కిటికీలోంచి చేతులు బయటకు పెట్టి నమస్కారం చేసుకుని జేబులోంచి నాణాలు తీసి ఆ గోదావరిలో విసిరేస్తారు. చల్లగా చూడమని దండాలు పెట్టుకుంటారు.

అలా రైలు వెళ్ళిపోగానే ఒడ్డున కూర్చున్న రాజు బట్టలు మార్చుకుని గోచి పెట్టుకొని అయస్కాంతం చేతిలో పట్టుకుని గోదావరి నీటిలో దూకి చేతికి దొరికినన్ని నాణేలు పట్టుకుని 
పరిగెత్తుకెళ్ళి అమ్మకు ఇచ్చి మళ్లీ వచ్చే రైలు కోసం ఎదురు చూస్తుంటాడు. మధ్యాహ్నం వరకు ఇది మన రాజు దినచర్య.

అప్పుడే విశాఖపట్నం వైపు వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ గోదావరి బ్రిడ్జి దాటింది. దూరంగా కిటికీలోంచి చేతులు కనబడ్డాయి. చేతిలో అయస్కాంతం పట్టుకుని రాజు గోదావరి నీళ్ళల్లోకి దూకేసాడు. ఎప్పటిలాగే నాణేల కోసం వెతుకుతుంటే చేతికి ఏదో మెత్తగా తగిలింది. ఏదో మంచి చేప దొరికింది అనుకుంటూ ఒడ్డుకు తీసుకుని వచ్చాడు. తీరా చూస్తే అది ఒక ఆడ మనిషి శరీరం పట్టు చీర కట్టుకొని బుగ్గన చుక్క పెట్టుకుని ఒంటినిండా బంగారంతో ఒక పాతికేళ్ల అమ్మాయి. రాజుకి ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది. ఏడుపు తన్నుకు వచ్చింది. భయమేసింది.

ఇంతలో దూరం నుంచి హోటల్ కాంతమ్మ చేతిలో సంచితో నడుచుకుంటూ వస్తోంది. కాంతమ్మ రాజుకు దూరపు బంధువు. గోదావరి ఒడ్డున హోటల్ నడుపుతుంది. ఒరేయ్ రాజు ఏమైంది
అంటూ పక్కనే ఉన్న ఆ యువతిశరీరాన్ని చూసింది. ఒంటిమీద బంగారo కేసి ఒక్కసారి చూసింది. పర్సులోంచి 500 రూపాయల నోటు తీసి రాజుకి ఇచ్చి నువ్ ఇంటికి వెళ్లి పో అంటూ గట్టిగా కసిరింది. రాజుకిది మామూలే. నెలకోసారి ఏదో శవం చేతికి తగులుతుంది. తగిలినప్పుడల్లా భయమేసి కాంతమ్మకి చెప్తాడు. కాంతమ్మ వచ్చి 500 రూపాయలు రాజు చేతిలో పెట్టి ఇంటికి వెళ్లిపోమంటుంది. తర్వాత ఏం చేస్తుందో రాజుకు తెలియదు.

రాజు ఇంటికి వెళ్ళిపోగానే కాంతమ్మ ఆ యువతి వంటి మీద ఉన్న బంగారం నగలన్నీ తీసేసి సంచిలో వేసుకుని ఆ శవాన్ని మళ్లీ గోదావరి నదిలోకి తోసేసింది. ఇది కాంతమ్మ వ్యాపారం. ప్రతి నెల ఏదో శవం కొట్టుకొస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు ఒంటి మీద ఏమీ ఉండవు. కొన్నిసార్లు ఒకటో రెండో గొలుసులు దొరుకుతాయి. కొన్నిసార్లు నెక్లెస్లు కొన్నిసార్లు మంగళసూత్రాలు కొన్నిసార్లు ఉంగరాలు దొరుకుతాయి. ఈసారి బ్రహ్మాండమైన వ్యాపారం తగిలింది. ఏడాది వరకు సంపాదించకపోయిన పర్వాలేదు. అనుకుంటూ కాంతమ్మ బ్యాగు తీసుకుని ఎప్పటిలాగే మార్కెట్లో ఉన్న సుబ్బిశెట్టి కొట్టుకు తీసుకెళ్లి
అయినా కాడికి అమ్మేసింది. దొంగ సొమ్ము ఎంతసేపు ఉంచుకుంటుంది. చేతులు మారిపోవాలి. రూపం మారిపోవాలి.

ఏదో రకంగా డబ్బు సంపాదించేయాలి. అది మంచి మార్గమా చెడు మార్గమా అని ఎవరు ఆలోచించరు. దిక్కుమాలిన చావు చచ్చిన వారి తోటి వ్యాపారం. ఉచ్చం నీచం లేదు. అలా నడిపిస్తోంది ప్రపంచాన్ని డబ్బు. ఈ డబ్బు జబ్బు ఉన్న వాళ్ళందరూ న్యాయం అన్యాయం మర్చిపోతున్నారు.

అలా సంపాదించిన సొమ్ముతో కాంతమ్మ హోటల్ రూపు మార్చేసింది. కొత్త ఫర్నిచర్. కొత్త బిల్డింగు. హాలంతా సెంట్రలైజ్డ్ ఏసి. ఇలా హోటల్ కలకల్లాడిపోతోంది. ఉన్న ఒక్క ఆడపిల్లకి బ్రహ్మాండంగా పెళ్లి చేసేసింది. సొమ్మొకడిది సోకొకడిది. ఏమిటో పాడు లోకం.

ఇలా నాలుగు సంవత్సరాలు గడిచేయి. ఎప్పటిలాగే రాజు తన బ్రతుకు బండి లాగిస్తున్నాడు. కాంతమ్మ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది. కట్టుబొట్టు వేషభాషలోను మార్పులు వచ్చేసాయి. లక్ష్మీదేవి మహిమ. డబ్బుతో కొనలేనిది ఏముంటుంది. టిఫిన్ హోటల్ భోజనం హోటల్ కింద మార్చేసింది. స్టీమర్ లో భద్రాచలం వెళ్లే ప్యాసింజర్లకి భోజనాలు సప్లై చేసే కాంట్రాక్టు కుదుర్చుకుంది. 

ఒకరోజు ఎప్పటిలాగే రాజు గోదావరి దగ్గరకి వెళ్లాడు . గోదావరి ఒడ్డు మీద ఒక యువతి బోర్లా పడుకునుంది . అది చూడగానే ఒక్కసారి కాంతమ్మ అంటూ గట్టిగా అరిచాడు రాజు.కాంతమ్మ హోటల్ కూడా గోదావరి వడ్డున కాబట్టి రాజు గట్టిగా పిలవగానేపరిగెత్తుకుంటూ గోదావరి దగ్గర వెళ్ళింది.

కాంతమ్మ గోదావరి ఒడ్డు దగ్గరికి వెళ్లేటప్పుడు ఒడ్డు మీద ఒక యువతి బోర్లా పడుకొని ఉంది. ఏరా ప్రాణం ఉందా రాజుని అడిగింది కాంతం. 
ఏమో అత్తా నేను వచ్చేటప్పటికి ఈ అమ్మాయి ఇలాగే ఉంది. కాంతమ్మ ఒంటిమీద తన కావాల్సిన దాని గురించి వెతుక్కుంది. కాళ్లకు పట్టీలు లేవు. చేతులకుగాజుగాజులుపగిలిపోయినట్లుగా ఉన్నాయి. మెడలో పసుపు తాడు తప్పితే ఇంకేమీ కనపడలేదు. ఒకవేళ మంగళ సూత్రాలు ఉన్నాయేమో అని తాడు పైకి లాగా చూసింది. పసుపు కొమ్ము వెక్కిరించింది. పొద్దున్న ఏంట్రా ఈ బేరం. దిక్కుమాలిన బేరం అంటూ మళ్లీ గోదారిలోకి తోసయ్యరా అంటూ నిర్ధయగా రాజును ఆజ్ఞాపించింది.

 మళ్లీ ఏమి తోచిందేమో ఏమో ఒకసారి ఈ శవాన్ని బోర్లాగా పడుకోబెట్టు అంటూ రాజుని అడిగింది. రాజు శవాన్ని తిప్పగానే కాంతమ్మ మొహం మీద పడ్డ వెంట్రుకలు తొలగించి ఒక్కసారి మొహంలో ఒక మొహం పెట్టి చూసేటప్పటికి కాళ్ళ కింద భూమి వణుకుతున్నట్టుగా అనిపించింది. గుండెల్లో నుంచి గోదావరిలా దుఃఖం పొంగుకు వచ్చింది. అనేక సార్లు శవాన్ని చూసింది. నిర్దాక్షిణ్యంగా గోదావరి లోకి తోసేసింది. అప్పుడు కన్నీటి బొట్టు కూడా రాలేదు. కానీ ఇప్పుడు ఏడుపు వరదలై ప్రవహించింది. ఆ శవ oఎవరిదో కాదు. కాంతమ్మ కని పెంచి పెద్ద చేసిన కూతురు సరోజినిది. రాజుకు కూడా గుండెల్లోనుంచి దుఃఖం పొంగు వచ్చింది. పాపం మొన్ననే పండగ వచ్చి వెళ్ళింది. 

అప్పుడు బాగానే ఉంది మాట మాత్రం ఏమి సమస్యలు కూడా చెప్పలేదు. ఇంతలో ఏమైంది. ప్రమాదవశాత్తు పడిపోయిందా. లేక ఆత్మహత్య చేసుకుందా. లేదంటే అల్లుడే గోదావరలోకి తోసేసాడా అని పరిపర విధాల ఆలోచించుకుంటూ అలా ఏడుస్తూనే ఉంది. 
దేవుడు అన్యాయాన్ని ఎప్పుడు కనిపెడుతూనే ఉంటాడు. సమయం చూసి తగిన శాస్తి చేస్తాడు. అందుకనే పాపపు పనులు చెయ్యవద్దు అంటారు పెద్దలు. పాపాలకు తగిన శాస్తి ఈ లోకంలో ఉండగానే అనుభవించేలా చేశాడు దేవుడు అంటూ
ఏడుస్తూ జరగాల్సిన కార్యక్రమం గురించి పరిపర విధాల ఆలోచించుకో సాగింది. ఎప్పటిలాగే ఈ శవాన్ని గోదావరిలోకి తోసెయ్యలేదు. కన్న కడుపు. గోదావరిలోకి తోసేస్తే జలచరాలన్నీ పీక్కు తినేసి ఏమైనా మిగిలితే అది గోదావరి తో పాటు సముద్రంలో కలిసిపోతుంది .ఒకవేళ పోలీసులు కి అప్పచెప్తే పోస్టుమార్టం అంతా పూర్తి చేసి అనాధ శవం కింద దహన సంస్కారాలు చేస్తారు.

 ఇదే కొంతవరకు నయంఅనుకుంటూ ఒక స్థిర నిర్ణయానికి వచ్చి పోలీస్ స్టేషన్కు వెళ్లి గత ఐదు సంవత్సరాల నుంచి జరిగిన వ్యవహారం అంతా పూస గుచ్చినట్లు చెప్పి ఈరోజు కూడా దొరికిన శవం తన కన్న కూతురుదని నిజం చెప్పి పోలీసులకు లొంగిపోతుంది. ఇన్నాళ్లు సంపాదించిన దొంగ సొమ్ము అమ్మిన సుబ్బిశెట్టి షాప్ అడ్రస్ కూడా చెప్పి సంతృప్తిగా జైలుకు వెళ్ళిపోతుంది. 

పోలీసులు ఆ శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం చేయించి మానవతా దృక్పథంతో కాంతమ్మ గారి చేత కర్మకాండం జరిపిస్తారు. ఇవన్నీ చూసి రాజు భయపడి ఎటో పారిపోతాడు. పోలీసులు సుబ్బిశెట్టిని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపు తారు.

కాంతమ్మ బతుకు ఇలా చివరికి పోలీస్ స్టేషన్లో తెల్లారి పోయింది.గుట్టుగా బతుకు బండి ఈడ్చే రాజు బ్రతుకు కాంతమ్మ మూలంగా ముక్కలు అయిపోయింది. ఎదుటివాళ్ళు చేసే పని మంచి పని కాదని తెలుసుకోలేని పసితనం బ్రతుకు ఎటు కాకుండా పోయింది. చేస్తున్న పని తప్పని తెలిసి కూడా కేవలం డబ్బు మీద ఆశతో చేసిన పనికి దేవుడు వేసిన శిక్ష.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
         కాకినాడ 9491792279