Read Wedding in the garden by M C V SUBBA RAO in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

తోటలో పెళ్లి

తోటలో పెళ్లి

మధ్యాహ్నం మూడు గంటలు అయింది. 

గదిలో మంచం మీద పడుకున్న ఊర్మిళ కి "పోస్ట్ "అనే కేక వినపడింది. ఉత్తరాలు రాయడం తగ్గిపోయిన ఈ రోజుల్లో ఊర్మిళ ఆ కేక కొత్తగా వినపడింది. వెంటనే లేచి వీధిలోకి వచ్చేటప్పటికి పోస్ట్ మాన్ ఏదో ఒక శుభలేఖ చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. 

అసలే వైశాఖమాసం పెళ్ళిలో ముహూర్తాలన్నీ ఈ నెలలోనే. ఎవరిది అబ్బా! ఈ శుభలేఖ అనుకుని ఫ్రమ్ అడ్రస్ చూస్తే భర్త రామారావు ఫ్రెండ్ రాజిరెడ్డి అయినవిల్లి నుంచి పంపించిన శుభలేఖ. 

శుభలేఖ తెరిచి చూసిన వెంటనే చాలా ఆశ్చర్యం అనిపించింది ఊర్మిళకి. "తోటలో పెళ్లికి ఆహ్వానం" అని రాశారు హెడ్డింగ్. వరుడు పేరు, వధువు పేరు, ముహూర్త సమయం, తేదీ అన్ని మామూలే క్రింద మటుకు ఆహ్వానించే వాళ్ళ పేర్లు ఉన్నాయి. 

రాజిరెడ్డి ఆ ఊర్లో బాగా మోతుబరి రైతు. కొబ్బరి తోటలో వరి పొలాలు బాగా ఉన్నవాడు. పైగా సొంత వ్యవసాయమే చేస్తాడు.
ఎన్నోసార్లు వాళ్ల ఊరు రమ్మని చెప్పిన వెళ్లడమే కుదరలేదు రామారావు దంపతులకు. ఈసారి తప్పకుండా పెళ్లికి వెళ్లాలి. అందులో తోటలో పెళ్లి అంటున్నారు అనుకుంది ఊర్మిళ.
 భర్త ఆఫీస్ నుంచి రాగానే శుభలేఖ చేతిలో పెట్టి "చూడండి శుభలేఖ ఎంత బయట అందంగా ఉందో లోపల సారాంశం కూడా అంతే అందంగా ఉంది.. "తోటలో పెళ్లి " అంటేనే ఏదో ఒక మధురానుభూతి కలుగుతుంది. చిన్నప్పుడు మా ఊర్లో పెళ్లిళ్లు జరిగినప్పుడు మగ పెళ్లి వారు ముందుగా తోటలో దిగడం ఒక ఆచారం. ఇది తూర్పు వైపు వారి ఆచారం అని చెప్పిన ఊర్మిళ మాటలకి రామారావు శుభలేఖ తెరిచి చూసి సారాంశం చదివి తప్పకుండా వెడదాం! అని ఆనందంగా చెప్పాడు భార్యతో రామారావు.

  రామారావు ఆఫీసుకు రెండు రోజులు సెలవు పెట్టి మర్నాడు ఉదయం కారులో అమలాపురం చేరుకుని హోటల్ రూమ్ తీసుకుని స్నానాలు చేసి అయినవిల్లి లో ఉన్న రాజిరెడ్డి ఇంటికి చేరుకున్నారు.

రాజిరెడ్డి దంపతులు సాదరంగా ఆహ్వానించారు వాళ్ళిద్దరిని. రాజిరెడ్డి భార్య అంత హడావుడిలో ఉన్న ఇద్దరికీ రెండు కప్పులతో పాలు తీసుకొచ్చి ఇచ్చింది. రాజిరెడ్డి ఇల్లు చూడడానికి చాలా అందంగా ఉంది. ఇంటి ముందు కొబ్బరాకులతో వేసిన పందిరి నేలంతా చక్కగా అలికి ముగ్గులు పెట్టారు .ఇంటి గుమ్మాలకి మావిడాకు తోరణాలు దానికి తోడు పురాతనమైన పెంకుటిల్లు .చూడముచ్చటగా ఉంది పెళ్లి వారి ఇల్లు.

"రాత్రి ఏడు గంటలకు పెళ్లి! ఇప్పుడు ఒక అరగంటలో మనం తోటకి వెళ్ళిపోదాం! అన్నాడు రాజిరెడ్డి. తోట ఎంత దూరమని అడిగాడు రామారావు ?ఎంత !ఒక కిలోమీటర్ ఉంటుంది రాజిరెడ్డి సమాధానం. 

ఒక అరగంటలో పెళ్ళికూతురుని తీసుకుని ముందు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా కార్లలో తోటకు చేరాము. ముందుగా తోటలోకి అడుగు పెడుతుంటే తూర్పు వైపున మోటారు అమర్చిన నీళ్ల బావి ఉంది. అందరూ కార్లు దిగి కాళ్లు కడుక్కుని తోటలోకి నడుచుకుంటూ వెళ్ళాం.

కోనసీమ అంటున్నాం కదా! ఇంక ఏ తోట ఉంటుంది. అందమైన ఆకులతో నిట్ట నిలువుగా ఒక సైనికుడిలా నిలబడి ఉన్నాయి కొబ్బరి చెట్లు. కొబ్బరి తోట మధ్యలో అరటి మొక్కలు, జామ చెట్లు ,బత్తాయి చెట్లు ,పనస చెట్లు పెంచుతున్నారు. పనస చెట్లు నిండా కాయలతో చూడముచ్చటగా ఉన్నాయి. ఎవరు నీరు నారు పోసి పెంచక్కర్లేకుండా పెరిగే తాటి చెట్లు కూడా ఉన్నాయి. తోటంతా అందమైన ఆకుపచ్చ తివాచీ పరిచినట్లు గడ్డి మొలిచి ఉంది.

 ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు. . కానీ ఇక్కడ గాడి పొయ్యి మీద వంటలు. ఎర్రటి పంచలు కట్టుకుని వంట బ్రాహ్మణులు వంటలు వండే ప్రయత్నంలో ఉన్నారు. రాజిరెడ్డి పూర్తిగా వెజిటేరియన్. ఇంట్లో ఏ శుభకార్యం జరిగిన వెజిటేరియన్ వంటకాలతోటే విందు పెట్టడం మొదటి నుంచి అలవాటు. చేసేది శుభకార్యం. జీవ హింస చేసి జీవులను బాధ పెట్టకూడదని అతని సిద్ధాంతం 

వంటలు వండే గాడి పొయ్యికి కొంచెం దూరంలో చుట్టూ తాటాకు దడులు కట్టి డైనింగ్ టేబుళ్ళు ,కుర్చీలు వేసి భోజనశాల ఏర్పాటు చేశారు. ఆకుపచ్చని తాటాకు దడులు చూసి చాలా రోజులైంది. పూర్వ కాలంలో ఇంటి చుట్టూ ప్రహరీ గోడలా కట్టుకునేవారు. దగ్గరలో ఉన్న గోదావరి మీద నుండి వచ్చే గాలికి తోడు, ఫ్యానులు కూడా ఉండడంతో ప్రాణం హాయిగా అనిపించింది. చెట్ల మధ్య నుంచి వచ్చే గాలితో తాటికాయలు వాసన ,పచ్చి గడ్డి వాసనతో మిళితమై వంటల మసాలా గంధంతో కలిసిపోయింది. అందరం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాం. ఇంతలో రాజిరెడ్డి తమ్ముడు , భార్య ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్లి అతిధులను అందర్నీ పలకరించి వస్తున్నారు.

ఇంతలో వడ్డన ప్రారంభమైంది. చక్కగా అరిటాకులో పూర్వకాలం పెళ్లిల్లో చేసిన విధంగా జీడిపప్పు వేసిన ఉప్మా అల్లం చెట్నీ కొబ్బరి చెట్నీ వడ్డించారు. ఎప్పుడూ తినే డైనింగ్ టేబుల్ ఏ కదా! 

సరదాగా అలా పనస చెట్టు కింద కూర్చుని తిందాము ! అన్న ఊర్మిళ మాటలకి" సరే అన్నాడు రామారావు. పనస చెట్టు కింద కూర్చుని టిఫిన్ తింటుంటే చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి ఊర్మిళ కి.

తన చిన్నతనంలో దొడ్లో ఉన్న పనస చెట్ల కింద బొమ్మల పెళ్లి గుర్తుకొచ్చింది. ఇంత నూనె పోసి ఉప్మా ఈ రోజుల్లో ఎవరు చేయట్లేదు. తినట్లేదు కూడా. నూనెతో ఉడికిన ఉప్మా ఎంత రుచిగా ఉంది. దాని తోడు అల్లం చట్నీ మధురంగా ఉంది. కోనసీమ వంట మజాకా!  

ఇంతలో ఎవరో ఒక ట్రే లో నాలుగు గ్లాసులు అల్లం వేసిన మజ్జిగ ,కొబ్బరి నీళ్లు పట్టుకుని వచ్చారు. కోనసీమ కదా !అని కొబ్బరి నీళ్లు లాగించింది ఊర్మిళ.

అమ్మయ్య చాలా హాయిగా ఉంది టిఫిన్. ఇలాంటి టిఫిన్ తిని చాలా రోజులైంది అనుకొని అలా తోటలో నడుచుకుంటూ ముందుకు బయల్దేరారు ఆ దంపతులు.

కొంత దూరం దూరం వెళ్లేసరికి ఆ తోటలోని పెద్ద తాటాకుల పందిరి, మావిడాకులు తోరణాలు ,అతిథులు కూర్చోడానికి కుర్చీలు, దాని ఎదురుగుండా పెద్ద కళ్యాణ్ మండపం. కళ్యాణ మండపం అంటే ఆధునిక సామగ్రితో నిర్మించిన మండపం కాదు. 

కూర్చునే చెక్కబల్లల మీద సన్నటి పరుపులు వేసి దాని మీద రంగురంగుల పట్టు గుడ్డలు పరిచి పైన కొబ్బరాకులతో వేసిన పందిరి ,తోరణాలు మామూలే అలంకరణ అంతా ప్లాస్టిక్ పూలు కాదు గోదావరి జిల్లాలో దొరికే పువ్వులు. వెనకాల వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ బొమ్మలు చాలా ముచ్చటగా ఉన్నాయి

  పెళ్లి సాయం కాలం కదా !మండపం ఇప్పుడిప్పుడే కడుతున్నారు. కళ్యాణ మండపం మీద ఇరవై మంది పైగా కూర్చో వచ్చు అంత విశాలంగా ఉంది. దానికి తోడు విద్యుత్ దీపాలు అలంకరణ. ఇప్పుడే ఇంత అందంగా ఉంటే రాత్రికి ఆ విద్యుత్ దీపాల కాంతిలో కొబ్బరి ఆకులు, మావిడాకులు రంగుల రంగుల పువ్వులు మెరిసిపోతూ కనబడతాయి .

ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో రాజిరెడ్డి వచ్చి ఏరా టిఫిన్ తిన్నావా! ఏమైనా తాగుతావా కాసేపు రెస్ట్ తీసుకో !వెనకాల మన ఇల్లు ఉంది అంటూ ఎవరినో పిలిచి తీసుకెళ్లమని చెప్పాడు. ఆ ఇల్లు పెద్ద విశాలమైన మూడంతస్తుల భవనం . క్రింద హాల్లో ఒక ఇరవై దాకా మడత మంచాలు పరిచి ఉన్నాయి. రాత్రి కారు ప్రయాణం, వచ్చినప్పటి నుంచి తోటలో తిరగడం వల్ల అలిసిపోయి ఉన్నావేమో మడత మంచి మీద పడుకునే సరికి నిద్ర పట్టేసింది.

అలా నిద్రపోయిన మేము ఎవరో తట్టి లేపి "భోజనాలకు రండి అని పిలిచారు. వెంటనే మొహం కడుక్కుని భోజన శాల దగ్గరికి వెళ్ళేటప్పటికి పొద్దున కన్నా ఎక్కువ జనం కనిపించారు. మేము కూడా ఒక మూల డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఆకులో వడ్డించిన పదార్థాలు కేసు ఒకసారి చూసేటప్పటికి ఆత్మ రాముడు తొందరపెట్టాడు. 

 ఆకుపచ్చ అరిటాకులో మామిడికాయ పప్పు, వంకాయ జీడిపప్పు కూర ,పనసపొట్టు కూర ,అప్పడాలు, వడియాలు , ము క్కల పులుసు, బూర్లు ,పులిహార ,పనస తొనలు, ,మామిడిపండు, కమ్మని నెయ్యి, గడ్డ పెరుగు తో విజృంభించేశాం. ఎంత ఆత్మీయంగా ఉంది వడ్డన. రాజిరెడ్డి బంధువులు ప్రతి టేబుల్ దగ్గరికి వచ్చి అన్ని అందాయా లేవో! చూసుకోవడం చాలా బాగుంది అనిపించింది. భోజనం చేసి వచ్చిన తర్వాత ప్లేట్లో పెట్టిన తమలపాకు వక్క తీసుకుని సున్నం రాసుకుని ఆనందంగా నోట్లో పెట్టుకుని నవ్వుతూ మళ్లీ తోటలోని ఇంటికి వచ్చేసాం. కాసేపు నడుము వాల్చి పెళ్లికి తయారయ్యాం. 

పెళ్లి మండపం దగ్గరికి వచ్చేటప్పటికి అప్పటికే పెళ్లి వారు వచ్చేసారు. పెళ్ళికొడుకు కూడా చాలా అందంగా ఉన్నాడు పెళ్లికూతురు లాగే. ఇద్దరూ విదేశాల్లో ఉద్యోగం. అయినా భారతీయ సాంప్రదాయాన్ని ఎక్కడ వదలలేదు. అమ్మాయికి మేకప్ లేదు. అబ్బాయికి హంగులు లేవు. పెళ్లి వారి మర్యాదలో రాజిరెడ్డి దంపతులు బిజీ అయిపోయారు. మధ్యలో చెరుకు రసం పూతరేకు, కాస్త కారం బూంది ,రుచి చూసి పెళ్లి చూడడం లో మునిగి పోయాము.

పెళ్లి మండపం మీద పెళ్లి కొడుకు ,పెళ్లి కూతురు ,వేద పండితులు ,ఆడపిల్ల వారు ,మగపిల్లవారికి సంబంధించిన ముఖ్యులు మాత్రమే ఉన్నారు. పెళ్లి ఆహుతులు అందరికీ శుభ్రంగా కనబడింది. పెళ్లి మండపం గులాబీ పూలతో మల్లెపూలతో చాలా అందంగా ఉంది. వీడియో వాళ్ళు ఫోటోలు వాళ్ళు అవసరమైనప్పుడే కళ్యాణమండపం దగ్గరికి వెళ్తున్నారు కానీ మిగతా సమయం అంతా ఆహుతలు మధ్య కూర్చున్నారు.

రాజేంద్ర రెడ్డికి సనాతన ధర్మం అంటే ప్రాణం. ఆచారాలు సాంప్రదాయాలు తప్పనిసరిగా పాటిస్తాడు. పెళ్లి అంతా సాంప్రదాయ బద్ధంగా తంతులేవి దాటించేయకుండా మంత్రాలు వినపడేలాగా పాతకాలం పెళ్లిళ్లు లాగా జరిపించారు వేద పండితులు. చివర్లో వేద పండితుల ఆశీర్వచనాలు గోదావరి జిల్లాల గొప్పతనాన్ని గుర్తుచేసేయి.

 సుముహూర్త సమయం అయిన తర్వాత భోజనాలకు ఆహ్వానం వచ్చింది. మళ్లీ మామూలే గోదావరి జిల్లాల భోజనాలు మళ్లీ గుర్తు చేశాయి.

బంగాళదుంప నిమ్మరసం కూర, మసాలా వడ,దొండ ఫ్రై సాంబారు అప్పడాలు వడియాలు కోటయ్య కాజా బందరు లడ్డు పెరుగు ఆవిడ గడ్డ పెరుగు తెల్లని పువ్వు లాంటి అన్నం కమ్మని నెయ్యి ఇంకేముంది ఒళ్ళు మరిచిపోయాం. 

పెళ్లి అయ్యేసరికి రాత్రి పదకొండు గంటలయింది. రాజిరెడ్డికి కృతజ్ఞతలు చెప్పి మంచి పెళ్లి చూసామనే అనుభూతితో అమలాపురం లాడ్జికి చేరుకుని మర్నాడు ఉదయమే ఊరికి బయలుదేరాము.

పెళ్లంటే ఒక సందడి. ఒక ఆనందం. మర్చిపోలేని అనుభూతి. అది పెళ్లి చేసుకునే వారికి ,చేసేవారికి ,వచ్చిన అతిథులకు కూడా ఒక తీపి గుర్తుగా ఉండిపోవాలి. పెద్ద కళ్యాణ మండపాలు, ఖరీదైన క్యాటరింగ్, ఫోటోలు ,వీడియోలు డాన్సులు, ఈ హడావుడితోటి పెళ్లి ఎవరు చూడట్లేదు. సుముహూర్తం అయిన తర్వాత గిఫ్ట్ ఇచ్చేసి భోజనం లాగించేసి ఇంటికి వెళ్ళిపోవడమే తప్పితే ఈ రోజుల్లో ఇంత స్థిమితంగా ఇంత ఆనందంగా పెళ్లి జరగడం ఎక్కడ చూడలేదు అనుకున్నారు రామారావు దంపతులు.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279