అది నాకు ఇష్టం లేదు.
"అమ్మా ! ఆకలేస్తుంది అన్నం పెట్టవే! అని అడుగుతున్న పదేళ్ల కొడుకు రాఘవని ఉండరా ఇంకా నాలుగు పేపర్లే ఉన్నాయి అవి కూడా దిద్దేసి పెడతాను. ఒక పని అయిపోతుంది. లేదంటే పేపర్లో దిద్దాలంటే బద్ధకం వస్తోంది రా! నీకు ఆకలి కాదురా! వెధవా!సెలవులు కదా ఏమి తోచట్లేదు అనుకుంటాను. టిఫిన్ తిని రెండు గంటలు కూడా అవలేదు అoటు కొడుకుకి సమాధానం ఇచ్చి తెలుగు పేపర్ లో దిద్దడంలో మునిగిపోయింది ప్రత్యూష.
ప్రత్యూష ఆ ఊరిలో పేరు మోసిన కాన్వెంట్లో తెలుగు టీచర్ గా పని చేస్తూ ఉంటుంది. అది అసలే ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్. ఇంకేముంది తెలుగు పేపర్ దిద్దడం అంటే చాలా ఈజీ. కారణం ఏంటంటే తెలుగు అంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలకి చాలా కష్టమైన సబ్జెక్టు అంటారు.
అందుకని తప్పులు ఎక్కువగా రాస్తారు. పిల్లలు కూడా ఏదో పాస్ మార్కుల కోసం ప్రయత్నం చేస్తున్నారు కానీ తెలుగు నేర్చుకోవాలని ఉత్సాహం ఎవరికీ ఉండట్లేదు. చిన్నప్పటినుంచి వర్ణమాల బదులు ఆంగ్ల అక్షరాలు తో ప్రాథమిక విద్య ప్రారంభం అయింది కాబట్టి తెలుగు సబ్జెక్ట్ అంటే చాలా భయం పిల్లలకి ఈ రోజుల్లో.
ఇప్పటికి సుమారుగా నలభై పేపర్లు పైగానే దిద్దింది ప్రత్యూష. అందులో అందరూ ఒక వ్యాసం రాసిన విధానం చూస్తుంటే ఏడుపు వచ్చింది ప్రత్యూషకి. ఇంతకీ ఆ వ్యాసం ఏమిటి అని మనకు కూడా తెలియాలి కదా. ఆ వ్యాసం ఏ విషయం మీద అంటే " మీ ఇంట్లో ఉండే ఆధునిక వస్తువులలో నీకు ఇష్టం లేనిది ఏది? ఎందుకు? ఇది వ్యాసం రాయవలసిన విషయం.
హమ్మయ్య ఆఖరి పేపర్ దగ్గరకు వచ్చేసాను. అనుకుంటూ పేపర్ తీసింది. సాధారణంగా టీచర్లు పేపర్లు దిద్దేటప్పుడు పైన విద్యార్థి పేరు చూడరు. ఇది క్లాసులో జరిగే పరీక్షలకు మాత్రమే పైన విద్యార్థి పేరు ఉంటుంది . ఆ ఆఖరి పేపర్లో ఆ విద్యార్థి రాసిన విధానం చూస్తుంటే గుండె లోతుల్లోంచి వచ్చినట్లుగా అనిపించింది. ఏదైనా విషయం గురించి స్వీయ అనుభవాలు రాస్తే ఆ వ్యాసం కానీ కథ కానీ చదివే వారికి ఉత్సాహం పెంచుతుంది.
"నేనేమో ఇంట్లో అందరికంటే చిన్నవాడిని. నా ఒక్కడికే కొనలేదు మా నాన్న. కాలేజీలకు వెళ్లే మా అన్నయ్యలు అందరికీ కొనేశాడు. మా నాన్నకి ,మా అమ్మకి కూడా ఉంది. మా బామ్మకి కూడా ఉంది. నాకు జ్ఞానం తెలిసే వరకు ఇంట్లో అందరూ నాతో మాటలు చెప్పించుకుని నవ్వుకుంటూ ఆడుకుంటూ కాలక్షేపం చేసేవారు. సెలవులు వస్తే నాతో గడిపేవారు. నన్ను ఆటలు పట్టించేవారు. ఎత్తుకొని ముద్దాడేవారు. ఏమి తెచ్చిన ముందుగా నాకే పెట్టేవారు. ఇప్పుడు పెడుతున్నారు కానీ ఇప్పుడు నాతో మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు.
అందరూ దాంతోటే మాట్లాడుతున్నారు. నాన్న ఇంట్లో ఉన్నంతసేపు ఆఫీసు విషయాలు, బంధువులతోటి మాట్లాడుతూనే ఉంటాడు. అమ్మ వంట చేస్తున్నంతసేపు అమ్మమ్మ తోటి ఏదో మాట్లాడుతూనే ఉంటుంది. లేదంటే తన ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతుంది. ఇదివరకు అది మా ఇంట్లోకి ఒక రానప్పుడు నేను ఒంటిట్లోకి వెళ్లి కొంగు పట్టుకుని లాగితే అమ్మ నన్ను చంకనెత్తుకొని ముద్దులాడి వంటలు వండుకునేది. ఇప్పుడు నా ధ్యాసే లేదు. రాత్రి పక్కన పడుకున్న ఎవరికో వాట్సాప్ మెసేజ్ లు పెడుతూనే ఉంటుంది. అమ్మా! నిద్రస్తోంది అంటే చెయ్యి నా మీద వేస్తుంది కానీ మనసంతా దాని మీదే ఉంటుంది. అలా అయిపోయింది నా పరిస్థితి.
పోనీ బామ్మ దగ్గరికి వెళ్లి కథలు చెప్పించుకుందాం అంటే బామ్మ మా ఇంట్లో అందరికంటే ఎక్కువగా దానితోటే కాలక్షేపం చేస్తుంది. అన్నయ్య తిన్నంగా ఉండక బామ్మ కి మెసేజ్లు పెట్టడం నేర్పేసాడు. ఇంకేముంది బామ్మ చెలరేగిపోతోంది. మెసేజ్లు బోర్ కొట్టినప్పుడు ఉపన్యాసాలు పెట్టుకుని వింటుంది. ఇంక నాకేం చెప్తుంది కథలు. ఆవిడకి ఇదివరకు కాలక్షేపం అవ్వక నాతోటి కాలక్షేపం చేసేది.
ఇంకా అన్నయ్యలు నాతో ఆడుకోవడం మానేశారు. నన్ను ఎత్తుకునే చేతులతో దాన్ని ముద్దుగా మురిపెంగా చూసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి టైం పాస్ చేస్తున్నారు. ఆస్తమాను దాన్ని అలా చూస్తూనే ఉంటారు.
డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం వైపు చూడడం లేదు. బాత్రూంకి వెళ్ళేటప్పుడు కూడా పట్టుకెళ్ళిపోతున్నారు . ఇదివరకు నన్ను పక్కన కూర్చోబెట్టుకుని గోరుముద్దలు పెట్టేవారు. ఇప్పుడు ముద్దలు కాదు కదా! ముద్దులు కూడా పెట్టట్లేదు ఇలా ఉంది నా పరిస్థితి ఆ ఇంట్లో. నాకంటే అది ఎక్కువైపోయింది.
ఇంక చిన్న అన్నయ్యకి ఫోటోలు పిచ్చి. నాకు రకరకాల ఫోటోలు. ఇంట్లో ఉన్న కుక్కకి ,పిల్లికి, ఆకాశంలో ఎగిరే పక్షికి, పచ్చగా ఉన్న చెట్టుకి అన్ని ఫోటోలే. ఇవన్నీ నాకు చూపించరు . పైగా నన్ను చిన్న పిల్లవాడు అంటారు. నాక్కూడా కొనిచ్చారు లెండి ఒక బొమ్మ. ఉలుకు లేదు ,పలుకు లేదు. నాకు కోపం వచ్చి నేల మీద వేసి కొట్టాను. దెబ్బకు రెండు ముక్కలైంది. ఎప్పుడైనా! మా పని మనిషిని పలకరించేది. అది కూడా మానేసింది. ఇంతకీ నాకు ఇష్టం లేని వస్తువు జపాన్ లో పుట్టి జగమంతా వ్యాపించిన వస్తువు . దాని పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు అని వ్యాసం చదివిన టీచర్ ప్రత్యూష పేపర్ పైనున్న పేరు చూసి ఆశ్చర్యపడింది.
వెంటనే కుటుంబ సభ్యులందరికీ పిలిచి ఆ పేరు చూపించింది. ఆ పేరు చూసి ఎవరికీ నోట మాట రాలేదు. ఇంకెవరు ఆ వ్యాసం రాసింది తన ఆఖరి కొడుకు రాఘవ అని చూసి నోరు వెళ్ళబెట్టింది. జరిగిన తప్పు తెలుసుకొని కొడుకుని ఎత్తుకొని ముద్దాడింది ప్రత్యూష.
ఈ రోజుల్లో పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి. పెద్దవాళ్ళు తమని నిర్లక్ష్యం చేస్తున్నారని పిల్లలు అనుకుంటే చాలా ప్రమాదం. పసితనంలో చాలా జాగ్రత్తగా చూడాలి వాళ్ల మనసు గాయపడకుండా.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279