Read Food donation by M C V SUBBA RAO in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అన్నదానం

అన్నదానం.

శీతాకాలం ఉదయం నాలుగు గంటలు అయింది. ఓ పక్క చలి వణికిస్తున్న రిక్షాలో ముడుచుకుని కూర్చుని బేరాలు కోసం ఎదురుచూస్తున్నాడు నూకరాజు. "ఈ ఆటోలు వచ్చి రిక్షా వాళ్ళ కడుపు కొట్టేసాయి. రోజు ఈపాటికి విజయవాడ ప్యాసింజర్ బేరాలు దొరికేవి. ఇప్పటికే రెండు పూటలా అన్నం తినడానికి సంసారం పోషించుకోవడానికి ఆదాయం సరిపోవడం లేదు ఇక ముందు ఎలా ఉంటుందో ! అనుకుంటూ ఆ చీకట్లో అలా ఎదురు చూడసాగాడు. 

ఇంతలో ఒక జంట భుజాన ఒక బ్యాగ్ తగిలించుకొని బ్యాటరీ లైట్ వెలుగులో నడుచుకుంటూ వచ్చి రిక్షా ముందు ఆగారు. "రైల్వే స్టేషన్ కి ఎంత తీసుకుంటావు అని అడిగారు. 20 రూపాయలు అండి. అమ్మో 20 రూపాయలా! ఆటో అయితే ఐదు రూపాయలే కదా !అంటూ బేరమాడుతూ నిల్చున్నారు. చివరికి 15రూపాయలకి బేరం కుదుర్చుకుని ఇద్దరూ ఎక్కి కూర్చున్నారు. నూకరాజు నెమ్మదిగా రిక్షా తొక్కుకుంటూ వెళ్తున్నాడు. బాబు కొంచెం త్వరగా పోనీయి టైం అయిపోయింది అంటూ తొందర పెట్టారు. అయినా వేగం పెంచలేకపోయాడు నూకరాజు. ఒంట్లో శక్తి లేదు. వయసు కూడా పెద్దదే. దానికి తోడు లావు. కాళ్లు నొప్పులు.

రాత్రిపూట భోజనం చేయడానికి బేరాలు లేక ఇంట్లో పొయ్యి వెలగలేదు. గ్లాసుడు మంచినీళ్లు దిక్కయింది. ఎంత తొక్కిన బండి ముందుకు సాగడం లేదు. అలా మొత్తానికి చెమటలు కక్కుకుంటూ రైల్వే స్టేషన్ దగ్గర దింపేసాడు. అలా తిరుగు ప్రయాణంలో రామారావు పేట లో కూడా బేరాన్ని దింపేసి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఉదయం 8 గంటలయింది. ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు ముట్టలేదు. ఎక్కడైనా టీ తాగుదామని అనుకున్న సంపాదించిన సొమ్ము తనకే ఖర్చు పెట్టుకుంటే పిల్లలకి భార్యకి ఎలాగని అలా నీరసంగా ఇంటికి వచ్చేసాడు నూకరాజు. నూకరాజుకి ఇదేమి కొత్త కాదు.ప్రతిరోజు అలాగే ఉంటుంది. 

అప్పటికే భార్య పిల్లలు లేచారు. పిల్లలు ఆకలి అంటూ ఏడుస్తున్నారు. భార్య సత్యవతమ్మ నూకరాజు జేబులోంచి డబ్బులు తీసుకుని టీ కొట్టు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి రెండు బన్నులు టీ తీసుకుని వచ్చి పిల్లలకు పెట్టింది. నూకరాజు ఆశగా భార్య వైపు చూశాడు. ఆ చూపులో ఎన్నో అర్థాలు. అలా రోజు చూస్తున్న వట్టి చేతులు చూపించకుండా మంచినీళ్లు గ్లాస్ మౌనంగా అందించింది సత్యవతమ్మ. ఆ మౌనంలో ఎన్నో వేల ప్రశ్నలు. ఎన్ని రోజులు ఇలా అని !. ఆ ప్రశ్నకి సమాధానం నూకరాజు దగ్గర లేదు. సగం పైగా జీవితం ఇలాగే గడిచింది. ఇక ముందు గడవక పోతుందా! అని నూకరాజు నమ్మకం. గడవకపోతే చేయగలిగింది ఏమి లేదు. అలా ఆరోజు ఉదయం గడిచింది. పిల్లలకి ఇవి ఏమీ తెలియవు. 

వాళ్ళ అలా మట్టిలో ఆడుకుంటున్నారు. కానీ మధ్యాహ్నం పరిస్థితి ఏమిటి. ప్రతిరోజు ఇదే సమస్య. ఇంతలో దూరంగా సాయిబాబా గుడిలో నుంచి పాటలు వినిపిస్తున్నాయి. నూకరాజు మొహంలో ఆనందం వెళ్లి విరిసింది. అవును ఇవాళ ఏమి వారం ?అని అడిగాడు భార్యని. ఇవాళ గురువారం అంటూ సమాధానం ఇచ్చింది. ఒక్కసారి నూకరాజులో ఉత్సాహం ముంచుకొచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపిక పడితే చాలు. కడుపునిండా అన్నం తినొచ్చు . తొందరగా నువ్వు పిల్లలు తయారవ్వండి. గుడి దగ్గరికి వెళ్లి పోదాం తొందరగా వెళ్లకపోతే అక్కడ రష్ పెరిగిపోతుంది. ఆ లైన్ లో మళ్ళీ నిలబడలేము. తొందరగా వె డితే ముందు వరసలోనే భోజనానికి కూర్చోవచ్చు అంటూ భార్య పిల్లల్ని తొందరపెట్టాడు. 

అలా పిల్లల్ని భార్యని రిక్షాలో ఎక్కించుకుని గుడికి కొంచెం దూరంలో రిక్షా పక్కన పెట్టుకుని నడుచుకుంటూ భార్యని పిల్లల్ని తీసుకుని గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుని లైన్లో నిలబడ్డాడు. అప్పటికే నూకరాజు ముందు పది మంది ఉన్నారు. ఇంతలో బాబాగారి మధ్యాహ్న హారతి అయిపోయింది. ఒక్కసారిగా గేటు తీశారు. ఆ జనాల్ని తోసు కుంటూ పిల్లల్ని ఒక చేతులో పట్టుకుని మెట్లు ఎక్కి మొదటి అంతస్తులో ఉన్న భోజనం శాలలోకి అడుగు పెట్టి ముందు వరుసలో కూర్చున్నాడు నూకరాజు భార్యా పిల్లలతో సహా. అప్పటికే బాబాగారి సేవకులు వండిన పదార్థాలన్నీ ఒక మూల పెట్టుకుని అతిథులు కోసం ఎదురుచూస్తున్నారు. హాలు అంతా భక్తులతో నిండిపోయింది .

ఈ భూమి మీద పుట్టిన మనుషుల్లాగే స్థలాల చరిత్ర కూడా ఒక్కొక్కసారి మారిపోతుంటుంది. అంతవరకు అది మామూలు ఖాళీ స్థలం. అక్కడ కాకినాడ అశోక్ నగర్ లో ప్రధాన వీధిలో ఉన్న ఒక ఖాళీ స్థలం. రోజు రోడ్డుమీద వెళ్తుంటాం కానీ ఆ స్థలం వైపు మనం చూడo. కానీ అక్కడ ఏదైనా అందమైన భవంతి ఉంటే కచ్చితంగా మన దృష్టి అటువైపు మరులుతుంది. ఇన్నాళ్లు అది ఖాళీ స్థలం. ఇప్పుడు అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయక షిరిడి సాయిబాబా వారి ఆలయం. నిత్యం అక్కడ శాస్త్రబద్ధంగా జరిగే పూజలు ఉత్సవాలు వేడుకలు ఆ గుడికి భక్తుల్ని ఆకర్షించి కాకినాడలో అత్యున్నత దేవాలయంగా మారిపోయింది .ఆ స్థలం అంత మహత్యం గలదైపోయింది. కోరిన కోరికలు తీర్చే బాబా వారని అందరికీ నమ్మకం పెరిగింది. భక్తుల్ని ఇలా ఆకర్షిస్తుంటే ప్రతి గురువారం జరిగే అన్నదానం ఎంతోమంది పేదలకి కడుపు నింపుతోంది. చాలా పేద కుటుంబాలు ఆ ప్రతివారం జరిగే అన్నదానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతోమంది దేశ విదేశాల నుంచి తమ కోరిన కోరికలు తీరాయని అన్నదానం చేస్తుంటారు. కానుకలు ఎవరైనా ఇస్తారు కానీ నిత్యం బాబా వారి సేవలో మునిగిపోయిన సేవకులు నిజంగా చిరస్మరణీయులు. అందులో కోట్లకు పడగలెత్తిన వారి దగ్గర నుంచి సామాన్య కుటుంబీకుల వరకు కులమత ధనిక పేద తారతమ్యం లేకుండా అందరూ ఆ బాబా వారి సేవలో మునిగిపోతుంటారు. అవసరమైతే నడుము వంచి ఆలయాన్ని పరిశుభ్రం చేస్తారు. 

ప్రత్యేక పర్వదినాల్లో ఉదయం నుంచి సాయంకాలం వరకు అలా ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యే ఉంటారు.కొంతమంది ప్రసాదాలు పంచుతూ ఉంటారు. కొంతమంది పారాయణం చేస్తుంటారు. కొంతమంది వంట పాత్రలు కూడా తోమిన వాళ్ళు ఉన్నారు. అంతేకాదు ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు సాగే అన్నదానంలో ఎన్ని వేల మంది వచ్చినా అలుపు సొలుపు లేకుండా వడ్డన చేసి మానసిక తృప్తి పొందిన భక్తులు ఎంతోమంది. అలా బాబా వారి సేవలో జీవితాన్ని గడిపి సునాయసంగా తనువు చాలించిన భక్తులు ఎంతోమంది. ఆ గుడి అక్కడ నిర్మించిన తర్వాత ఇంతమంది జీవితాల్లో మార్పు వచ్చింది. ఇదే స్థల మహత్యం అంటే.

వడ్డన మొదలైంది. అన్ని క్రమ పద్ధతిలోనే వడ్డించుకుంటూ వస్తున్నారు. చాలాచోట్ల అన్నదానాల్లో ఏది దొరికితే అది వడ్డిస్తుంటారు. ఇక్కడ ఒక రకమైన క్రమశిక్షణ ఉంది. అలా ముందు వరసలో కూర్చున్న నూకరాజును చూసి బాగున్నావా! అంటూ పలకరించడం ప్రారంభించారు. ప్రతివారం నూకరాజు లేకుండా అన్నదానం మొదటి బ్యాచ్ ఉండదు. ఎందుకంటే నూకరాజు లాంటి వాళ్ళు ఎంతోమంది గురువారం కోసం ఎదురు చూస్తుంటారు. 

ఆకులో వడ్డించిన పదార్థాలు చూసి నూకరాజు నోట్లో నీళ్లు ఊరే యి. ఆకుపచ్చటి అరిటాకులో మెరిసిపోతూ పచ్చటీ కందిపప్పు, దాని పక్కనే బంగాళదుంప కూర ,కొబ్బరికాయ పచ్చడి, ఎక్కడో గిన్నెలో ఉన్న బంతిలో కూర్చున్న వారి ముక్కుకి మంచి వాసనలు ఇస్తున్న సాంబార్, అది కాకుండా పులిహార స్వీటు చూసి ఒక్కసారిగా నూకరాజులో ఆకలి విజృంభించింది. ఆకువేపే దృష్టి. ఆకులో విసుగు విరామం లేకుండా వడ్డిస్తూనే ఉన్నారు. అప్పటికే నాలుగు సార్లు అన్నం వడ్డించారు. ఐదోసారి ఆకు నిండా అన్నం పెట్టించుకుని గడ్డ పెరుగు కలుపుకున్నాడు. ఆ పెరుగు అన్నంలో స్వీట్ నంచుకుని తింటూ ఆత్మరాముణ్ణి శాంత పరిచాడు. పిల్లలు, భార్య మొహంలో వెలుగు కనిపించింది. చుట్టూ ఒకసారి హాలంతా పరికించి చూశాడు. అందులో చాలామంది తన గుడిసె చుట్టూ కాపురం ఉండేవాళ్లే కనబడ్డారు. ఇంచుమించుగా అందరి పరిస్థితి తనలాంటిదే అనుకుని , బాబా వారు బతికున్న రోజుల్లో ఊరంతా బిక్షమెత్తి అన్ని ప్రాణులకి ఆకలి తీర్చేవారు. సమాధి అయిన తర్వాత కూడా ఇలా పేదల ఆకలి తీరుస్తున్నారని అనుకుంటూ వచ్చే గురువారo అన్నదానం కోసo ఎదురుచూస్తూ ఇంటికి బయ లుదేరాడు.

సుమారు 25 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఆ దేవాలయంలో ఇప్పటికీ అన్నదానం కొనసాగుతూనే ఉంది. ఎంతోమంది పేదలకి వారానికి ఒకసారి కడుపు నింపుతూనే ఉంది ఆ దేవాలయం. అటువంటి దేవాలయం మన కాకినాడలో ఉండడం మన అదృష్టం.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

.