Dury Pet books and stories free download online pdf in Telugu

డూరి పెట్

కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి మీద 8 ఖండాలు ఉండేవి.8వ ఖండం పేరు ఎప్లేనియా.మిగిలిన 7 ఖండాలలో ప్రజలు అగ్నిని కనుగొనక ముందే ఎప్లేనియాలో ప్రజలు చక్రాన్నే కనుగొన్నారు. వారికి మిగిలిన 7 ఖండాలలో ప్రజల కంటే ఎక్కువ జ్ఞాన సంపద ఉండేది. అంతరించిపోయిన జీవులలో ప్రపంచం మొత్తానికీ ఎక్కువగా తెలిసిన జీవులు డైనోసార్లు. కానీ ఈ ప్రపంచంలో కనీసం అంతరించిపోయాయి అని చెప్పుకోవడానికి ఆధారాలు కూడా మిగలకుండా అంతరించిపోయిన జీవులు ఎన్నో ఉన్నాయి. అలా అంతరించిపోయిన జీవులలో ఒక పక్షి జాతి పేరు డిరెక్స్.డిరెక్స్ పక్షులు అన్ని పక్షుల కంటే ప్రత్యేకమైన పక్షులు.ఈ పక్షుల పొడవు 9-12 అడుగులు ఉంటుంది. ఈ పక్షుల జీవితకాలం 10-20 వేల సంవత్సరాలు.ఎప్లేనియాలో 32 దేశాలు ఉండేవి.వాటిలో సముద్ర తీరానికి సమీపంలో 9 దేశాలు ఉండేవి. వాటిలో ఒక దేశం పేరు నెపొరెంటికా.నెపొరెంటికాకి ఎడమ వైపు టిప్ అనే దీవి ఉండేది.డిరెక్స్ పక్షులు కేవలం టిప్ దీవిలో మాత్రమే నివసించేవి.టిప్ దీవికి కుడి వైపు నెపొరెంటికా దేశం ఉండేది. రెండింటికీ మధ్యలో సముద్రం ఉండేది.డిరెక్స్ పక్షులు తరచుగా నెపొరెంటికా దేశానికి వస్తూపోతూ ఉండేవి. అయితే దురదృష్టవశాత్తూ ఒకసారి నెపొరెంటికా దేశానికి కరువు వచ్చింది.వర్షాలు పడకపోవడం వల్ల పంటలు పండలేదు. అప్పుడు ఆ దేశానికి రాజైన షేరు రైతులు అందరిని వేటగాళ్లుగా మారి జంతువులు మరియు పక్షులను వేటాడి వాటిని ఆహారంగా ప్రజలకు అమ్మమని ఆజ్ఞాపించాడు.అందువల్ల రైతులందరూ వేటగాళ్లుగా మారి కనిపించిన ప్రతి జంతువును మరియు పక్షిని వేటాడి చంపడం మొదలు పెట్టారు.టిప్ నుండి నెపొరెంటికా దేశానికి వచ్చిన ప్రతి డిరెక్స్ పక్షిని చంపి అమ్ముకునేవారు. అవి 9-12 అడుగుల ఎత్తు ఉండడంవల్ల మరియు భారీ ఆకారం కలిగి ఉండడం వల్ల ఒక్క పక్షి ఎక్కువ మందికి ఆహారంగా సరిపోయేది. ఒక్క పక్షిని చంపితే కుటుంబం మొత్తానికి ఆహారంగా సరిపోతుంది కాబట్టి ఆ దేశపు ప్రజలు డిరెక్స్ పక్షులను చంపి తినడానికి ఎక్కువగా ఇష్టపడే వారు.డిరెక్స్ పక్షులు కేవలం నెపొరెంటికా దేశానికి మాత్రమే తరచుగా వెళ్ళేవి‌. కానీ ఇప్పుడు నెపొరెంటికా ప్రజలు డిరెక్స్ పక్షులను చంపడం డిరెక్స్ పక్షులు చూసి మనుషులంతా కిరాతకులు మరియు చెడ్డవాళ్ళు అని డిరెక్స్ పక్షులు భావించాయి. అందువల్ల మనుషుల నుండి వాటిని అవి కాపాడుకోవడానికి ఇంకెప్పుడు నెపోరెంటికాకి రాకూడదని నిర్ణయించుకుంటాయి. రెండు సంవత్సరాల తర్వాత కరువు కాలం ముగిసిపోతుంది.నెపోరెంటికా ప్రజలు డిరెక్స్ పక్షులు రెండు సంవత్సరాలుగా కనిపించకపోవడంతో డిరెక్స్ పక్షులు అంతరించిపోయాయి అని అనుకుంటారు.

200ల సంవత్సరాల తర్వాత

టిప్ దీవిలోనే ఉంటూ ఏ మనిషికి కనబడకుండా 200ల సంవత్సరాలు గడిపాయి డిరెక్స్ పక్షులు. ప్రస్తుతం ఉన్న డిరెక్స్ పక్షులలో ఒక జంట ఉంది. ఆ జంటలో మగ పక్షి పేరు ఫైబన్, ఆడ పక్షి పేరు ళేయ. ఆ జంటకు ఒక పక్షి పిల్ల పుట్టింది.ఆ చిన్న పక్షికి ఇంకా పేరు పెట్టలేదు.ళేయ ఆ చిన్నారి పక్షికి ఎగరడం నేర్పించడం మొదలు పెట్టింది."నెపొరెంటికా దేశంలో మనుషులు ఉంటారు వాళ్లు ఎంతో క్రూరమైన వాళ్ళు.కాబట్టి మనుషులు ఉన్న ఆ ప్రదేశానికి వెళ్ళకూడదు" అని ళేయ ఆ చిన్న పక్షికి చెప్తుంది. ఆ చిన్న పక్షికి "అమ్మ(ళేయ) పర్యవేక్షణ లేకుండా ఆకాశంలో ఎంతో ఎత్తుకు ఎగరాలి"అని కోరికగా ఉండేది. ఒకరోజు ఆహారం సేకరణ కోసం ళేయ మరియు ఫైబన్ బయటకు వెళ్లారు అప్పుడు ఆ చిన్ని పక్షి అదే అదునుగా భావించి పైకి ఎగరడం మొదలుపెడుతుంది. ఆకాశంలో చాలా ఎత్తుకు ఎగురుకుంటూ వెళుతుంది. ఆ చిన్న పక్షి ఎగురుకుంటూ చాలా దూరం వెళ్తుంది. ఆ చిన్న పక్షి ఎగురుకుంటూ నెపొరెంటికా దేశం సమీపానికి చేరుకుంది. ఆ చిన్న పక్షి తిరిగి ఇంటికి వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటుంది. ఇంతలో ఒక చిన్న రాయి బలంగా వచ్చి దాని రెక్కకు తగులుతుంది. ఆ చిన్న పక్షి కిందికి పడిపోతుంది.ఆ చిన్న పక్షి కిందికి పడిపోతూ ఉండటం ఒక అమ్మాయి చూసి తన చేతులతో ఆ పక్షిని పట్టుకుంటుంది. ఆ చిన్న పక్షి నెపొరెంటికా దేశం అడవి ప్రాంతంలో ఉన్న ఒక అమ్మాయి చేతిలో పడుతుంది. ఆ అమ్మాయి తన చేతులలో స్పృహతప్పి పడి ఉన్న ఆ పక్షిని చూసి" ఇదేదో వింత పక్షిల ఉందే"అని అనుకుంటుంది. ఇంతలో ఆ అమ్మాయి దగ్గరకి మీసాం కలిగి ఉన్న ముగ్గురు మగవారు వచ్చారు. ఆ ముగ్గురిలో ఒకడి పేరు "జఠన్".జఠన్ ఆ అమ్మాయిని "నీ పేరేంటి" అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి "నా పేరు డూరి" అని చెప్తుంది. అప్పుడు వారి మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది.
జఠన్: చూడు డూరి! నీ చేతిలో ఉన్న ఆ పక్షిని నాకు ఇచ్చేయ్.!
డూరి: స్పృహతప్పి పడి ఉన్న ఈ పక్షి మీకెందుకు?
జఠన్: అలా స్పృహతప్పి పడిపోవడానికి కారణం నేనే.! సరిగా గురి చూసి రాయి విసిరాను అదృష్టం కుదిరింది రాయి దనికి తగిలింది!
డూరి: కానీ ఎందుకు దానిని చంపాలనుకుంన్నారు?
జఠన్: చూడు అమ్మాయి!5 అడుగుల 8 అంగుళాల ఎత్తు ఉన్నావు.చూడడానికి చాలా బలమైన,ధైర్యం కలిగిన, తెలివైన అమ్మాయిల ఉన్నావు! ఒక పక్షిని ఎందుకు చంపుతారో కూడా మీకు తెలియదా? వండుకొని తినడానికి చంపుతారు.! నాకు ఆ పక్షిని తినాలని ఎంతో కోరికగా ఉంది అందుకే దానిని చంపాలి అనుకున్నాను. కాబట్టి మర్యాదగా అది నాకు ఇచ్చేయి!
డూరి: లేదు! మీరు దానిని చంపడానికి నేను ఒప్పుకోను. నా మాట విని మీరే మర్యాదగా వెళ్ళిపొండి.
జఠన్: అసలు నీ మాట నేను ఎందుకు వినాలి?
డూరి: ఈ రాజ్యానికి సైన్యాధిపతి ఎవరో తెలుసా?
జఠన్: ఆ తెలుసు ఎవరో అమ్మాయి అంటగా! ఆ అమ్మాయి పేరు తెలియదు.
డూరి: ఆ అమ్మాయి నేనే! ఈ నెపోరెంటికా దేశానికి సైన్యాధ్యక్షురాలిని నేనే! నా మాట కాదని మీరు దానిని చంపగలరా??
జఠన్: లేదు! మీరు సైన్యాధిపతి అని చెప్పాక కూడా నేను అంత పెద్ద సాహసం చేయలేను!! కానీ నాకు కూడా సమయం వస్తుంది అప్పుడు నా శక్తిని మీకు తెలియజేస్తాను. ప్రస్తుతానికి మీరు వెళ్ళవచ్చు సైన్యాధిపతి గారు!
డూరి: మీ శక్తి ఎంటో చూడాలని నాకు కూడా ఆశగానే ఉంది. వెళ్లి వస్తాను మరియు ధన్యవాదాలు.!
అలా డూరి ఆ చిన్న పక్షిని తీసుకొని తన ఇంటికి వెళ్తుంది.డూరి ఆ చిన్న పక్షికి వైద్యం చేసి దాని గాయాన్ని నయం చేస్తుంది. తర్వాత రోజు ఆ చిన్న పక్షి స్పృహలోకి వస్తుంది. ఆ పక్షి మనుషులను చూడగానే చాలా భయపడతుంది. మనుషులంతా క్రూరమైన వాళ్ళు అని ళేయ చెప్పిన మాటలు ఆ పక్షికి గుర్తొచ్చాయి. ఆ చిన్న పక్షి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూంది. కానీ దాని రెక్కకు గాయం అవ్వడం వల్ల అది ఎగరలేక పోతుంది.డూరి ఆ చిన్న పక్షిని ఒక పంజరంలో పెట్టి తనతో పాటు తన స్నేహితుల దగ్గరకు తీసుకు వెళుతుంది.నెపొరెంటికా దేశంలోని ప్రజలు మాట్లాడుకునే భాష పేరు "నెపొరెంఠెశిస్".నెపొరెంఠెశిస్ భాషలో పెంపుడు జంతువును లేదా పక్షిని "పెట్" అని అంటారు.డూరి స్నేహితులు "ఈ పక్షిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు?" అని డూరిని అడుగుతారు. అప్పుడు డూరి "ఈ పక్షి నా పెంపుడు పక్షి"అని వాళ్లకి సమాధానం చెబుతుంది.అటు వచ్చిన ప్రతి ఒక్కరూ "ఆ పక్షి ఎవరిది"అని డూరి స్నేహితులను అడిగేవారు. అందుకు డూరి స్నేహితులు ఆ పక్షి వైపు చెయ్యి చూపించి అది"డూరి పెట్ " అని సమాధానం చెప్పేవారు.కాని ఆ చిన్న పక్షికి నెపొరెంఠెశిస్ భాష అర్థం కాలేదు.డూరి స్నేహితులందరూ దానిని "డూరి పెట్"అని పిలవడం వల్ల ఆ చిన్న పక్షి దానికి "డూరి పెట్" అనే పేరు పెట్టారు అని అనుకుంటుంది.ఆ చిన్న పక్షి "టీలా టీలా" అని అరిచేది. ఆ చిన్న పక్షి"మా అమ్మే నాకు ఇంకా పేరు పెట్టలేదు మీరు అప్పుడే నాకు పేరు పెట్టేశారు ఏంట్రా?" అని డూరి స్నేహితులను అరుస్తూ అడుగుతుంది.కాని ఆ అరుపులు డూరి స్నేహితులకు "టీలా టీలా"అనే వినపడేవి. ఆ పక్షి ఊరికే అరవడం వల్ల డూరి ఆ చిన్న పక్షికి ఆకలి వేస్తుంది ఏమో అని అనుకుంటుంది.డూరి పంజరాన్ని తీసుకుని తన ఇంటికి తిరిగి వెళ్తుంది.డూరి పంజరాన్ని తీసుకొని తన ఇంటి పెరట్లో ఉన్న ఒక బల్ల మీద పెడుతుంది. పంజరంలో ఉన్న చిన్న పక్షి"నాకు తగిలిన గాయాలు నయం అయ్యాయి. నన్ను విడుదల చేస్తే ఎగురుకుంటూ తిరిగి నా ఇంటికి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నాను"అని గట్టిగా అరుస్తుంది.ఆ అరుపులు డూరికి "టీలా టీలా" అనే వినపడతాయి. అందుకు డూరి ఆ పక్షికి ఇంకా ఎక్కువగా ఆకలి వేస్తుంది ఏమో అని అనుకుంటుంది.డూరి ఒక కోడిని తీసుకొని వచ్చి తన పెరట్లో ఆ కోడి తల నరికి రెక్కల నుండి మాంసాన్ని వేరు చేస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఆ చిన్న పక్షి చూస్తూ ఉంటుంది. ఆ చిన్న పక్షి"ఒక కోడిని ఇలా నరికి చంపుతుంది అంటే ఈ మనిషి చాలా క్రూరమైన మనిషి!ఇప్పుడు ఆ కోడిని చంపుతుంది తర్వాత నన్ను కూడా చంపి ఇలాగే తినేస్తుంది ఏమో"అని అనుకుంటుంది. ఇంతలో డూరి ఆ కోడి మాంసంలో కొంత భాగం తీసి ఆ పక్షి పంజరంలో వేస్తుంది. అది చూసినా చిన్న పక్షి"ఇప్పుడు నాకు ఈ మనిషి ఆహారం పెట్టింది. రాత్రికి నేను ఈ మనిషికి ఆహారం అయిపోతానేమో"అని అనుకుంటుంది. ఆ చిన్న పక్షి దానికి వేసిన మాంసాన్ని తింటుంది.డూరి ఆ మిగిలిన కోడి మాంసంతో కోడి కూర వండుకుంటుంది.నెపొరెంటికా దేశంలో ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి రాజ ఎన్నికలు ఉంటాయి.నెపొరెంటికా దేశంలో సామాజిక బాధ్యతలు చేపట్టే విషయంలో లింగ భేదం ఉండదు. రాజ కుటుంబంలో పుట్టిన వారసులు ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరిగే రాజ ఎన్నికల్లో పాల్గొంటారు. పోటీదారులలో ఎవరికైతే ప్రజల మద్దతు ఎక్కువగా ఉంటుందో వారు ఆరు సంవత్సరాల పాటు ఆ దేశానికి మహారాజు లేదా మహారాణిగా ఉంటారు.ఆ దేశంలో సర్వ అధికారం పై వారికి హక్కు ఉంటుంది. కానీ ఒకవేళ రాజ కుటుంబానికి వారసులుగా కేవలం ఒకరు మాత్రమే ఉంటే వారి మరణం వరకు వారే మహారాజు లేదా మహారాణిగా ఉంటారు.మహారాజుగా ఎవరైతే మరణిస్తారో వారి సంతానం మాత్రమే రాజ ఎన్నికలకు అర్హులు. పోయిన వారం నెపొరెంటికా దేశానికి రాజైన మరియు షేరు వంశస్థుడైన డోబెగెరమ్ మరణించాడు.డోబెగెరమ్కి ఇద్దరు కూతుర్లు మొదటి కూతురి పేరు నెజాల,మొదటి కూతురి భర్త పేరు కోలా మరియు రెండవ కూతురి పేరు శేబనేలా, శేబనేలాకు ఇంకా పెళ్లి కాలేదు.మహారాజైన డోబెగెరమ్ పోయిన వారం మరణించడం వల్ల ఈ వారం రాజ ఎన్నికలు నిర్వహించాలని మంత్రులు నిర్ణయించారు. అంటే మరో రెండు రోజుల తర్వాత రాజ ఎన్నికలు‌ నిర్వహించబడతాయి.డూరి కోడి కూరతో కడుపు నిండా భోజనం చేసిన తరువాత రాజ భవనం నుండి పిలుపు వచ్చిందని డూరికి కబురు వస్తుంది.డూరి వెంటనే రాజభవనానికి వెళుతుంది.ఆ చిన్న పక్షి డూరి ఇంట్లోనే ఉంటుంది. రాజభవనంలో ఆ దేశానికి రెండవ యువరాణి అయినా శేబనేలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు డూరి శేబనేలాను కలుస్తుంది. అప్పుడు వారి మధ్య సంభాషణ ఇలా జరిగింది.
శేబనేలా :రా డూరి ! ఇక్కడ పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి ఎవరిని నమ్మాలో తెలియడం లేదు. నువ్వు ఈ దేశానికి సైన్యాధ్యక్షురాలు మాత్రమే కాదు నా ప్రాణ స్నేహితురాలివి కూడా. నాకు నీ మీద మాత్రమే నమ్మకముంది.
డూరి : ఏం జరిగింది యువరాణి?
శేబనేలా : నిన్న రాత్రి అక్కగారికి బావగారికి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. ఇద్దరూ ఉదయం నుండి కనబడడం లేదు.ఇంకో రెండు రోజుల్లో రాజ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు మహా మంత్రివర్యులు నెజాల యువరాణి ఎక్కడ అని అడిగితే నేను ఏమి సమాధానం చెప్పగలను? రాత్రి బావగారు అక్కగారిని "చంపేస్తాను" అని చాలాసార్లు అరిచారు.కోలా బావ గారే అక్క గారిని ఏదో చేసి ఉంటారు అని నాకు అనిపిస్తుంది.డూరి! దయచేసి మా అక్కగారు మరియు బావగారు ఎక్కడున్నారో కనిపెట్టి వెతికి తీసుకు వస్తావా?
డూరి:శేబనేలా! నేను సైన్యఅధ్యక్షురాలిగా కాదు నీ స్నేహితురాలిగా నెజాల గారు మరియు కోలా గారు ఎక్కడున్నా వెతికి తీసుకువస్తాను అని నీకు మాటిస్తున్నాను.
డూరి రాజభవనం నుండి బయటికి వస్తుంది.డూరి దర్యాప్తు చెయ్యడం మొదలు పెడుతుంది.అప్పుడే రాజభవనం వెనకనుండి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి ముసుగు కప్పుకొని రహస్యంగా రాజభవనంలోకి అడుగు పెట్టడం డూరి చూస్తుంది.డూరి వెంటనే ఆ వ్యక్తిని అనుసరించడం మొదలు పెడుతుంది . ఆ వ్యక్తి రహస్యంగా రాజ భవనంలో ఉన్న రెండవ యువరాణి శేబనేలా గదిలోకి ప్రవేశించి ఆమెను చంపడానికి ప్రయత్నిస్తాడు ఇంతలో డూరి అక్కడికి వస్తుంది ఆ వ్యక్తితో పోరాడి శేబనేలాను కాపాడుతుంది. ఆ వ్యక్తి డూరితో చాలాసేపు పోరాడి అలిసిపోయి అక్కడి నుండి పారిపోవడం మొదలుపెడతాడు.డూరి శేబనేలాను చెలికత్తెలకు అప్పగించి పారిపోతున్న ఆ వ్యక్తిని వెంటాడుతుంది.ఆ వ్యక్తి అడవి ప్రాంతం వైపుగా పరుగు సాగిస్తాడు.డూరి ఆ వ్యక్తిని వెంటాడుతుంది. కొంత దూరం పరుగెత్తిన తర్వాత ముసుగు కప్పుకొని ఉన్న ఆ వ్యక్తి పరిగెడుతూండగా ఆ వ్యక్తి గుండెల్లోకి బాణం దిగుతుంది.డూరి అది చూసి ఆశ్చర్యపోతుంది. ముసుగు తీసి ఆ వ్యక్తి ముఖం చూస్తుంది.ఆ వ్యక్తి మొదట యువరాణి అయినా నెజాల యొక్క భర్త అయినా కోలా.కోలా గుండెల్లోకి బాణం గురిపెట్టిన వారు ఎవరు అనే సందేహంతో డూరి చుట్టూ చూడడం మొదలుపెట్టింది. అప్పుడు మొదటి యువరాణి అయినా నెజాల ధనస్సు మరియు బాణాలతో సహా అక్కడికి వస్తుంది. అప్పుడు వారి మధ్య సంభాషణ ఇలా జరిగింది.
డూరి: అయ్యో యువరాణి నెజాల! మీరే మీ భర్తను చంపడం ఏమిటి? కోలా గారు శేబనేలాను చంపడానికి ఎందుకు ప్రయత్నించారు? దయచేసి ఏం జరిగిందో చెప్పండి యువరాణి!!
నెజాల: డూరి! ముందు మనం రాజభవనానికి వెళ్దాము అక్కడ నీకు మరియు చెల్లికి అంత వివరంగా చెప్తాను.
ఇద్దరూ కలిసి రాజభవనానికి బయలుదేరుతారు. ఇద్దరూ రాజభవనానికి చేరిన తర్వాత శేబనేలా తిరిగొచ్చిన అక్కను చూసి ఎంతో సంతోషిస్తుంది.శేబనేలా డూరికి ధన్యవాదాలు చెప్తుంది. అప్పుడు వారి మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది.
శేబనేలా: అక్క ఏం జరిగింది.బావ గారు ఎక్కడ ఉన్నారు? రాత్రి మీరు ఎక్కడ ఉన్నారు?
నెజాల: శేబా! కోలా చాలా చెడ్డవాడిగా మారిపోయాడు.డోబెగెరమ్ వారసులైనా మనమిద్దరమూ మరణిస్తే మొదటి యువరాణి అయినా నాకు కోలా భర్త కాబట్టి మన దేశ రాజ్యాంగం ప్రకారం వాడు ఉన్నంతకాలం వాడే ఈ దేశానికి మహారాజు అవుతాడు అందుకే కోలా నిన్ను మరియు నన్ను చంపాలని నిర్ణయించుకున్నాడు. అందుకే రాత్రి నన్ను చంపడానికి ప్రయత్నించాడు ఇప్పుడు నిన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు. అందుకే నేను కోలాని చంపేశాను.
ఇప్పుడు సమస్యలన్నీ తీరిపోతాయి.
డూరి: అవును యువరాణి! ఇక అంతా సంతోషమే. ఇక రాజ ఎన్నికలు అద్భుతంగా జరుగుతాయి.

రెండు రోజుల తర్వాత
రాజ ఎన్నికలు నిర్వహించే రోజు వచ్చింది.రాజ ఎన్నికలు నిర్వహించడానికి సరిగ్గా గంట సేపు సమయం ఉంది అనగా పోటీదారులు అయినా నెజాల మరియు శేబనేలా రాజ ఎన్నికలు నిర్వహించే ప్రదేశానికి వస్తారు.నెపొరెంటికా దేశానికి మధ్యలో ఉన్న 45 ఎకరాల ఖాళీ స్థలంలో రాజ ఎన్నికలు నిర్వహిస్తారు. రాజ ఎన్నికల సమయంలో ఆ ప్రదేశానికి వేల సంఖ్యలో జనాలు వస్తారు. ఆ 45 ఎకరాల ఖాళీ స్థలం నడిమధ్యలో ఒక పెద్ద కొండ ఉంది ఆ కొండ పేరు "షేరు".నెపొరెంటికా దేశ చరిత్రలో అత్యంత గొప్ప రాజుగా కీర్తింపబడే "షేరు" మహారాజుకు గుర్తుగా ఆ కొండకు "షేరు"అని పేరు పెట్టారు. ఇంకో 30 నిమిషాలలో ఎన్నికలు మొదలవుతాయి.నెజాల,శేబనేలా చనిపోయిన డోబెగెరమ్ మహారాజు యొక్క ఆత్మకు శాంతి కలగాలని బలి అర్పించారు. బలి అర్పించిన వెంటనే డూరి నెజాల మీద దాడి చేయడం మొదలుపెడుతుంది.నెజాల కూడా డూరి పై ఎదురుదాడి చేస్తుంది.నెజాల మరియు డూరి మధ్య పోరాటం చూసి శేబనేలా ఆశ్చర్యపోతుంది.డూరి మరియు నెజాల గొడవ పడుతూ "షేరు" కొండ మీదికి చేరుకున్నారు.అప్పుడు నెజాల యుద్ధం ఆపి డూరితో మాట్లాడడం మొదలుపెడుతుంది. అప్పుడు వారి మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది.
నెజాల: ఆగు డూరి! ఇప్పటి వరకు బానే ఉన్నావు కదా! హఠాత్తుగా ఎందుకు నాపై దాడి చేస్తున్నావు?
డూరి: నెజాల! ఇక నటించకు నాకు నీ నిజస్వరూపం గురించి తెలిసిపోయింది లే!
(నెజాల గట్టిగా నవ్వుతూంది)
నెజాల: హమ్మయ్య! ధన్యవాదాలు డూరి! ఇప్పటి నుండి కనీసం నీ దగ్గర అయినా నటించక్కర్లేదు మనసు విప్పి మాట్లాడుకోవచ్చు.అయినా అంత గొప్పగా నటించిన, అంత గొప్పగా పథకం వేసినప్పటికీ నేరస్తురాలిని నేనే అని ఎలా కనిపెట్టేసావే డూరి?
డూరి: ఎలా దొరికిపోయావో చెప్పే ముందు అసలు ఏం చేశావో ఒకసారి చెప్పమటావా నెజాల?
నెజాల: చెప్పు డూరి!
డూరి: డోబెగెరమ్ మహారాజు పోయిన వారం చచ్చిపోయారు. ఆయనకు ఇద్దరు కూతుర్లు.మొదటి కూతురు నెజాల అంటే నువ్వు!.రెండవ కూతురు శేబనేలా.డోబెగెరమ్ యొక్క ఇద్దరు కూతుర్లు బ్రతికున్నత కాలం ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి రాజ ఎన్నికలు జరుగుతాయి. కానీ ఒకవేళ ఆ ఇద్దరు కూతుర్లలో ఎ ఒక్కరు చనిపోయినా మిగిలిన ఇంకొకరు బ్రతికున్నంత కాలం మహారాణిగా ఉండొచ్చు! ఆమె బ్రతికిఉన్నంతకాలం ఆమె మాత్రమే మహారాణిగా ఉంటుంది.అంటే ఒకవేళ శేబనేలా చనిపోతే నెజాల శాశ్వతంగా మహారాణి అవుతుంది.అందుకే నెజాల అంటే నువ్వు బ్రతికున్నంత కాలం మహారాణిగా ఉండాలి అనే దురాశతో నీ సొంత చెల్లిని చంపాలనుకున్నావు.అందుకే రహస్యంగా నీ చెల్లిని చంపి ఆ నిందను శత్రు రాజ్యం అయినా "కెఠార్"మీద వెయ్యాలని అనుకున్నావు.నీ భర్త అయినా "కోలా"కు కూడా నీ దురాశ గురించి చెప్పావు. నువ్వు నీ భర్తతో కలిసి ఒక పథకం వేసావు.ఆ పథకం ఏంటంటే"ఒక రాత్రి నీకు నీ భర్తకు గొడవ అయ్యి నీ భర్త నిన్ను వదిలి రాజభవనం నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు నీ భర్తను గురించి వెతుక్కుంటూ వెళ్ళి పోతావు.గొడవ పేరుతో రాజభవనం నుండి నెజాల అంటే నువ్వు మరియు నీ భర్త కోలా బయటకు వచ్చేస్తారు.నెజాల మరియు కోలా రాజభవనంలో లేని సమయంలో "కెఠర్"దేశస్తుడైన ఒక్కడు శేబనేలాను రాజభవనంలోకి రహస్యంగా చొరబడి చంపేస్తాడు. ఇంతకీ ఆ "కెఠర్"దేశస్థుడి రూపంలో నువ్వు పంపేది ఎవరో కాదు నీ భర్త అయినా "కోలా"నే.అలా శేబనేలా చనిపోయిన తర్వాత రోజు ఏమీ తెలియనట్టు తిరిగి రాజభవనానికి వెళ్లి చెల్లి చనిపోయిందని బాధపడినట్లు నటించి ఈ దేశానికి శాశ్వతంగా మహారాణి అయిపోదాం అనుకున్నావు"ఇదే కదా నువ్వు వేసిన పథకం!!!
నెజాల: శభాష్! డూరి నేను ఎంత క్రూరమైన పథకం వేశానో సరిగ్గా చెప్పావు.! మరి దానిని నువ్వు ఎలా నాశనం చేసావో కూడా నువ్వే చెప్పు.
డూరి: అనుకున్న పథకం ప్రకారం గొడవ పేరుతో నువ్వు నీ భర్త రాజభవనం నుండి బయటకు వెళ్లిపోయారు. అనుకున్న పథకం ప్రకారం తర్వాత రోజు శేబనేలాని చంపమని చెప్పి నీ భర్త అయినా కోలాకు ముసుగు వేసి నువ్వే పంపావు. అక్కడ వరకు సక్రమంగా జరుగుతున్న నీ పథకంలోకి నేను ప్రవేశించాను. ముసుగు వేసుకొని కోలా శేబనేలాను చంపడానికి వచ్చినప్పుడు శేబనేలాని నేను కాపాడను. నన్ను చూసి పారిపోవడం మొదలుపెట్టిన కోలాని వెంటాడాను.అప్పుడు కోలా నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు.కోలా నీ దగ్గరికి రావడం నేను చూస్తే నాకు నిజం తెలిసిపోతుంది అనే భయంతో నా ముందే కోలాని నువ్వు చంపేశావు. ఎందుకు చంపావు అని నిన్ను అడిగితే"కోలా మహారాజు అధికారంపై వ్యామోహంతో డోబెగెరమ్ కూతురులు అయినా శేబనేలాను నెజాలను చంపాలనుకున్నాడు అందుకే నెజాల కోలాను చంపేసింది"అనే కొత్త అబద్ధపు కథను సృష్టించావు. ఇంకా ఇప్పుడు ఏమీ చేయలేక రాజ ఎన్నికలు పూర్తయిన తర్వాత నీ చెల్లిని చంపాలని నిర్ణయించుకున్నావు. సరిగ్గా చెప్పానా నెజాల?
నెజాల: శభాష్! కానీ ఒక సందేహం ఇదంతా నువ్వు ఎలా తెలుసుకున్నావు?
డూరి:నెజాల! నువ్వు నాకు చెప్పిన అబద్ధపు కథలో ఒక చిన్న లెక్క మర్చిపోయావు."కోలా నన్ను మా చెల్లిని చంపాలనుకున్నాడు"అని నువ్వు నాతో చెప్పావు. అక్కడ నాకు ఒక సందేహం వచ్చింది"నిజంగా నిన్ను చెప్పాలనుకునే వాడు నిన్ను అడవికి తీసుకెళ్లి మరీ చంపడు కదా!","అయినా, నిన్ను అడవిలోకి తీసుకెళ్లి నిన్ను చంపకుండా మీ చెల్లిని చంపడానికి వచ్చాడు అంటే ఏమైనా నమ్మశక్యంగా ఉందా"
ఈ సందేహాలు నాకు రావడం వల్ల తర్వాత రోజు రహస్యంగా నువ్వు లేనప్పుడు నీ గదిలోకి చొరబడ్డాను. నీకు ఒక అలవాటు ఉంది "రోజంతా జరిగిన సంఘటనలను నువ్వు ఒక పుస్తకం(డైరీ)లో రాసుకుంటావు"ఆ అలవాటే నిన్ను పట్టించింది. నేను రహస్యంగా నీ గదిలోకి చొరబడినప్పుడు నువ్వు రోజు రాసుకునే ఆ పుస్తకాన్ని పూర్తిగా చదివాను.ఆ పుస్తకంలో నీ పథకాలు, నీ దుష్ట ఆలోచనలు, నీ దుర్బుద్ధి అన్ని పూర్తిగా రాసుకున్నావు.అది నేను పూర్తిగా చదవడం వల్ల నాకు అన్నీ పూర్తిగా తెలిసిపోయాయి మరియు అర్థమైపోయాయి.
నెజాల:డూరి! నీ దగ్గర నాకు వ్యతిరేకంగా ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి కదా మరి ఇవి ప్రజలందరి ముందు పెట్టి నాకు శిక్ష పడేలా చేయొచ్చు కదా.?
డూరి:నెజాల! నువ్వు పుట్టింది అత్యంత గొప్ప చక్రవర్తి అయిన "షేరు"మహారాజు వంశంలో మనం ఇప్పుడు నిలబడి ఉన్న కొండ పేరు కూడా "షేరు" ఏ.ఇప్పుడు నేను నీ దుర్బుద్ధి బయటపెడితే షేరు మహారాజు వంశం యొక్క కీర్తి ప్రతిష్టలకు భంగం కలుగుతుంది. అటువంటి పని నేను ఎన్నటికీ చెయ్యను. నీ దుర్బుద్ధి నేను ఎప్పటికీ బయట పెట్టాను నెజాల!
నెజాల:డూరి! మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావ్?
డూరి: నిన్ను ఇలాగే బతకనిస్తే ఎప్పటికైనా శేబనేలాను చంపేసి ఈ దేశానికి మహారాణి అయ్యి ప్రజలను హింసిస్తావు. అందుకే ఓ 10 నిమిషాలలో నిన్ను చంపేద్దాం అనుకుంటున్నాను.
నెజాల: డూరి! నువ్వు నాకన్న తెలివైన దానివి కావచ్చు! కానీ మనిద్దరి మధ్య యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో నువ్వు నన్ను ఓడించలేవు!!!!
డూరి: ఇక మాటలు చాలు నెజాల!
నెజాల మరియు డూరి మళ్లీ యుద్ధం మొదలు పెడతారు. వాళ్ళిద్దరి మధ్య తీవ్రంగా యుద్ధం జరుగుతుంది.డూరి నెజాల చేతిలో ఉన్న కత్తిని పడేస్తుంది. అప్పుడు వారి మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది.
నెజాల:డూరి! చంపాలనుకున్న దానివి నన్ను నిన్నటి రోజునే చంపేయవచ్చు కదా! ఇప్పటివరకు ఎందుకు ఆగవు? ఇప్పుడు మనం ప్రజలందరి మధ్యలో ఉన్న కొండ మీద ఉన్నాము. ఇప్పుడు నువ్వు నన్ను చంపితే దేశ యువరాణిని చంపిన నేరం ప్రకారం నీకు కూడా మరణశిక్ష విధిస్తారు.నీకు తెలుసుగా!!!మరణశిక్షకు అర్హులైనవాళ్లని ఈ కొండకి అవతలి వైపు నుండి 267 అడుగుల ఎత్తునుండి కిందికి తోసేస్తారు!
డూరి: డోబెగెరమ్ ఒక గొప్ప మహారాజు! ఆయన ఆత్మ శాంతి కొరకు జరిగే బలి సమర్పణలో ఆయన కూతురుగా నువ్వు అక్కడ ఉండాలి అనేది నా కోరిక. నువ్వక్కడుంటేనే ఆయన ఆత్మ శాంతిస్తుంది. అందుకే ఆ బలి సమర్పణ కార్యక్రమం పూర్తిఅయ్యేవరకు నిన్ను బ్రతకనిచ్చాను. ఇక నా మరణశిక్ష అంటావా? సైన్య అధ్యక్షురాలిని అయిన రోజే దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను.నిన్ను చంపడం నాకు ముఖ్యం,అలాగే మీ వంశం యొక్క కీర్తి ప్రతిష్టలను కాపాడడం నాకు ముఖ్యం అంతే నా ప్రాణం అంటే నాకు పెద్ద లెక్క లేదు.
ఈ మాట చెప్పిన తర్వాత డూరి నెజాలను చంపేసి కొండ మీద నుండి తోసేస్తుంది. తర్వాత డూరి కొండ మీద నుండి కిందకు వస్తుంది. సైనికులు డూరిని చుట్టుముట్టారు అప్పుడు డూరి సైనికులతో"నేను మీకు శిక్షణ ఇచ్చాను రా!! మిమ్మల్ని చూసి పారిపోను"అని అంటుంది.నెజాల చనిపోవడంతో దేశ మహామంత్రులు శేబనేలాను మహారాణిగా ప్రకటిస్తారు. అప్పుడు మంత్రులకు డూరికి మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది.
మహామంత్రి: డూరి! నువ్వు ఈ దేశానికి మొదటి యువరాణి అయినా నెజాలను ఎందుకు చంపావు?
డూరి: సరదాగా ఎవరితోనైనా యుద్ధం చేసి వాళ్ళని చంపలనిపించింది. నెజాల అయితే యుద్ధం బాగా చేస్తుంది అని దాన్ని ఎంచుకున్నాను. ఇప్పుడు ఏంటి నన్ను కొండ మీద నుంచి తోసి చంపేస్తారు అంతేగా! చంపేయండి
శేబనేలా: నేను ఇప్పుడు ఈ దేశానికి మహారాణిని!నెపొరెంటికా దేశానికి మహారాణిగా.మరణశిక్షకు అర్హులైన వారి యొక్క చివరి కోరిక తీర్చడం నా బాధ్యత! చెప్పు డూరి నీ చివరి కోరిక ఏమిటి?
(శేబనేలా డూరి దగ్గరకు వెళ్లి తనకు మాత్రమే వినపడేలా మాట్లాడింది అప్పుడు వారి మధ్య సంభాషణ ఇలా జరిగింది.)
శేబనేలా: డూరి! ఏ కారణం లేకుండా నువ్వు ఏ పని చేయవని నాకు తెలుసు. నిజమేంటో కనీసం నాకు అయినా చెప్పు డూరి!
డూరి: లేదు మహారాణి! నాతో కలిసి ఆ నిజం కూడా ఈ రోజే మరణించాలి!
శేబనేలా: సరే! నీ చివరి కోరిక ఏమిటో చెప్పు డూరి!?
డూరి: మహారాణి! చివరిగా ఒక్కసారి నా ఇంటికి వెళ్లి వస్తాను అదే నా చివరి కోరిక.
శేబనేలా: సరే! నువ్వు మీ ఇంటికి వెళ్లడానికి నేను అనుమతి ఇస్తున్నాను. కానీ గుర్తు పెట్టుకో నువ్వు ఇకపై ఈ దేశానికి సైన్యాధ్యక్షురాలివి కాదు. అలాగే ఇంకో 30 నిమిషాలలో నువ్వు తిరిగి ఈ కొండ దగ్గరకు రావాలి. ఇవి నీ జీవితంలోని ఆఖరి 30 నిమిషాలు. వెళ్ళు!
డూరి అక్కడి నుండి తన ఇంటికి బయలుదేరుతుంది.డూరి ఇంటికి వెళ్లి చూస్తే జఠన్ తన మనుషులతో కలిసి డూరి ఇంట్లో ఉన్న చిన్ని డిరెక్స్ పక్షిని దొంగిలించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అది చూసిన డూరి జఠన్ని మరియు తన మనుషుల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు వారి మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది.
జఠన్:డూరి! నీకు ఆ రోజే చెప్పాను నాకు కూడా సమయం వస్తుంది అప్పుడు నేను ఏంటో చూపిస్తాను అని. అప్పుడు నువ్వు సైన్యాధిపతి ఏమో! కానీ ఇప్పుడు కాదు. మర్యాదగా పక్షిని మాకు ఇచ్చేయ్. లేదంటే నీకు కొండ దగ్గర మరణశిక్ష విధించడం కాదు. నేనే నిన్ను చంపేస్తాను. మర్యాదగా అడ్డు చెప్పకుండా వెళ్ళిపో.
డూరి: జఠన్! ఒకటి గుర్తు పట్టుకో సైన్యాధిపతి పదవికి నేను అలంకారం కానీ,నాకు సైన్యాధిపతి పదవి అలంకారం కాదు.!ఆ పక్షి గురించి నాకు బాగా తెలుసు. ఆ పక్షి యొక్క జాతి 200ల సంవత్సరాల క్రితమే అంతరించిపోయింది అని కూడా తెలుసు.! కాబట్టి ఆ జాతిలో మిగిలిన ఒకే ఒక పక్షిని నీకు ఆహారంగా నేను ఇవ్వలేను. కానీ నాకు ఇప్పుడు మీతో గొడవపడేంత సమయం లేదు.
డూరి జఠన్ మీద దాడి చేసి ఆ పక్షిని తీసుకుని వెళ్లిపోతుంది.జఠన్ మరియు అతని మనుషులు డూరిని వెంటాడడం మొదలుపెడతారు. ఆ పక్షిని కాపాడే ప్రయత్నంలో డూరికి ఎన్నో గాయాలు అవుతాయి. ఇదంతా చూసిన ఆ చిన్న డిరెక్స్ పక్షి "మనుషులంతా పక్షులని చంపే వాళ్ళు కాదు. కొంతమంది మనుషులు పక్షులను కాపాడడానికి ప్రాణాలను సైతం వదులుకోవడానికి సిద్ధపడతారు"అని అర్థం చేసుకుంటుంది. ఎక్కడైతే ఆ చిన్న పక్షి డూరికి దొరికిందో మళ్లీ అక్కడికే డూరి ఆ పక్షిని తీసుకుని వెళ్లి స్వేచ్ఛగా గాలిలోకి విడిచిపెడుతుంది.డూరి ఆ చిన్న పక్షితో "ఇక్కడి నుండి వెళ్ళిపో. మళ్లీ ఎప్పటికీ ఇక్కడకు తిరిగి రాకు. ఎందుకంటే ఇకపై ఇక్కడ నిన్ను కాపాడటానికి నేను ఉండను"అని చెప్తుంది.ఆ చిన్న డిరెక్స్ పక్షికి ఆ క్షణం నుండి డూరిపై చాలా గౌరవం కలుగుతుంది. ఆ చిన్న పక్షి ఎగరడం మొదలుపెడుతుంది. ఆ చిన్ని పక్షికి డూరి ఇంకా కొంత సమయంలో మరణిస్తుంది అని తెలియకపోయినప్పటికీ డూరి ఏదో ప్రమాదంలో ఉంది అని మాత్రం అర్థం చేసుకుంటుంది.పక్షి వెళ్ళిపోవడంతో జఠన్ కూడా వెళ్ళిపోతాడు.డూరి తిరిగి షేరు కొండ దగ్గరకు వెళుతుంది.డూరిని సైనికులు కొండ మీదకి తీసుకువెళుతూ ఉంటారు.ఇంతలో ఆ చిన్న పక్షి తన మాతృభూమి అయినా టిప్ దీవికి చేరుకుంటుంది. అప్పుడు ఆ చిన్న పక్షికి తల్లి అయినా ళేయ ఆ చిన్న పక్షిని చూసి గుర్తుపట్టి ఎంతో సంతోషిస్తుంది. అప్పుడు ళేయకి ఆ చిన్న పక్షికి మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది.
ళేయ: ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్లావు నువ్వు? నేనంత భయపడ్డానో తెలుసా? నువ్వు ఇంక తిరిగి ఇంటికి రావు అనుకున్నాను!
చిన్న పక్షి: అమ్మ! నేను కూడా మళ్లీ నిన్ను చూస్తాను అనుకోలేదు. నాకు మళ్ళీ నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది.కానీ నేను ఇప్పుడు బ్రతికి ఉండటనికి కారణం ఒక మనిషి.ఇప్పుడు తను ప్రమాదంలో ఉంది. నేను ప్రమాదంలో ఉన్నప్పుడు తను నన్ను కాపాడింది. ఇప్పుడు ఇది నా వంతు. నేను ఒంటరిగా తనని కాపాడలేని.కాబట్టి దయచేసి నాకు సహాయం చేయండి మనమందరం కలిసి వెళ్లి తనని కాపాడుకుందాం.
ళేయ: ఏంటి మనిషా? నువ్వు గత మూడు రోజుల నుంచి మనుషులతో ఉంన్నవా?
చిన్న పక్షి: అవును మనిషితోనే ఉన్నాను.
ళేయ: ఆ మనిషి ప్రమాదంలో ఉందా? ఆ ప్రమాదం ఏంటి?
చిన్న పక్షి: తను ప్రమాదంలో ఉందని తెలుసు. కానీ ఆ ప్రమాదం ఏంటో తెలియదు అమ్మ.
ళేయ: ఏంటి ఆ ప్రమాదం ఏంటో తెలీదా. పోనీ తను ఎక్కడ ఉందో తెలుసా?
చిన్న పక్షి: తన దేశంలోని ఉందని తెలుసు. కానీ దేశంలో ఎక్కడుందో తెలియదు.
ళేయ:అవునా! ఇప్పుడు నేను నీకు ఏ విధంగా సహాయపడగలను అనుకుంటున్నావు?
చిన్న పక్షి: ఏమీ లేదమ్మా! తనకి సహాయం చేయడానికి నువ్వు నాన్నను ఒప్పించాలి. అలాగే ఇంకో పది డిరెక్స్ పక్షులను కూడా ఒప్పించి నాతో పంపిస్తే. మేమందరం వెళ్లి తనని కాపాడుతాను.
ళేయ: స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా నువ్వు?200ల సంవత్సరాల క్రితం మా నాన్ననీ కిరాతకంగా చంపి ఆహారంగా తినేసారు ఆ మనుషులు. మా అమ్మని వేటాడి చంపేశారు ఆ మనుషులు!.200ల సంవత్సరాల క్రితం కొన్ని వందల డిరెక్స్ పక్షులను చంపేశారు ఆ మనుషులు. అందుకే మనం 200ల సంవత్సారాలుగా మనుషులకు కనిపించకుండా బతుకుతున్నాము. అలాంటి మనుషులకు ఇప్పుడు నువ్వు సహాయం చేద్దాం అంటున్నావా?. మళ్లీ నీతో పాటు పది పక్షులను పంపించాలా? అసలు నువ్వు మనుషులు దగ్గరికి వెళ్లి ప్రాణాలతో తిరిగి రావడమే చాలా గొప్ప విషయం. మళ్లీ ఇప్పుడు పది పక్షులను తీసుకువెళ్లి మనుషుల చేత చంపించాలని అనుకుంటున్నావా? నువ్వు పుట్టి సరిగ్గా సంవత్సరం కూడా పూర్తవలేదు. నీ పొడవు ఒక అడుగు మాత్రమే.నీ వయసుకు తగినట్లుగా ప్రవర్తించు. నీతో పంపడం కాదు నిన్ను కూడా పంపను. మళ్లీ ఎక్కడికి వెళ్ళద్దు.
చిన్న పక్షి: సరే అమ్మ నువ్వు ఏదో నాకు సహాయం చేస్తావు అనుకున్నాను.మీరెవరు నాతో రాకపోతే నేను ఒంటరిగా వెళ్ళి తనని కాపాడుకుంటాను. కానీ అమ్మ! మీ నాన్నని చంపింది ఒక మనిషి అనే మాట ఎంత నిజమో, నీ బిడ్డని చావు నుంచి కాపాడింది కూడా ఒక మనిషి అనే మాట కూడా అంతే నిజం. నేను వెళ్లి వస్తాను.
(ఆ చిన్న పక్షి గాలిలో ఎగరడం మొదలుపెడుతుంది)
ళేయ: అయ్యో ఆగు! నీకు ఇంకా పేరు కూడా పెట్టలేదు.
చిన్న పక్షి: నాకు ముందే మనుషులు పేరు పెట్టేశారు అమ్మ! నాకు కూడా ఇప్పుడు ఆ పేరు ఎంతో నచ్చింది.
ఆ చిన్న పక్షి డూరిని కాపాడడానికి బయలుదేరుతుంది. సైనికులు డూరిని షేరు కొండ మీద నుండి తోసేయడానికి సిద్ధంగా ఉన్నారు.అప్పుడు శేబనేలా మహారాణి కిందినుండి కొండ మీద ఉన్న డూరికి వినబడేలా గట్టిగా అరుస్తూ తనతో మాట్లాడుతుంది. అప్పుడు వారి మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది.
శేబనేలా: డూరి! ఇప్పటికైనా నువ్వు యువరాణిని ఎందుకు చంపావో చెప్తే, నీ మరణశిక్ష రద్దు చేస్తాను.
డూరి: మహారాణి! మీరు నాకు మరణశిక్ష విధిస్తున్నారు అంటే దాని అర్థం నేను నేరస్తురాలిని అని.కానీ నేను నా దేశాన్ని నా కంటే ఎక్కువ ప్రేమించాను. మీరు మహారాణిగా నెపొరెంటికా దేశాన్ని ఎంతో గొప్పగా పరిపాలిస్తారు అనే నమ్మకం నాకుంది.మీ షేరు వంశస్తుల యొక్క కీర్తి ప్రతిష్టలకు ఎటువంటి బంగం కలగకుండా ఉండాలి అంటే ఈరోజు నేను చావాలి. కానీ నాకు నేరస్తురాలిగా చావడం ఇష్టం లేదు.అందుకే నా ఇష్టపూర్వకంగా దేశభక్తురాలిగా చనిపోదాం అనుకుంటున్నాను.
డూరి ఆ మాట చెప్పి సైనికులు తనను పట్టుకోకముందే ఆ కొండ మీద నుండి దూకేస్తుంది.కాని అప్పుడే డూరి చేత కాపాడబడిన ఆ చిన్న పక్షి ఆ చిన్న పక్షి యొక్క 10 డిరెక్స్ పక్షి జాతీ స్నేహితులతో కలిసి అక్కడికి వస్తుంది. కొండ మీద నుండి కిందికి పడిపోతున్న డూరి యొక్క వస్త్రాలను ఆ 11 చిన్న పక్షులు వాటి నోటితో పట్టుకుంటాయి.సహజంగానే డిరెక్స్ జాతికి చెందిన పక్షులు చాలా బలమైనవి.కాబట్టి ఆ 11 చిన్న పక్షులు వాటి నోటితో డూరిని పట్టుకుని డూరి బరువును మోస్తూ, ఎగురుకుంటూ డూరిని టిప్ దీవికి తీసుకొని వచ్చేస్తాయి.
ఆ చిన్న పక్షి డూరి పై చూపిన విశ్వాసాన్ని చూసి డూరి ఎంతో ఆశ్చర్యపోతుంది.గత 200ల సంవత్సరాలుగా నెపొరెంటికా దేశ ప్రజలు డిరెక్స్ జాతి పక్షులు అంతరించిపోయాయి అని అనుకుంటున్నారు.కాని టిప్ దీవిలో వందల సంఖ్యలో డిరెక్స్ జాతి పక్షులు ఉండడం చూసి డూరి ఎంతో ఆశ్చర్యపోతుంది. అప్పుడు వారి మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది.
చిన్న పక్షి:డూరి! నిన్ను కాపాడడానికి సహాయం చేయమని మా అమ్మని ఎంతో బ్రతిమాలాను. కానీ మనుషుల మీద ఉన్న భయం వల్ల మా అమ్మ ఒప్పుకోలేదు.కాని నా వయసు కలిగిన, కనీసం ఒక సంవత్సరం కూడా నిండని, కేవలం ఒక అడుగు ఎత్తు మాత్రమే ఉన్న, నా స్నేహితులు నాకు సహాయం చేయడానికి ముందడుగు వేశారు. నేను మా అమ్మతో మాట్లాడేటప్పుడు నా మాటలు విని నేను అడగకుడానే నిన్ను కాపాడటానికి నాకు నా స్నేహితులు సహాయం చేశారు. నిజంగా నాకు నువ్వంటే చాలా ఇష్టం డూరి!
(ఆ చిన్న పక్షి ఇంత అరిచి చెప్పినా కానీ డూరికి ఆ చిన్న పక్షి మాటలు అర్థం కాలేదు.డూరికి ఆ చిన్న పక్షి నోటి నుండి "టిలా టిలా"అనే శబ్దం మాత్రమే వినపడేది.డూరికి ఆ చిన్న పక్షి యొక్క మాటలు అర్థం కాకపోయినప్పటికీ ఆ చిన్న పక్షి యొక్క ప్రేమ మాత్రం అర్థమయ్యింది.ఆ చిన్న పక్షి యొక్క మాటలు డూరికి అర్థం కాకపోయినప్పటికీ,ళేయకి మాత్రం ఆ మాటలు బాగా అర్థమయ్యాయి.దేశద్రోహిగా నిందపడటం వల్ల డూరి ఇంకెప్పుడూ తిరిగి తన మాతృదేశమైన నెపొరెంటికాకి వెల్లకూడదు అని నిర్ణయించుకుంటుంది."యువరాణి అయినా నెజాల క్రూరమైన మనసు కలది మరియు నెజాల తన భర్త అయిన కోలాను చంపింది"అనే నిజం డూరికి తప్ప ఇంకా ఎవరికీ ఎప్పటికీ తెలియకూడదు అనేది డూరి యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే డూరి ఎప్పటికీ నెపొరెంటికా దేశానికి వెళ్ళకూడదు అని నిర్ణయించుకుంటుంది)
డూరి: సరే! చిన్న పక్షి!"టిలా టిలా"అని ఊరికే అరవకు వినలేకపోతున్నాను. నీ ప్రేమ నాకు అర్థం అయింది. ఇక నేను మీతోనే ఈ దీవిలో ఉండిపోతాను.
(ళేయ ఆ చిన్న పక్షితో ఇలా అంటుంది)
ళేయ: అవును! మనుషులు నీకు ఏదో పేరు పెట్టారు అన్నావ్! నీ పేరేంటి?
చిన్న పక్షి: అమ్మ! నా పేరు "డూరి పెట్"

డూరి డిరెక్స్ పక్షులతో కలిసి సంతోషంగా బ్రతకడం నేర్చుకుంటుంది.ళేయ మరియు మిగిలిన డిరెక్స్ పక్షులు మనుషులందరూ చెడ్డవాళ్ళు కాదని తెలుసుకుంటాయి.

22 సంవత్సరాల తర్వాత

ఎప్లేనియా ఖండం యొక్క భూగర్భం అడుగున ఉష్ణోగ్రత అధికంగా పెరగడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించి‌ టిప్ దీవి,నెపొరెంటికా దేశంతో సహా ఎప్లేనియా ఖండం పూర్తిగా అంతమైపొయింది.టిప్ దీవితోపాటు డిరెక్స్ జాతి పక్షులు కూడా అంతరించిపోయాయి.వాటి ఆనవాళ్లు కూడా భూమిమీద మిగలలేదు.ఎప్లేనియాకి సంబంధించిన ఏ ఒక్క సాక్ష్యము కూడా భూమిమీద మిగల్లేదు.ఎప్లేనియాని ప్రపంచం మర్చిపోయింది.