Kshantavyulu - 8 books and stories free download online pdf in Telugu

క్షంతవ్యులు - 8

క్షంతవ్యులు – Part 8

చాప్టర్ 21

ఎవరిని దుర్భాషలాడని భాషలో, ఎంతో సున్నితంగా లఖియా ఆత్మకథ సాగింది. తనలాగా అంత విపులంగా చెప్పడం నా చేతకాదు, అందుచేత పాఠకులకు దాన్ని క్లుప్తంగా, నాకు తెలిసిన తీరులో విన్నవిస్తాను.

ఆఖరికి మరణ శయ్యమీద లఖియా భర్తకు జ్ఞానోద‌యం కలిగింది.

‘‘నేను బతికి ఉన్నంతకాలం నిన్ను బాధ పెట్టాను లఖియా, నా తర్వాతనైనా నువ్వు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా భార్యవయినందుకు నా పాపాలు నీకేమీ అంటకూడదని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను,’’ అని తల నిమురుతూ చెప్పాడు.

అప్పుడు భర్తను తనకు దక్కించమని ఎంతో ప్రార్థించింది, కానీ దైవం అతడి నుంచి వేరుచేశాడు. చివరికయినా భర్త ఆదరణ లభించింది అతని అనురాగం పొందింది అందుకే అంతకంటె ఆనందకరమైన రోజులు తన జీవితంలో లేవు అనుకుంటుంది.

ఇల్లువాకిలీ అమ్మి, భర్త అంత్యక్రియలు చేసి అప్పులు తీర్చింది లఖియా. తరువాత నుదుట కుంకుమ చెరుపుకుని, తెల్ల చీర కట్టుకుని, నాలుగు మూటలతో గడప దాటింది లఖియా, కానీ ఎక్కడకు వెళ్లాలి? తిండిలేకపోతే పస్తువుండవచ్చు కానీ, అందమైన స్త్రీలకోసం అర్రులు చాచే క్రూరమృగాలున్న ఈఅరణ్యంలో వుండటానికి తలుపువున్న ఒక ఇల్లు వుండాలి. కానీ ఆ నీడనిచ్చే వ్యక్తి ఎవరు? తటుక్కున తల్లి ఒక నాడు చెప్పినమాట జ్ఞ‌ప్తికి వచ్చింది లఖియాకి, ‘ఎప్పుడైనా కష్టాల్లో వుంటే మామయ్య దగ్గరకు వెళ్లమ్మా, కాదనడు.’

లఖియా మామయ్య ఢిల్లీలో వున్నాడు. అయిదు సంవత్సరాల క్రితం భార్య హఠాత్తుగా కాలం చేసింది, ముగ్గురు కూతుర్లని, యిద్దరు కొడుకుల్ని భర్త మీద, గాలి మీద వదలి. అప్పట్నించి ఆయన అష్టకష్టాలు పడుతున్నాడు. ఏభై ఏళ్లు దగ్గిరకి వచ్చాయి. ఒక్కడూ ఏం చేయగలడు? ఒక వంటమనిషిని కుదుర్చుకుని, తల్లిలేని ఆ అనాధలతో కాలం వెళ్లబుచ్చుతున్నాడు. అటువంటి అక్కడకు ఆమె చేరింది. ఎన్నో ఏళ్ల తరువాత కలసిన మామయ్య, మేనకోడలికి చాలా ఆప్యాయంగా స్వాగతం పలికాడు.

లఖియాకి సోదంతా చెప్పి కంటతడి పెట్టుకున్నాడు.

“నువ్వు వచ్చావు ఈనాడు. మీ అమ్మకి ఒకప్పుడు వాగ్ధానం చేశాను. నీ కూతురు మీద ఈగ వాలకుండా చూస్తానని. పవిత్రమైన స్మృతిలో మునిగి వున్న మీ అమ్మ సుగుణాలని పొగడటానికి ఒక నోరు చాలదు. ఇంటి తాళం చెవులు నీకే యిస్తాను. ఇనప్పెట్టె తాళం చెవులు నా దగ్గర పెట్టుకుంటాను. ఎందుకయినా మంచిది. పాడు పట్టణం. ఢిల్లీలో దొంగలకి, దొరలకీ తేడా తెలియదు,” అన్నాడు.

లఖియా కరిగిపొయింది. ఇంత మంచి మామయ్య ఉండగా తను చింతించవలసిన అవసరం లేదనుకుంది.

‘‘ఎందుకైనా మంచిది మామయ్య. భోషాణం తాళం చెవులు కూడా నీ వద్దే వుంచుకో,’’ అని, అవి తీసి ఇచ్చేసింది.

పిల్లలంతా ఈమెమీద ఎగబారేరు. చిన్నమ్మో, చిన్నమ్మో అంటూ. అందరికంటె పెద్దవాడు, కృష్ణుడు. కాలేజీలో మూడేళ్ల బట్టి బీఏ చదువు తున్నాడు. ఇంకొక రెండేళ్లలో తప్పక పాసవుతానని పదే పదే నొక్కి చెప్పాడు. పెద్దకూతురు సుజాత పెళ్లీడు వచ్చింది. చాలా మంచి పిల్ల, అందంగానే ఉంది. కానీ శరీరఛాయ నలుపు. కొద్దికాలంలోనే లఖియా హృదయం వశపరుచుకుంది. మిగతా వారంతా ఎదగని పిల్లలవడం వల్ల ఇంట్లో ఎప్పుడు ఎడతెరిపిలేని అల్లరి. వాళ్లకి భయం భక్తులూ బొత్తిగా శూన్యం.

ఆమె గుమ్మంలో అడుగుపెట్టిన వారం రోజులకి దాయి మానేసింది. ఇంకొక వారానికి వంటమనిషి ఉద్యోగానికి స్వస్తిపలికింది.. సుజాత ఏమేమో చెప్పింది. తన తండ్రే కావాలని పనివారిని మానిపించేశాడని. కాని అదేమీ నిజంకాకపోవచ్చు. మావయ్య అటువంటి మనిషి అనిపించదు. ఏదైతేనేం దీంతో ఇంటి పని మొత్తం లఖియా మీద పడింది. సుజాత సాయం చేసేది అయినప్పటికి ఆ సాయం ఏ మూలకొస్తుంది. ఇటు పసికూనలను చూడాలి, అటు ఇంటి పని చెయ్యాలి. మామయ్య ప్రతి చిన్న పనీ ఆప్యాయంగా అడిగి చేయించుకుంటాడు. కానీ కాస్త పొద్దున్నే పూజ చేసుకుందామనుకుంటే కూడా కుదిరేదికాదు.

ఆఖరికి ఒక నౌకరు మటుకు కుదిరాడు. దిలీప్ తెల్లగా, పుష్టిగా, గంభీరంగా నిండుగా వుంటాడు. పనివరకూ వచ్చేటప్పటికి నీరసమయ్యేవాడు. అయినా అప్పుడప్పుడు లాఖియాకి కొంత విశ్రాంతి కలిగేది. అలాగే కాలం గడిచి పోతూంది. సుజాతకి పెళ్లి చేద్దామని మామయ్య సంబంధాలు వెదికేవాడు. ఎక్కడో ఢిల్లీలో కూర్చుంటే సంబంధాలు ఎక్కడ నుంచీ వస్తాయి. చూసిన వారు పెదిమ విరిచారు. ఆమె శరీర ఛాయ ఆమె శత్రువయి పోయింది. సుజాత క్రుంగిపోయేది. ఒకనాడొక పెళ్లికొడుకు వచ్చి చూసి కాదని వెళ్లిపోయింతర్వాత చాటుగా కబురు పంపాడు...లఖియా అయితే అభ్యంతరం లేదని, పెళ్లంటే అట్టే పట్టింపులేదని. ఆపెళ్ళికొడుకు సందేశము లాఖియాను బాగా కలవరపరిచింది.

‘‘నాన్నా, చిన్నమ్మలాంటి అందకత్తె మన ఇంట్లో వుండగా సుజాతకు పెళ్లెలా అవుతుంది. ఆపెళ్లికొడుకు చిన్నమ్మకేసి కళ్ళు పారేసుకోవడం నేను చూసాను,’’ అన్నాడు కృష్ణుడు.

‘‘నోరుముయి, భడవా,’’ అని హుంకరించాడు మామయ్య.

అప్పటినుంచి సుజాతని చూడటానికి ఎవరైనా వచ్చినప్పుడు లాఖియా ఎక్కడో దాక్కునేది. అయినా పెళ్లి కుదరలేదు. సుజాత దుఃఖానికి మేరలేదు.

‘‘అసలు నేనెందుకు పుట్టాను చిన్నమ్మా? మూడు సంవత్సరాల క్రితం టైఫాయిడు జ్వరం తీవ్రంగా వచ్చింది. అప్పుడు నేనెందుకు చనిపోలేదు. దేవుడు ఈ చర్మానికి నలుపు రంగు ఎందుకు ఇచ్చాడు. అయినా కానీ నల్లగావున్న అబ్బాయిలకి కూడా నేను ఎందుకు తగను,” అంది సుజాత ఏడుస్తూ లఖియా ఒళ్లో తల పెట్టుకుని.

సుజాతకు పెళ్లి సంబంధం దొరకక పోవడంతో ఆమెను మామయ్య అనేక మాటలు అనేవాడు. అప్పుడప్పుడు ఆ కోపం లఖియా మీద కూడా చిగురించేది. లఖియా ఒకవైపున సుజాతని ఓదార్చాలి. మరోవైపు మామయ్య కోపం చల్లార్చాలి.

ఒకనాటి తెల్లవారుజామున సుజాత లఖియాని లేపి ఒళ్లోపడి ఏడ్వటం మొదలుపెట్టింది.

‘‘ఏం జరిగిందో చెప్పు సుజాతా. మామయ్య ఏమైనా అన్నాడా?” అంది లఖియా ఖంగారుపడుతూ.

‘‘కాదు పిన్నమ్మా, నేను నిన్ను వదిలి వెళ్లిపోతున్నాను’’ అని బావురుమంది సుజాత.

‘‘ఎక్కడికి సుజాతా? నాకు అంతా చెప్పు” అంది లఖియా.

‘‘ఇంక ఈ ఇంట్లో నేను ఉండలేను చిన్నమ్మా. నేను అందరికీ అంటరానిదానినయ్యాను. నువ్వొక్కత్తివే నన్ను ఆదరించావు. మళ్లీ జన్మలో నీ కడుపున పుట్టి నీ రుణము తీర్చుకుంటాను. వారు వేచి వున్నారు, ఇక నేను వెళ్లిపోతాను చిన్నమ్మా,’’ అంది సుజాత.

లఖియా ఆశ్చర్యానికి అంతులేదు. అంతవరకూ సుజాతకి కోపం వచ్చిందనీ, కాస్త బుజ్జగిస్తే మామూలు స్థితికి వస్తుందనీ అనుకొంది. కానీ సుజాత ఒక పురుషునితో సంబంధం కొనసాగిస్తుం దనుకోలేదు.

‘‘వారు ఎవరు సుజాతా? ఆవేశంలోనూ, కోపంలోనూ ఏపనీ చేయకూడదు,’’ అంది లఖియా.

‘‘అంతా నీకు తర్వాత తెలుస్తుంది. చిన్నమ్మా ప్రస్తుతం నేను అదంతా చెప్పలేను. నా తలరాత ఎలా రాసివుంటే అలాగే అనుభవిస్తాను. నా గురించి నీవేమీ బాధపడకు. నన్ను ఆశీర్వదించు చిన్నమ్మా,’’ అని సుజాత లఖియా కాళ్ళకి మొక్కింది

“సదా నిన్ను ఆ దైవం రక్షించుగాక,’ అంటూ లఖియా సుజాత తలను తాకింద.

సుజాత లఖియాను కౌగలించు గుని వీద్డ్కోలు తీసుకుంది.

సుజాత ఎవరో పురుషునితో లేచిపోయింది. ఎవరా పురుషుడు? సుజాత ఎక్కడా ప్రేమకలాపాలు సాగించినట్లు లఖియాకు ఏ కోశానా తెలియదు. ఇంత హఠాత్తుగా ఇది ఎలా పరిణమించింది? లఖియా ఎంత ఆలోచించినా అంతుబట్టలేదు. సుజాత అంత సాహసం చేస్తుందని ఆమె అనుకోలేదు. మామయ్యకి చెప్పటమా, మానటమా అని ఆలోచించి చివరికి చెప్పకూడదనే నిశ్చయించింది.

ఆఖరికి రాత్రంతా మెలుకువగా ఉన్నలాఖియాకు తెల్లవారింది. సుజాత ఆత్మహత్య కుందేమోనని మామయ్య భయపడ్డాడు.. కాని ఆమె శవం ఆ చుట్టుపక్కల ఎక్కడా దొరకలేదు. జమునలో కూడా తేలినట్లు పోలీసులు రిపోర్టు చేయలేదు. సుజాత మాయమైన మరుసటి రోజు దిలీప్ పనిలోకి రావటం మానేశాడు. వాకబు చేస్తే వాడుకూడా ఆ రాత్రే అంతర్థానమయ్యాడని తెలిసింది. మామయ్య కోపానికి అంతులేదు. మచ్చలేని వారి వంశానికి మాయని మచ్చ తెచ్చిందన్నాడు. కృష్ణుడైతే చెల్లెలి ధైర్యానికి ఆశ్చర్యపోయాడు.

లఖియా సుజాతను తరువాత ఎన్నడూ చూడలేదు. ఇక ముందు కూడా చూస్తాననే ఆశ లేదు తనకి. లఖియా ఆమె కథ చెప్పినప్పుడు ఆమె సరైన పని చేయలేదనుకున్నాను. ఆ దిలీప్ ఎవరో ఆమెని వివాహం చేసుకున్నాడనుకోవడానికి ఆస్కారం చాలా తక్కువ. అలాంటి సందర్భాల్లో సాధారణంగా ఆ విధంగానే జరుగుతోంది. సుజాత ఇంటి నుంచి బయటికి వచ్చిన కారణంగా, కుటుంబం, తండ్రి, భవిష్యత్తూ అన్నీ కాలదన్నింది. ఇవన్నీ ఒక ఎత్తైతే సుజాతకి ఇక అతనే ఏకైక ఆధారం. కాని అతగాడు ఆమెను వదిలి సమాజంలో తిరిగి ప్రవేశిస్తే చేతులు జాపి చేరదీస్తుంది. ఒకవేళ సుజాత తన తప్పు తెలుసుకుని మళ్లీ వస్తే అదే సమాజం కుక్కలను పురిగొల్పి తరిమివేస్తుంది. కులట పాపి, కళంకిణి అనే పదాల్ని విరివిగా వెదజల్లుతుంది. దైవం కూడా అలాంటి స్త్రీల ఎడల కరుణ, కనికరం చూపించడు. పురుషుల పాపాల నెన్నిటినైనా కప్పివేస్తాడు. బయటకు వాటి సూచనలేమీ వుండవు. స్త్రీకి మాతృత్వాన్ని ప్రసాదిస్తాడు. దానితో ఆమె తప్పులన్నీ బయటపడతాయి.

స్త్రీ సాధారణంగా మాతృత్వం కంటె మిన్నగా మరేమీ కోరదు. తన బిడ్డను లాలించటంకంటె వేరుగా ఆమె ఆశించేది మరొక్కటి వుండదు. కాని ఇలాంటి పరిస్థితిలో మాతృత్వం ఆమెకొక శిక్ష. తల్లి కాబోతున్నదనే విషయం తెలిసిన వెంటనే అతగాడు అదే రాత్రి పలాయనం చిత్తగిస్తాడు. అందునా హోటలు బిల్లు చెల్లించకుండా. మగవాడు ఎంతమంది స్త్రీల నైనా తల్లులను చేయగలడు. తను ఎన్నడూ తల్లి కాలేడుగా. అందరూ ఇలాంటి వారని నేనెన్నడూ అనను. అలా అయినట్లైతే లఖియాతో నేను తర్వాత చెప్పినట్లు తల బద్దలు కొట్టుకుని ఆమెవద్ద చచ్చేవాడిని. ఇలాంటి స్త్రీలు కూడా వుంటారు. తేడా ఏమిటంటే వీరు బయట పడతారు; పురుషులు బయటపడరు అంతే.

ఏమైతేనేం, సమాజం మీద సుజాత కక్ష తీర్చుకుంది. చర్మం నల్లగా వుందని పెళ్లికొడుకు లందరు ఆమెని నిరాకరించారు. అందుచేత ఒక తెల్లటి పురుషుని తీసుకుని ఆమె యింట్లోంచి వెళ్లిపోవడానికి ఇష్టపడింది. ఆ పురుషుడు నౌక రైనా ఫర్వాలేదు. ఒకవేళ సుజాత అదృష్టం బాగుండి దిలీప్ మంచివాడేమో, ఆప్యాయతతో ఆమె జీవితం సుఖవంతం చెస్తాడేమో. అవును, అలా ఎందుకు కాకూడదు. ఎందుకు అన్యధా భావించాలి మనము. కాని నా మనస్సు ఎందుకో చెడు సూచిస్తూంది..

సుజాత ఇల్లు వదలటంతో లఖియాకు ఆమె సహచర్యం, ఓదార్పు కోల్పోయింది. అప్పుడు సుజాతను చూసే ఆ బరువంతా మోయగలిగింది. కాని ఇప్పుడు ఏం చేస్తుంది. అలాగే కాలం గడుపుతూ వుంది.

‘‘చూడు లఖియా; నువ్వు మా కొక దేవతలా దొరికావు, ఇన్నాళ్లూ నువ్వు ఈ ఇంటి భారమంతా వహించావు. నువ్వు లేకపోతే ఏమి జరిగివుండునో ఊహించడంకూడా కష్టం. మా కుటుంబంలో ఒక వ్యక్తిగా మెలిగావు. నువ్విక్కడ శాశ్వతంగా వుండిపోతే ఎంతో ముదావహంగా వుంటుంది. ఏమంటావు?’’ ఒక నాడు మామయ్య తన గదిలోకి వచ్చి అన్నాడు,

మామయ్య ఎంత మంచివాడు. లఖయా హృద‌య‌మంతా కృత‌జ్ఞ‌త‌తో నిండిపోయింది.

‘‘ఇదంతా నీదయ మామయ్య. అలాగే చేస్తాను. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు,’’ అంది.

ఇంత త్వరగా ఒప్పుకునేసరికి మామయ్య కాస్త కంగారుపడ్డాడు.

‘‘చాలా సంతోషం, అయినా చూడు దగ్గర చుట్టరికంలేందే ఎల్లకాలం వుండిపోతే నలుగురూ నాలుగు విధాలుగా అనుకుంటారు, అందుచేత...........’’ అని మామయ్య ఆగిపోయాడు.

“నువ్వనేది నాకేమీ అర్థం కాలేదు. నెమ్మదిగా వెళ్లిపొమ్మంటున్నారా ఏమిటి మామయ్యా!, ఏమీ చేయమంటావు,’’ అంది లఖియా.

“చూడు లఖియా న నాకేమంత వయస్సు మించిపోలేదు. అయినా పునర్వివాహంలో తప్పేముంది. అందుచేత నిన్ను నేను.........నిన్ను ఇంటిదానిని చేస్తాను. అలాగైతే నువ్విక్కడే వుండిపోవచ్చు. ఎవ్వరూ నోరు విప్పలేరు,” అన్నాడు అతను.

లఖియాకి నోటివెంట మాట రావటం లేదు. రాతిబొమ్మలా ఉండిపోయింది. మామయ్య మాటల అర్థం తెలిసేటప్పటికి కొంత సేపు పట్టింది. తను మౌనంగా ఉండేసరికి మామయ్య ఉత్సాహం హెచ్చింది.

“నీ మౌనం చెప్తోంది నీకిష్టమేనని. వచ్చే నెల మంచి ముహూర్తం వుంది,” అన్నాడు.

“మామయ్యా! చాలు ఇక అలా మాట్లాడకు, నేను నీ కూతురులాంటి దానిని, నన్నిలా అవమానం చేస్తావా? ” అని, బయటకి వచ్చేసింది.

మామయ్యకు ఎవరో చెప్పివుంటారు. స్త్రీలు కాదంటే అవును, అవునంటేకాదు అని, అందుచేత ఆయన నిరుత్సాహపడలేదు. దాని ఫలితం ఏమిటంటే, మళ్లీ తన నాలుగు చీరలు మూట కట్టుకుని అమె ఆ ఇంటిలోంచి బయట పడింది. అదృష్టవశాత్తు ఎవరో పుణ్యాత్మురాలు దయతలచి కావాల్సిన డబ్బు ఇచ్చి అమెను ఈఆశ్రమానికి పంపించింది. గురువుగారు కూడా కనికరించి తనను ఆశ్రమంలో చేర్చుకున్నారు. అలాగ వారు లఖియాకి జీవితంలో సహాయం చేసిన వారి జాబితాలో చేరేరు - ఈ అజ్ఞాత స్త్రీ, సరళల తోటి . కాని నేను ఎప్పుడూ ఆమెకు ఏమీ చేయలేకపోయాను.

“మామయ్యను వదిలిపెట్టి రావటం సబబా, కాదా, అని ఇప్పటికి అనుమాన పడుతుంటాను. మామయ్య స్వతహాగా మంచివాడే. క్షణమాత్రం ఏదో పాడు బుద్ది పుట్టింది. మామయ్యతో మాట్లాడితే తన తప్పు తెలుసుకునేవాడు. ఇంట్లో ఆడదిక్కులేదు. తర్వాత తన పరిస్థితి ఎలా ఉందో ఎంత కష్టపడుతున్నాడో ఆ పిల్లలతో పాపం. మామయ్య నాకెంతో సాయం చేశారు. నీను మాత్రం ఆయనకి ఈ విధంగా ప్రతిఫలం చూపించాను,” అంది లఖియా జరిగిందంతా చెప్పి.

ఆ మాటలు వింటూంటే నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. కోపంతో అన్నాను... ‘‘చాలు లఖియా ఇక నువ్వు మాట్లాడకు. లేకపోతే నేను బయటికి వెళ్లిపోతాను.’’

లఖియా బిత్తరపోయి అంది, ‘‘ఏమిటి రామంబాబు మీరంటున్నది.”

“ఇంత అమాయకురాలివి. ఈ ప్రపంచంలో నీకు ఎలా గడుస్తుంది లఖియా. లేకపోతే నువ్వనేదేమిటి? ఆ మామయ్యతో వుండకపోవటం నీ తప్పంటావా? నువ్వు పడిన ఈ కష్టాలు ఇంకొక స్త్రీ పడినట్లైతే పురుషుడంటేనే అసహ్యంచుకుంటుంది. పురుషజాతి తరఫున నిన్ను మమ్మల్నందరిని క్షమించమని వేడుకుంటాను. నీకు జీవితంలో తారసిల్లిన వారంతా చాలా అన్యాయం చేశారు. అయినా అందరూ అలాంటివారు కాదు లఖియా, లేకపోతే నేను ఇక్కడ తల బద్దలు కొట్టుకుని చస్తాను,’’ అన్నాను నాకు దుఃఖము ముంచుకొస్తుంటే.

లఖియా నా ఆవేశానికి చాలా ఆశ్చర్యపోయింది. కొంచెం సేపు మాట్లాడలేదు కూడా; ముఖంమీద ఎప్పుడూ వెలిగే ఆ మందహాసమూ మాయమయింది. ఆమె మస్కిష్టం మేఘావృత‌మైంది.

“ఎంతైనా మామయ్యను మీరు దోషిగా పరిగణించకండి రామంబాబూ. తప్పెవరిదీ లేదిందులో. ఆ పరిస్థితుల్లో చాలా మంది మా మామయ్య లాగే చేస్తారనుకుంటాను,” అంది

‘‘అందరూ అలాగే ఎందుకు చేస్తారు. మళ్లీ అలాంటి మాటలనకు,’’ అన్నాను.

“పురుషులంతా అలాంటి వారని నేనెప్పుడూ అనుకోలేదు. వారిని గురించి కూడా నేను చెడుగా భావించటంలేదు. అయినా నేను మిమ్మల్ని అలాంటి వారితో ఎప్పుడూ పోల్చలేను రామంబాబూ. అది ఎలాంటి తప్పిదమో నాకు తెలుసు. నేను అనేదేమిటంటే, కూతుర్ని కోల్పోయిన తర్వాత ఆడదిక్కులేక బాధపడుతూన్న సమయంలో మామయ్య నోరు జారి ఆ మాటలన్నాడు. అది పరిస్థితుల ప్రభావం. ఆయన తప్పుకాదు. పరిస్థితుల ప్రాబల్యం వల్ల మనము అనేక పనులు చేస్తాము. నా జీవితంలో తటస్తపడ్డ వ్యక్తులంతా మంచి వారే. ఎవర్ని కూడా చెడ్డవారనటానికి కారణం లేదు,” అంది.

నా అవేశానికి నేను కాస్త సిగ్గుపడ్డాను. లఖియా చెప్పిందే నిజమేమో? తన మామయ్య మంచి ఉద్దేశ్యంతోనే అలా చేశాడేమో?

“సరే, అలా అయితే మీ మామయ్య పేరు ఏమిటో చెప్పు లఖియా? ఈసారి ఢిల్లీ వెళ్లినప్పుడు వారికి నా నమస్కారాలు చెప్పుకుంటాను,’’ అన్నాను.

‘‘వద్దు మీ నమస్కారాలు ఆయనకు చెప్పనక్కర్లేదు. ఇక్కడ నుంచే చెప్పండి. నాకు తెలుసు ఇలా అంటారని. అందుకనే పేరు చెప్పలేదు,“అంది లఖియా నవ్వుతూ.

‘‘సరే లఖియా, నీలో ఇంత ఔదార్యమూ, క్షమాశక్తివున్నప్పుడు నేను అడ్డురాను. జీవితంలో మానవుడు నీకు చేయగలిగిందేదైనా ఉంటే నువ్వు మొదట అడగాల్సిన వాడిని నేను,’’ అన్నాను.

‘‘అవసరం వస్తే అలాగే చేస్తాను. రామంబాబూ. ఇక వెళ్లండి మీరు. సుందరి తిరిగివచ్చే వేళయింది,” అంది.

అవును నిజమే యశో మాటే మరిచిపోయాను.

చాప్టర్ 22

కాలం దొర్లిపోతూంది. జీవితం సుఖంగా ఆహ్లాదకరంగా సాగిపోతూంది. లఖియా, యశో, వీరిద్దరూ నాకేమీ లోటు రానిచ్చేవారు కారు. ఈ ఇద్దరి స్త్రీలలోనూ ఎన్ని పోలికలునాయి. ఈ ఇద్దరూ స‌హృద‌యులే. ఒకామె విధవ, మరొకామె అవివాహిత ప్రేయసి. ఒకామెలో శాంతమూ, సహనము సమానంగా ఉన్నాయి. ఇంకొకామెలో సహనం వుంది, శాంతి లేదు. ఒకామె జీవితంలో చెప్పరాని కష్టాలు ఎదురయ్యాయి విధి చాలా అన్యాయం చేసింది ఆమెకు. అయినా ఆమెలో లేశమాత్రమయినా క్రోధం లేదు . ఎవరిమీదా ఈర్ష్య కూడా లేదు. కక్ష అసలు రాలేదు. వేరొకామె జీవితంలో కష్టాలను చవిచూడలేదు. అయినా అర్ధరహితంగా ప్రపంచాన్ని కాలదన్నింది. ఈమెలో అణగారిన కోరికలు ప్రేమించిన వ్యక్తి రాకతో అవి తిరిగి తల ఎత్తుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఒకామె సర్వస్వాన్ని హృద‌యపూర్వకంగా త్యజించింది.. ఇంకొకామె త్యజించాలని ఆశిస్తూ వుంది కాని అలా చేయలేదు. అలా చేయాల్సిన కారణం కూడా నాకు కనబడదు. ఇరువురికి ఒకరిమీద వొకరికి అమితమైన ప్రేమా, పూర్తి విశ్వాసమూ ఉన్నాయి.

పగలల్లా యశోకి ఏమి తీరిక వుండేది కాదు. నాకు వేళకు అన్నీ సమకూర్చడమూ, గురువుగారికి సేవ చెయ్యడంతో సరిపోయేది. రాత్రిళ్లే మాకు కులాసాగా కబుర్లు చెప్పుకోవడానికి వీలు దొరికేది. వెన్నెల రాత్రులలో గంగ ఒడ్డునకు వెళ్లేవాళ్లము. గంగ అల్లంత దూరంలో వుందనగానే యశోకి ఎక్కడలేని ఉత్సాహమూ వచ్చేది. నా చెయ్యి పట్టుకుని లాగుతూ పరుగెత్తేది. నల్లతాచులాంటి జడను ముందర వేసుకుని, తామరతూడుల్లాంటి చేతులు నా భుజాలమీద వేసి కిలకిల నవ్వుతూ ‘‘బాదల్ బాబూ’’ అనేది కళ్లలోకి చూస్తూ. అటువంటప్పుడు తెల్లటి లతలాంటి ఆ చేయి, మృదువైన‌ ఆ వంకరలు, పచ్చటి ఆ చర్మంలోంచి తొంగి చూసే ఆ నీలి నరాలు నన్ను సమ్మోహితుని చేసేవి. మెత్తగా, నున్నగా వున్న ఆ బాహువులను చూస్తుంటే ఒళ్లు పులకరించేది. చిదిమితే లోపల నరాలు బయట పడతామో అనిపించేది . స్త్రీ హస్తసౌందర్యానికి ఎవరు ముగ్ధులవలేదు? ఎంతమంది కవులు కొనియాడలేదు? చిత్రకారులు చిత్రించలేదు?

‘‘నీ చేతుల గాజులు ఏమయ్యాయి యశో?చేతులు పూర్తిగా బోడిగా వున్నాయి,’’ అడిగాను ఒకసారి.

‘‘అన్నింటితో పాటు అవీ పోయాయి బాదల్ బాబు. వాటి పని ఏముంది చెప్పండి?’’ అంది యశో నవ్వుతూ.

‘‘అయితే ఉన్న బంగారం అంతా అమ్మేశావా, అమ్మి?’’అన్నాను.

“అమ్మలేదు అవసరం కోసం దాచాను,’’ అంది నవ్వుతూ.

అప్పుడప్పుడు నిజంగానే పిచ్చెక్కేది యశోకి. గాలిలో తేలిపోవాలనుంది. పట్టుకోండి చూద్దామని లేడిలాపరుగెత్తేది. ఆ పరుగెత్తడంలో క్రిందపడి, ’’ నన్ను లేవదీయండి’’ అనేది.

ఇన్ని కోరికలున్న వ్యక్తి సన్యాసిని ఎలా కాగలదు? ఒక వెన్నెలరాత్రికే యింత వుద్వేగపడే ఈమె సర్వస్వాన్నీ ఎలా త్యజించగలదు?

అయినా ఆమె నియమాలన్నింటినీ పాటించేది. పొద్దున్నే నదిలో స్నానం చేసి కోసిన పూలతో పూజా, గురువుగారి సేవా, ఉపవాసాలూ అన్నీ క్రమబద్దంగా ఆచరించేది. అయితే ఈమెలో ఏమైనా అంతర్యుద్దం జరుగుతోందా?

గురువుగారు మళ్లీ ఆయనను కలుసుకోమని ఆహ్వానించారు. దానిని పురస్కరించుకుని ఒకసారి యశోతో ఆయన వద్దకు వెళ్లాను. ఈసారి గుమ్మంవద్ద వుండగానే ఆహ్వానం వచ్చింది. నా వెనుక కాస్త పరికించి చూశారు స్వామిజీ. సరళ జాడలేమైన కనబడుతాయేమోనన్నట్లు.

‘‘రా నాయనా, కూర్చో,” అన్నారు చిరునవ్వుతో సరళ నాతో లేదనిగ్రహించి

ఎక్కడ కూర్చోను? అక్కడ ఏమీ ఆసనం, కనీసం చాపయినా లేదు. యశో నేల మీద కూర్చొని నన్ను కూడా అలాగే చెయ్యమని సంజ్ఞ‌ చేసింది. నేను ఇంకా సందేహిస్తూంటే, యశో నా జేబులోంచి రుమాలు తీసి కిందవేసింది. ఏం చేస్తాను? అలాగే కూర్చున్నాను. కాసేపు గురువుగారు మాట్లాడలేదు.

‘‘నీకిక్కడ కాలం ఎలా గడుస్తూంది నాయనా,“ ఆఖరికి అడిగారు.

‘‘బాగానే గడుస్తూంది స్వామి,’’ అన్నాను వినయంగా.

‘‘నువ్వు మామూలుగా ఏమి చేస్తుంటావు నాయనా?” అన్నారు గురువు గారు.

‘‘ఏమీ చెయ్యను స్వామీజీ,’’ అన్నాను.

సంభాషణ ఏమిటి ఇలా నడుస్తూంది? యశో అలాగే మా వంక చూస్తుంది. ఏదో మాట్లాడాలనే అతురతలో తప్పు పలుకుతానని సందేహం వస్తుంది.

‘‘మీకు జ్ఞానోద‌యం ఎప్పుడు కలిగిందో తెలుసు కోవాలని ఉంది స్వామీజీ,’’ అన్నాను.

గురువుగారు దాని కోసమే ఎదురు చూస్తున్నట్టు తడుముకోకుండా మొదలుపెట్టారు.

‘‘నా ఇరవై అయిదవ ఏట కలిగింది నాయనా. అప్పటికి అయిదు సంవత్సరాల క్రితం నాకు వివాహ మయింది. సంసారజీవితంమొదలుపెట్టిన అనతికాలంలోనే నాకు తుచ్ఛ ప్రాపంచక భోగాలంటే విరక్తి కలిగింది. మానవుడు ఎందుకు పుట్టాడు? ఎక్కడకు పోతాడు? జీవితం యొక్క అర్థమేమిటి? ఈ ప్రశ్నలతో సతమతమయ్యేవాడిని, ఐతే భార్యమీద వున్న మమకారం ఒక్కటే నా జ్ఞాన శోధనకు అడ్డువచ్చేది. ఇలా వుండగా నాకొక జనకుడు జనించి ఆరునెలలకి కాలంగతం చేసాడు. ఆ పుత్రశోకంలో నా భార్యామణికి మతిపోయేటంత పనైంది. నాకును జీవితం మీద విరక్తి కలగసాగింది. ఎక్కడకు పోయాడు నా పుత్రుడు? నేను జీవించి వుండనా? ఆ ప్రశ్నకి సమాధాన అన్వేషణార్ధం గృహ విసర్జనం చేశాను. ఆ ప్రశ్నకి సమాధానం ఎలా దొరికిందో తెలుసుకోవాలనే కుతూహులం నాలో లేదు.’’

‘‘మీకు జ్ఞానోద‌యం మీ వివాహం కాకముందు జరిగినట్టయితే చాలా బావుండును కదా ,’’ అన్నాను.

‘‘ఎందుచేత నాయనా?’’ అన్నారు.

‘‘మీ సుఖం కోసం మీ భార్య సుఖం త్యాగం చేశారు కదా? ఆ తర్వాత ఆమె గతి ఏం కాను? అది ఆలోచించండి. మనము ఏ పని చేసినా దాని వల్ల మనకు సుఖము లభించినా ఇతరులకు అన్యాయం చేయకూడదనే సూత్రం మంచిది కాదా స్వామీజీ?”అన్నాను.

నా మనస్సు పుత్రశోకంతో బాధపడుతున్న దన్న అయన, భర్త విడబాటు వంటి గొడ్డలి పెట్టుకు తన భార్యఎలా తట్టుకుందా అని ఆలోచించలేదు. అందరికీ చెప్పినట్టే తన కథనులో తన త్యాగాన్నీ అనర్గళంగా వివరించారు గురువుగారు. అడ్డుప్రశ్న వేసేసరికి కాస్త ఇరకాటంలో పడ్డారు.

‘‘ఆవిధంగా ఆలోచిస్తే మనం ఏ పనీ చేయ్యలేము నాయనా? మహానుభావుడు బుద్ధుడు కూడా అదే చేశాడు.” అన్నారు ఆఖరికి తన మేధాశక్తినంతా ఉపయోగించి.

నాకు పట్టరాని కోపం వచ్చింది ఈసారి.

‘‘మీకు నేను చెప్పాలా స్వామిజీ, బుద్ధుడు పుత్రశోకంతో ఇల్లు వదిలి వెళ్ళలేదని, తోటి ప్రజల కష్టాలని నివృత్తించడానికని, స్వీయ సమస్యల విముక్తి కోసం కాదని. సిద్ధార్ధుడు అన్నీవున్నా లోక కల్యాణం కోసం గృహంవీడి బుద్ధుడయ్యాడు, మానవకోటికి బౌద్దమతాన్ని ప్రసాదించాడు. తమరు ఒక మఠాన్ని స్థాపించారు సరే, కాని కొత్త ధర్మాన్ని ప్రతిస్థాపించేరనుకోను. ఏ విధంగా చూసినా వారికి మీకు చాలా వ్యత్యాసాలు కనబడుతున్నాయి స్వామీజీ,’’ అన్నాను.

‘‘నాయనా నువ్వు చాలా ఘటికుడివి. అమ్మాయి సరళకంటె ఒక ఆకు ఎక్కువ చదివావు. తర్కంలో నేను నీకు సరితూగ నేమో. అయినా నేను చేసిన పనే వుత్తమ మైనదని నా నమ్మకం. ఒక వ్యక్తిని నేను కష్టపెట్టి వుండవచ్చు. కానీ అనేకమందిని చీకటిలోంచి వెలుగులోకి దారి చూపించాను. నేనలా చేయకపోతే సుందరి వంటి వారు ఏమవుతారో ఆలోచించావా?’’ అన్నారు గురువుగారు లేని నవ్వు తెచ్చుకుని గెడ్డం రాసుకుంటూ.

‘‘అందరికీ దారి చూపించేవాడే యశోకూ చూపిస్తాడు. అందువలన ఆమె బాధ్యత మీకు వలదు గురూజీ. అయినా తమరు తిరిగీ మీ భార్యను కలుసుకున్నారా?’’ అన్నాను.

‘‘తర్వాత చాలా కాలానికి ఆమే ఇక్కడికి వచ్చింది. తనతో తిరిగి రమ్మనమని బతిమాలింది. లేకపోతే ఆమె నాతో ఇక్కడ వుండిపోవడానికి అంగీకరించమంది. నేను దేనికీ అంగీకరించలేకపోయాను,” అన్నారు గురువుగారు.

‘‘ఎందుచేత స్వామీజీ,’’ అన్నాను.

‘‘భార్య నా దగ్గరవుంటే, నన్ను నేను సంభాళించుకోలేనేమోనని, ఆమె కన్నీళ్లకి కరిగిపోతానేమోనని భయం వేసింది,”అన్నారు ఆయన .

ఈ గురువుగారి వైరాగ్యం ఇంత గొప్పదని నేను ఊహించలేదు. భార్య దగ్గరవుంటే తనను తాను నిగ్రహించుకోలేని ఈ సన్యాసి దగ్గర యశో, లఖియా వంటి యువతులు వుండటం శ్రేయస్కరమేనా అసలు?

‘‘గురువులకి, యోగులకీ ఇంద్రియ నిగ్రహం వుంటుందనుకున్నాను స్వామీజీ,’’ అన్నాను.

ఇంతసేపూ యశోకి నా మాటలేమీ నచ్చలేదని తెలుస్తూనే వుంది.

‘‘తమరి పూజా సమయం మించిపోతుంది స్వామీజీ,” ఇక యీ సంభాషణను పొడిగించటం ఇష్టం లేక అంది.

‘‘అవును సుందరీ, ఈనాటి కిక చాలు నాయనా, ఇంకా ఇక్కడ ఎన్నాళ్లు వుంటావు,’’ అన్నారు గురువుగారు లేచి నించుని.

‘‘ఇంకా దాని అవగాహన కలగ లేదు స్వామీజీ,’’ అన్నాను.

“సరే మంచింది. తర్వాత కలుసుకుందాం,’’ అని ఆయన యశోకేసి చూస్తూ, లోపలికి దారి తీశారు.

యశోకూడా ఆయనవెంట వెళ్లిపోయింది. నాతో ఒక్కమాటైనా మాట్లాడలేదు.

గురువుగారితో నా సంభాషణ ఆమెకు కోపం తెప్పించిందని తెలుస్తూనే వుంది. గురువుగారి మీద ఆమెకు అపార గౌరవమూ, అకుంఠిత విశ్వాసమూ వున్నాయి. నేనెందు చేత అలా పరిగణించలేక పోయాను? అప్పుడు యశో కంటె సరళ అభిప్రాయాలకీ, నా అభిప్రాయాలకీ దగ్గర సంబంధం కనబడింది. దీనివల్ల ఆమెకు క్షోభ కలుగుతుందని నేను గ్రహించాను. అసలు ఈ గురువుగారిని తిరిగి కలుసుకోవటమే నా తప్పిదం. ఇక మళ్లీ ఆయన వద్దకు వెళ్లకూడదని నిశ్చయించాను.

షేర్ చేయబడినవి

NEW REALESED