shyamala.. dare to shame books and stories free download online pdf in Telugu

శ్యామల..సిగ్గు పడే సాహసం ఉందా - శ్యామల..సిగ్గు పడేందుకు సాహసం

అది ఒక మధ్య తరగతి కుటుంబం. సాయి లత ,మనోహర్ ఇద్దరూ భార్యా భర్తలు ... వీరికి ఒక కొడుకూ కూతురు,కొడుకు పేరు మిధున్ ఆరుద్ర , కూతురి పేరు లోక పావని. ఆమె చదువులో సరస్వతి,రూపం లో లక్ష్మి , సుగుణాలలో గంగి గోవు . ఇక ఆమె సోదరుడు మిధున్ ఆరుద్ర అభ్యుదయ భావాలు కలవాడు .... వీళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి పని చేయడానికి వస్తుంది. చదువు అంతంత మాత్రమే, కానీ అందం లో లోక పావనికి ఏమాత్రం తీసిపోదు. పేరు శ్యామల 
తన చలాకీతనంతో కలుపుగోలుతనంతోఅందరి విశ్వాసాన్నీ అభిమానాన్నీ గెలుచుకుంది... మిధున్ ఆరుద్ర ఆమె స్వభావానికి ఆకర్షితుడవుతాడు. ప్రేమ లోపడతాడు 
కానీ తల్లిదండ్రులకు చెప్పడానికి సంకోచిస్తుంటాడు. సరైన సమయం కోసం ఎదురు చూస్తుంటాడు. మనసులోనే మౌనంగా ఆరాధిస్తుంటాడు.
ఇంతలో అనుకోని ఘోరం జరిగిపోతుంది... కూరగాయలు కొనటానికి బజారుకు వెళ్లిన శ్యామలను ఐదుగురు దొంగలు ఎత్తుకువెళ్లి మానభంగం చేసి పాశవికంగా హత్య చేస్తారు. 
పోలీసులు సుమోటోగా కేసును ఫైల్ చేస్తారు ఈ ఐదుగురు దుండగులూ సమాజం లో పలుకుబడున్నవారి పిల్లలు వారు తమ పరపతిని ఉపయోగించి పోస్టుమార్టం చేయకుండానే శవాన్ని పూడ్పించేస్తారు. పైగా శ్యామల అమ్మాయే కాదని తనుకూడా ఒక అబ్బాయి అని పైగా వీళ్ళ స్నేహితుడని ఒక నాటకం కోసం ఆడ వేషం వేసాడని ... ఆ నాటకం రిహార్సల్స్ లో జరిగిన ఒక ప్రమాదం లో మరణించాడనీ అసలు మానభంగం లాంటిది జరగలేదని ఇదంతా గిట్టని వారి కుట్ర అని వాళ్ళ తరఫు న్యాయవాది కోర్టు లో వాదిస్తాడు.
నిజం తెలిసినా అన్యాయం అని అనిపించినా మధ్యతరగతి వారికి ఉండే సహజమైన భయం కారణంగా లోకపావని వాళ్ళ అమ్మ,నాన్న ఈ విషయం లో జోక్యం చేసుకోకూడదని నిర్ణయించునుకుంటారు. లోకపావని పోరాటం చేయాలని ప్రయత్నిస్తే ఛస్తామని బెదిరించి ఆపేస్తారు. కానీ శ్యామలను ప్రాణంగా ప్రేమించిన మిధున్ ఆరుద్ర మాత్రం ఈ అన్యాయాన్ని తట్టుకోలేక పోతాడు.
తన స్నేహితుడు నవీన్ సహాయం తో కోర్టును ఆశ్రయిస్తాడు. నవీన్ నిందితుల తరఫు న్యాయవాది చేస్తున్నవన్నీ పూర్తిగా అవాస్తవాలని బలంగా వాదిస్తాడు కేసు తీవ్రతను గమనించిన న్యాయస్థానం.
శ్యామల శవానికి రీ పోస్టుమార్టం చేయాలని ఆదేశిస్తుంది.. నిందితుల తరఫు న్యాయవాది ఇది కోర్టు వారి సమయాన్ని వృధా చేయడమే అని ఎంతగా వాదించినా కోర్టు ఆ వాదనలను పరిగణన లోకి తీసుకోదు 
నిందితుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డంత పనవుతుంది. లోపల బిక్కు బిక్కుమంటున్నా పైకి మాత్రం మేక పోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంటారు.
ఇంతలో రీపోస్టుమార్టం రిపోర్టు రానే వచ్చింది.. ఆశ్చర్యం... అనూహ్యం నిందితులను రక్షించేందుకు వారి తరఫు న్యాయవాది ఆడిన పచ్చి అబద్ధం నిజంగా నిజం .. 
నిప్పు లాంటి నిజం.. శ్యామల నిజంగా అమ్మాయి కాదు.... పదహారణాల' అ.... బ్బా... యి' 
ఈ సంచలన విషయం నగరం లో చర్చనీయాంశం అవుతుంది. నమ్మలేని నిజాన్ని జీర్ణించుకోలేని మిధున్ ఆరుద్ర కోర్టు హాలు లోనే కుప్ప కూలి పోతాడు అతడిని హుటాహుటిన హాస్పిటలుకి తరలిస్తారు .. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా 
అతని శరీరం వైద్యానికి సహకరించదు. చివరికి అతను మరణిస్తాడు.. మరో వైపు ఈ అనూహ్య సంఘటనకు వ్యతిరేకంగా నగరం లో చెలరేగిన ఆందోళనలు రెండు తెలుగు రాష్ట్రాలకూ విస్తరిస్తాయి... వీరి ఉద్యమానికి ప్రాంతాలకు అతీతంగా ప్రతి పక్షాలూ ప్రజాసంఘాలూ సైతం గొంతు కలుపుతాయి .. రాష్ట్రం క్రమక్రమంగా అగ్ని గుండంగా మారుతుండడాన్ని గమనించిన ఇరు రాష్ట్ర ప్రభుత్వాలూ.. పరిస్థితి చేయి దాటకుండా చర్యలు తీసుకుంటాయి.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని పాఠశాలలకు,కళాశాలలకు... నిరవధిక నిర్బంధ సెలవులను ప్రకటిస్తాయి.. హాస్టళ్లను ఖాళీ చేయాలని ఆదేశిస్తాయి.. తమ తమ రాష్ట్రాల్లో 144 సెక్షన్ను విధిస్తాయి
అలాగే మరో వైపు ఈ సంఘటనను అత్యంత అరుదైనదిగా భావించిన ఇరు రాష్ట్రాల ఉమ్మడి ఉన్నత న్యాయ స్థానం ముగ్గురు విశ్రాంత న్యాయ మూర్తులతో ఒక విచారణ సంఘాన్ని నియమిస్తుంది... 15 రోజల్లోగా విచారించి నివేదిక అందించమని ఆదేశిస్తుంది... వారి విచారణ లో వెలుగు చూసిన వాస్తవాలు ఇవి.. 
కోటీశ్వరుడు ధనుంజయరావుకు పిల్లలు లేరు.. ఇంత కోట్ల ఆస్తి అనుభవించడానికి పిల్లలు లేరుకదా అని బాధ పడుతూ ఉంటాడు.. అనుకోకుండా అతనొక రోజు ప్రమాదానికి లోనవుతాడు ఆ ప్రమాదం నుండి అతడిని అతడి నౌకరు గోవర్ధనం రక్షిస్తాడు. కానీ అతడు ప్రమాదానికి గురవుతాడు. చావుకు దగ్గరలో ఉన్న గోవర్ధనానికి ధనుంజయరావు మాట ఇస్తాడు "నీ మీదనే ఆధారపడ్డ నీ మనుమడు కాశయ్యను నా కన్న కొడుకులా పెంచుకుంటాను" అని. ఆ మాట విని గోవర్ధనం ప్రశాంతంగా తనువు చాలిస్తాడు... అప్పటికి కాశయ్యకు ఏడేళ్లు ... కాశయ్య తల్లి తండ్రులు చిన్నప్పుడే చనిపోయారు.. కాబట్టి ఈ విషయాలన్నీ కాశయ్యకు తెలుసు.. ధనుంజయ రావు గోవర్ధనానికి ఇచ్చిన మాట ప్రకారం కాశయ్యను దత్తత తీసుకుంటాడు... అలాగే కాశయ్య అనే పేరు నచ్చక శ్యామేషుగా పేరు మారుస్తాడు.. ఎంతో గారాబంగా పెంచుతాడు.. శ్యామేషుకు 27 ఏళ్ళు రాగానే తన వ్యాపార బాధ్యతలన్నీ అప్పచెపుతాడు. ఈ పనుల్లో శ్యామేషుకు తోడుగా ఉండటం కోసం ఒక పర్సనల్ సెక్రెటరీని నియమిస్తాడు... 
ఆమె పేరు లోక పావని
శ్యామేష్ ఆమెని ప్రేమిస్తాడు.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు.. ఈ విషయం ధనుంజయ రావుకి తెలిసి అగ్గిమీద గుగ్గిలమవుతాడు .. 
తమ స్థోమతకు ఏ మాత్రం సరిపోని లోకపావనిని పెళ్లి చేసుకుంటే తనను చంపుకుతిన్నట్టే అని బెదిరిస్తాడు.. ఆమెను మర్చిపోతానని బలవంతంగా ఒట్టు వేయించుకుంటాడు... ప్రాణ సమానంగా ప్రేమించిన ఆ అమ్మాయిని మరిచి పోలేక ప్రాణప్రదంగా పెంచిన ధనుంజయరావుకు ఇచ్చిన మాట తప్పలేక శ్యామేష్ నరక యాతనను అనుభవిస్తాడు... 
ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానని తన గురించి వెతక వద్దని ఉత్తరం వ్రాసి పెడతాడు. తాను శస్త్ర చికిత్స చేయించుకుని అమ్మాయిగామారి.. శ్యామలగాపేరు మార్చుకుంటాడు. లోక పావని ఇంట్లో పనిమనిషిగా చేరింది ఈ శ్యామలే.. ఆ రకంగానైనా లోకపావనిని కళ్లారా చూసుకోవచ్చని అతడి.. కాదు.. కాదు.. ఆమె ఆశ. 
ఈ తరుణం లోనే ఈ దుర్ఘటన జరిగింది. 
న్యాయస్థానం నియమించిన త్రిసభ్య సంఘం ఈ నివేదిక న్యాయస్థానానికి అందచేసింది... నివేదికను చదివిన న్యాయమూర్తి,నిందితులు ప్రజలూ, నిందితుల తరఫు న్యాయవాది.. మిదున్ ఆరుద్రకు చెందిన లాయర్ అందరూ దిగ్భ్రాఅంతికి గురవుతారు.. లోకపావని పరిస్థితి ఇక చెప్పనక్కర్లదు... ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా వీలుకాదు. విషయం తెలుసుకుని అక్కడకి వచ్చిన ధనుంజయ రావు కన్నీరు మున్నీరవుతాడు.  
తన మూర్ఖత్వం వలెనే ఇంత అనర్ధం జరిగిందని కుమిలి కుమిలి ఏడుస్తాడు.. తన పాపానికి ప్రాయశ్చిత్తముగా తన ఆస్తి తో 'శ్యామేష్ శ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తాడు.. దానికి లోకపావనిని ఛైర్మన్ చేస్తాడు . 
సమాజం లో అన్యాయానికి గురి అయిన స్త్రీలను ఆదుకోవడమే ఈ సంస్థ లక్ష్యం.. ఆ క్షణం లోనే లోక పావని శ్యామేష్ను తన భర్తగా స్వీకరిస్తుంది.. ఇక తన జీవితం సమాజ సేవకే అంకితం అని ప్రకటిస్తుంది. అంతా చూసి ఉద్వేగానికిలోనైన న్యాయ మూర్తి తన తీర్పును ఇలా చదువుతారు... ప్రేమ కోసం శ్యామలగా మారిన శ్యామేష్ సమాజానికి తిలకంలా శోభనిచ్చారు, కామం తో కళ్ళు మూసుకు పోయి పశువులకన్నా హీనంగా ...పాశవికంగా ప్రవర్తించి...మానవ రూపం దాల్చిన ఆ ప్రేమ మూర్తిని కిరాతకంగా హత్య చేసిన వీరు సమాజానికి కళంకంగా నిలిచారు.. నిజానికి వీరికి మరణ దండన శిక్ష కాదు వరం.. ఆ రకంగా వీరు సమాజపు ఆగ్రహం నుండి రక్షించబడతారు.. కానీ, చట్ట పరిధిలో నాకున్న బాధ్యతలను అనుసరించి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం ఈ దోషులను మరణించేవరకూ ఉరితీయమని ఆదేశించడమైనది న్యాయ మూర్తి తీర్పు పూర్తి కాగానే ఐదుగురు నిందితులూ కుప్పకూలి పోతారు...

షేర్ చేయబడినవి

NEW REALESED