Read Godari Gourd!!! by SriNiharika in Telugu సైకాలజీ | మాతృభారతి

Featured Books
  • తొలి అడుగు

    స్వప్న, సంధ్య... ఇద్దరు మంచి స్నేహితులు... ఇరుగు పొరుగు వారవ...

  • కలుసుకుందాం రా...

    "కలుసుకుందాం రా"అంటూ వనజకుమారి నుండి పిలుపు.ఫోన్ పెట్టేయగానే...

  • మృగం - 3

    అధ్యాయం 3 కాలం   చీకటి   భావోద్వేగ   పట్టుకోవడం   కలవరపెడుతో...

  • గోదారి గోరింటాకు!!!

    2041 వ సంవత్సరం....తెల్లవారుజామున 4 గంటల సమయం.శుభోదయాన్ని సూ...

  • మృగం - 2

    అధ్యాయం 2 కాలం   చీకటి   పరిపక్వత   తీవ్రమైన   వాస్తవికమైనది...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

గోదారి గోరింటాకు!!!




2041 వ సంవత్సరం....తెల్లవారుజామున 4 గంటల సమయం.

శుభోదయాన్ని సూచిస్తూ మోగిన ఫోన్ శబ్దం విని ఉలిక్కిపడి లేచాడు కృష్ణ మోహన్.

ఫోన్ రిసీవర్ అందుకున్నాడు బద్ధకంగా.వార్త వింటూనే హతాశుడై మంచం దిగుదామని నేలమీద కాళ్ళు పెట్టేసరికి నేలనంతటినీ తడుపుతూ సన్నని నీటిపొర.

గబగబా భార్య ప్రియంవదను,తల్లిని,పిల్లలిద్దరినీ లేపాడు.


"ప్రియా!ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అపుడే గంట నుంచి ట్రై చేస్తున్నారట.గోదారి ఊళ్ళో ప్రవేశించిందట. నిన్న రాత్రి వరకు ఎటువంటి సూచన లేదు.ఎక్కడా వాన కురిసిన దాఖలాలు లేవు. అటు రాజమండ్రి, ఇటు కొవ్వూరు గట్లు దాటి ఊళ్ళోకి ప్రవహిస్తోందట. నేను వెళ్తాను.వీలైతే అటెండర్ ని పంపిస్తాను .లేకుంటే ఇంటికి తాళం వేసి పక్కింటివారి సాయంతో ఎత్తైన ప్రదేశానికి చేరుకోండి. ఊ... క్విక్.."

అతని మాట పూర్తి కాకుండానే వాకిట్లో జీప్ హారన్ వినిపించింది."వస్తాను ప్రియా.మీరంతా జాగ్రత్త."అతను కదలబోయాడు.

"డాడీ..." అంటూ పిల్లలు అతన్ని కరుచుకుపోయారు.

"మరేం భయం లేదమ్మా...ఇదేమీ వరదప్రభావం కాదు.మీరేం భయపడవద్దు.ఏం జరగదు.మీరు ధైర్యంగా ఉండి అమ్మకి, బామ్మకి సాయంగా ఉండండి.నేను వెళ్లిన వెంటనే ఫోన్ చేస్తాను.అటెండెర్ని పంపిస్తాను. సరేనా!"

ఆగలేనట్టు విసుగ్గా జీప్ హారన్ మళ్ళీ మోగడంతో ఒక్క ఉదుటున వెళ్లి జీపులో కూలబడ్డాడు కృష్ణ మోహన్.

ఎంత ధైర్యం చిక్కబట్టుకున్నా వారు నలుగురు ఒకరినొకరు కరుచుకుపోయి బేలగా, వెళ్తున్న జీప్ వైపే చూస్తూండిపోయారు.

ఆ గదిలో గోదారి గలగలా కిలకిలా నవ్వుతోంది పలుచగా! ********* 


కృష్ణ మోహన్ ఆఫీస్ కు చేరుకున్న వెంటనే మొత్తం రాష్ట్ర సమాచార వ్యవస్థ ను అరగంటలో అప్రమత్తం చేశాడు. తనపై అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి,నీటి పారుదల శాఖ అధికారులకు, రాష్ట్ర మంత్రులకు, అందరికీ సమాచారం క్షణాల్లో అందించి అత్యవసర సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు పోలీసు శాఖ సిబ్బందికి, స్థానిక సంస్థలకు, కలెక్టర్ తరపున ఆయన అనుమతి తో సమాచారం అందించి రంగం సిద్ధం చేసాడు.

ఇంతా చేస్తూనే అతను అనుక్షణం ప్రాజెక్టు లో వాటర్ లెవెల్ గమనిస్తూనే ఉన్నాడు.

అరగంట తరువాత ముఖ్యమంత్రి లైన్ లోకి వచ్చాడు. ఆందోళన గా పరిస్థితి ని గురించి కృష్ణమోహన్ తో సమీక్షించాడు.

"గుడ్ మార్నింగ్ సర్.రాత్రి ఇక్కడ వాతావరణం అంతా పొడిగా ఉంది.శీతాకాలం వెళ్లి వేసవికాలం ప్రవేశిస్తున్న ఈ రోజుల్లో వేసవి గడవడానికి అవసరమైన నీటిని మాత్రమే ఉంచి అదనపు నీటిని వదిలేసామ్. అయితే నీరు లోతట్టు ప్రాంతాల్లో కూడా కేవలం ఒక అడుగుమేర మాత్రమే ప్రవేశించింది. ఆపై నీటి పెరుగుదల ప్రస్తుతం ఆగిపోయింది. ముఖ్యంగా రాజమండ్రి - కొవ్వూరు ల మధ్య పాట రైలు వంతెన -కొత్త రైలు కం రోడ్ వంతెన ల మధ్య ప్రాంతాలలోని ఊర్లలోకి నీరు ప్రవేశించింది.ప్రస్తుత పరిస్తుతులలో నీటిమట్టం పెరగక నిలకడగా ఉంది.ఇక్కడ అన్ని శాఖల అధికారులు అప్రమత్తం అయ్యారు.పరిస్థితి ఎప్పటికప్పుడు మీకు తెలియ చేస్తాను. ఉంటాను సర్.నమస్తే."

"వన్ మినిట్ మిస్టర్.రెండు మూడు గేట్లు ఎత్తేస్తే?" ముఖ్యమంత్రి ప్రశ్నించాడు.

"నో సర్.ఒక్క గేటు ఎత్తివేసినా కొన్ని వేల క్యూసెక్కుల నీరు దిగువకు పోతుంది.ఆ నీరు వృథా అయితే వేసవి లో నీటి ఎద్దడి ఏర్పడి ప్రజల నుంచి వ్యతిరేకత రావచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యమైనంత వరకు నీటి ని వదలకుండా,ప్రజలకు ప్రాణహాని కలుగకుండా ఇక్కడ అందరితోనూ చర్చించి అవసరమైన చర్యలు చేపట్టి మీకు తెలియచేస్తాను సర్.ఉంటాను సర్.నమస్తే."కృష్ణమోహన్ ఫోన్ పెట్టేసి నుదుట పట్టిన చెమట ను తుడుచుకున్నాడు.

అటెండర్ మంగయ్య లోపల కి వచ్చాడు."మంగయ్యా!ఏమిటి కొత్త సమాచారం?""భూగర్భ పరిశోధన విభాగం వారు,మనస్టాఫ్ పోలీసు శాఖ వారు అందరూ మీటింగ్ హాల్లో రెడీ గా ఉన్నారు సర్. మీరు రావడమే తరువాయి."

"చూడు.వాచ్ మాన్ వెంకటేశం ను మా ఇంటికి వెళ్లి అమ్మగారికి సహాయం గా ఉండమను. నువ్ నాతో రా."అతన్ని తన ఎదురుగా ఉన్న ఫైల్స్ తీసుకోమని సైగ చేసి కృష్ణమోహన్ ముందుకు నడిచాడు.మంగయ్య అనుసరించాడు.


*****

కృష్ణమోహన్ ధవళేశ్వరం ప్రాజెక్టు లో ప్రాజెక్టు అధికారి గా పని చేస్తున్నాడు.అతను అక్కడికు ట్రాన్స్ఫర్ అయి వచ్చిన ఈ పది సంవత్సరాల్లో గోదావరి పుష్కరాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలుగని అసాధారణ రీతి లో నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ ప్రశంసలు అందుకున్న వాడు.సమయస్ఫూర్తి, చాకచక్యం,ఆలోచన చేస్తూనే తన సిబ్బంది ని నడిపించే చక్కటి అధికారి గా పేరు తెచ్చుకున్నాడు.


2036 వ సంవత్సరం లో కనీవినీ ఎరుగని వరద వచ్చి ఆ ప్రకృతి వైపరీత్యం లో సుమారు పదివేల మంది ప్రాణాలు కోల్పోయి, ఏభై వేలమంది నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో అతను చూపిన కార్యనిర్వహణా దక్షత యువత ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తి దాయకమైంది.

సత్యసాయి సంస్థలు మొదలుకొని ఎన్నో యువజన సేవాసంస్థలు తమ ఆర్ధిక సహాయాన్ని ప్రకటించడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందముగా పాల్గొని తమ సేవలందించాయి.నేత్ర పరీక్షలు, పూర్తి ఆరోగ్య పరీక్షలు, నిరాశ్రయులకు తాత్కాలిక వసతి,ఆహార పొట్లాలు,బియ్యం,దుప్పట్లు, మందులు,పాత బట్టలు...అన్నీ ఎంతో శ్రమకోర్చి ప్రతీ ఒక్కరికీ అందేలా పనిచేయ గలిగాయంటే వాటి కార్యదీక్షకు స్ఫూర్తి కృష్ణమోహనే.

అతని కీర్తి ప్రతిష్టలు భరించలేని ఓ మాజీ రాజకీయ నాయకుడు ఉన్నవి లేనివి చెప్పి తన నియోజకవర్గ ప్రజలను రెచ్చగొట్టి అతణ్ణి తక్షణమే అక్కడనుంచి ట్రాన్స్ఫర్ చేయమని కలెక్టర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు సమర్పిస్తే,నగర ప్రజలే కాదు.చుట్టుపక్కల గ్రామాల్లో జనాలు కూడా ఏక తాటిమీద నిలిచి ఆ రాజకీయ నాయకుడి చేత ప్రజాసమక్షంలో కలెక్టరేట్ ఎదుట బహిరంగ క్షమాపణ చెప్పించడం లో కృతకృత్యులయ్యారంటే కృష్ణమోహన్ ఎంతగా ప్రజాభిమానాన్ని చూరగొన్నదీ అర్ధం చేసుకోవచ్చు.

తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఆ రాజకీయ నాయకుడి గూండా నేర చరిత్ర అంతా కూకటి వేళ్ళతో పేకళించి అతన్ని రాజకీయ సన్యాసం చేయించేంత వరకూ పత్రిక లు తమ పత్రికా స్వాతి స్వేచ్ఛ గా వినియోగించుకున్నాయి. ఆ తర్వాత అతను పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు గ్రహించి సద్దుమణిగాయి.

అంతగా ప్రజామద్దతు కూడగట్టుకున్న అధికారి కృష్ణమోహన్. అందుకే అతని ప్రత్యక్షంలో లేచి నిలబడి గౌరవిస్తారు.పరోక్షంలో హృదయ పూర్వకంగా నమస్కరిస్తారు.

కృష్ణమోహన్ మీటింగ్ హాల్లో కి అడుగు పెట్టేసరికి అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు.

"థాంక్యూ అండ్ వెల్కమ్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఈ మీటింగ్ కు హాజరైన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తున్నాను.మనం ఎంతో అప్రమత్తంగా వ్యవహరించవలసిన సమయం మళ్ళీ ఆసన్నమైంది. ముందుగా వాటెబౌట్ వాటర్ లెవెల్ మిస్టర్ కృష్ణమూర్తి?",అడిగాడు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కృష్ణమూర్తి ని.

"సరిగ్గా తెల్లవారుజామున 4 గంటలకు ఏ పొజిషన్ లో ఉందొ ఇప్పుడూ అదే పొజిషన్ లో ఉంది సర్.భద్రాచలం, పాపికొండలు,పోలవరం లలో అంతటా వాతావరణం పొడిగా ఉంది సర్.పోలవరం ప్రాజెక్టు లో కూడా వాటర్ లెవెల్ సరిగ్గా ఉండవలసినంత ఉంది సర్. బొంబాయి వాతావరణ పరిశోధన కేంద్రం దగ్గరనుంచి కూడా సమాచారం వచ్చింది సర్.ఎక్కడా వర్షాలు పడిన దాఖలాలు లేవు సర్.శాటిలైట్ సమాచారాన్ని విశ్లేషించి రేపు సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉంటుందని సందేశం పంపారు సర్."

"ఒకే. థాంక్యూ ఫర్ యువర్ ఆటెన్షన్ మిస్టర్ కృష్ణమూర్తి. కీపిటప్."అని భూగర్భ పరిశోధకులకేసి తిరిగి అడిగాడు కృష్ణమోహన్."మిస్టర్ దీపక్ భాటియా.భూమి లోపల ఏమైనా మార్పులు జరుగుతున్నాయంటారా?ఐ మీన్ భూకంపం వచ్చే అవకాశం గానీ...మరేదైనా...?"

"నో సర్.సిస్మోగ్రాఫిక్ సెంటర్ వారి సమాచారం మేరకు అటువంటి అవకాశం ఏదీ లేదు సర్.అంతా సవ్యంగా ఉంది."కృష్ణమోహన్ నవ్వాడు.

"ఒకే. థాంక్యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మరి ఈ అనుకోని అవంతరానికి కారణం? ఒకసారి మళ్ళీ ఆలోచించండి."చేతిలో పెన్నును నుదుటికి తాకిస్తూ సాలోచనగా ఉన్న కృష్ణమోహన్ ముందు అటెండర్ మంగయ్య గాజుగ్లాసులో సగము వాటర్ పోసి దానిలో అందమైన గుండ్రని,పచ్చని నిమ్మకాయ వేసాడు.కాయబరువువల్ల నీరు సరిగ్గా గ్లాసు అంచుల వరకు వచ్చి ఆగిపోయింది. దానిపై ప్లాస్టిక్ వాచ్ గ్లాస్ మూతవేసి వెళ్ళిపోయాడు.

సరిగ్గా అప్పుడే గుర్తుకు వచ్చింది బామ్మ చెప్పిన కథ.వెంటనే దీపక్ భాటియా తో అన్నాడు.

"మిస్టర్ దీపక్.మీరు వెంటనే హెలికాప్టర్ లో వెళ్లి గోదావరి బ్రిడ్జి ల రెండింటి మధ్య గల నీటికింద ఉండే ఇసుకను తీసుకురండి. మీకు అవసరమైనవారిని తీసుకెళ్లండి.క్విక్. ముఖ్యంగా బ్రిడ్జి కి ఆపక్కన గాని, ఈ పక్కనగానీ సమీపంలో గల ఇసుక అయితే మరీ మంచిది.జాగ్రత్త.రోప్స్, బాక్స్,బాగ్స్ ...అవసరమైనవన్నీ పట్టుకువెళ్లండి. క్విక్."

అన్నదే తడవుగా దీపక్ భాటియా తనకు అవసరమైన సిబ్బంది తో నిష్క్రమించాడు.

దాదాపు అరగంట తర్వాత...

అతని కి ఎదురుగా బ్యాగ్ లో తడిసిన ఇసుకను ఉంచారు. దానిని ఆదుర్దా గా పరిశీలించిన కృష్ణమోహన్ దీపక్ భాటియానుఅడిగాడు."దీపక్.వెంటనే ఈశాంపిల్ ని టెస్టింగ్ కి పంపించి రిపోర్ట్ తెప్పించండి.క్విక్.గంటలో రిపోర్ట్ నా టేబుల్ మీద ఉండాలి.""ఓకే సర్."దీపక్ ఉత్సాహంగా వెళ్లి గంట పూర్తి కాకముందే తిరిగి వచ్చాడు రిపోర్ట్ తో సహా.

నేచురల్ గాస్ - నిల్

క్రూడాయిల్ - నిల్

మిగతా వివరాలు చదివాడు గాని అవి అంతగా ప్రాధాన్యం లేనివి.

"మిస్టర్ దీపక్.ఆర్ యూ షూర్ అబౌట్ దిస్ రిపోర్ట్?"

"యస్సార్. అన్నట్లు ఇందాక తీసుకెళ్ళిన శాంపిల్ లో మూడోవంతు ఇవే ఉన్నాయి సర్." అంటూ మంగయ్య కు సైగ చేసాడు దీపక్.

మంగయ్య బాగా బరువున్న ఓ సంచీ మూట విప్పి కృష్ణమోహన్ ముందు టేబుల్ పై కుమ్మరించాడు.

అవన్నీ చిల్లర నాణాలు. చాలా పాతవి, రాగి,అల్యూమినియం,మిశ్రమ లోహాలు నాణాలు. ఐదు పైసలనుండి పదిరూపాయల నాణెం వరకూ ఎన్నో రకాలున్నాయి.దీర్ఘంగా లోపలికి శ్వాస పీల్చి తిరిగి విడుస్తూ తల వెనుక రెండు చేతులు పెట్టుకుని అన్నాడు కృష్ణమోహన్.


"అర్ధమైంది భాటియా.మిస్టర్ కృష్ణమూర్తి.. డియర్ ఫ్రెండ్స్...ఈ సమస్యకు పరిష్కారం దొరికింది.మీరు అత్యవసరం గా చేయాల్సిన పనేమిటంటే...మన నగరం లో సుమారు 20 వాటర్ రిజర్వాయర్లు ఉన్నాయి.వెంటనే అన్నింటినీ వాటర్ తో రీఫిల్ చేయమనండి. గోదావరి మట్టం ఇక పెరగదు. ప్రజలందరికీ వాటర్ ఫ్యూరిఫైయింగ్ యాపరేటస్ కుటుంబానికి ఒకటి చొప్పున పంచిపెట్టమనండి. నీరు కాచుకుని తాగమనండి. గోదావరి పై ఉన్న రెండు బ్రిడ్జి లకు అటూ ఇటూ పూడిక తీయించే ఏర్పాట్లు చేయండి.మీకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుని నన్ను కాంటాక్ట్ చేయండి." అంటూ కృష్ణమూర్తి కి ఆజ్ఞలు జారీ చేశాడు కృష్ణమోహన్.


కృష్ణమూర్తి "థాంక్యూ సర్.చాలా తేలికగా సమస్యకు పరిష్కారం కనుక్కున్నారు."అంటూనే షేక్ హాండ్ ఇచ్చి కదలబోయాడు.

"మిస్టర్ కృష్ణమూర్తి. గోదారిలో దొరికిన ప్రతీ నాణెమూ ప్రభుత్వ ఖజానాకు జమకావాలి.టేక్ కేర్ అబౌట్ ఇట్."

కృష్ణమోహన్ వైపు మెచ్చుకోలుగా చూసి "తప్పకుండా సర్.ఆ బాధ్యత నాది.థాంక్యూ సర్." అనేసి కృష్ణమూర్తి వెళ్ళిపోయాడు.

"మాకేమీ అర్థం కాలేదు సర్."అన్నాడు సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్.

"దీన్లో అర్ధం కానిదేముంది సర్?ఇటు చూడండి..." అంటూ గాజుగ్లాసు మూత తీసి అందులోంచి నిమ్మకాయ జాగ్రత్తగా పైకి తీసాడు కృష్ణమోహన్.

"ఇపుడు గ్లాసు లో నీరు ఎలా ఉంది"

"సగానికి"నిమ్మకాయ అందులో వేసాడు కృష్ణమోహన్.

"ఇప్పుడు?"

"అంచులదాకా వచ్చింది సర్."

"ఇందులో మరో గోళీ కాయ వేస్తే?"

"నీరు పొర్లిపోతుంది సర్."

"ఇప్పుడు జరిగిందదే."

"అబ్బే. అర్ధం కాలేదు సర్."

"మీకు 'కాకి - కడవలో నీళ్లు 'కధ తెలుసా సర్?"

"తెలీదు సర్"

"పోనీ పంచతంత్ర కధలు తెలుసా?"

"పేర్లు విన్నాం గానీ చదవలేదు సర్."

"వేమన,సుమతీ,దాశరధీ... శతకాల పేర్లయినా తెలుసా?"

"లేదు సర్. ఎల్.కె.జీ.లో ఏ ముహూర్తాన చేరామో, చదువు పూర్తి అయేవరకు గుండెతో పాటు సమానంగా శ్రమించి ఈ ఉద్యోగం సంపాదించి స్థిరపడ్డాం గానీ...మాకు బాల్యమే జ్ఞాపకం లేదు సర్.భవిష్యత్ ఉనికి కోసం బాల్యాన్ని పారేసుకున్నవాళ్ళము మేము.మీరు చెప్పిన శతకాలు గానీ,కధలు గానీ మేమెప్పుడూ చదవలేదు సర్. ఎవరైనా పెద్దలు తమ ప్రసంగాల్లో చెబుతుంటే విన్నాం అంతే. పోటీ పరీక్షలు,జి.కె.టెస్టులు,రాంకులు సాధించడం, ఉద్యోగం కోసం పోరాటం ....వీటితోనే జీవితం యజ్ఞం లా మారి బతుకుల్ని సమిధలుగా చేసి బతుకు తున్నవాళ్ళం.నాకే కాదు.ఈనాటి యువతకు మీరన్నవేవీ తెలీనే తెలీదు.చెప్పండి సర్.ఈవేళ అయినా ఆ కధ చెప్పండి సర్"అన్నాడు రణధీర్, సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్.


"ఒక కాకికి దాహమై నీటికోసం వెతుకుతోందట.దానికి ఎక్కడో నీళ్లు అడుగున ఉన్న ఓ కుండా కనిపించిందట. అపుడు కాకి ఆలోచించి అక్కడక్కడా గులకరాళ్లు తెచ్చి ఆ కుండలో వేసిందట.అపుడు నీరు పైకి వచ్చిందట. అది తాగి దాహం తీర్చుకుందట.మా బామ్మ ఈ కథ చెప్పింది.నా చిన్నప్పుడు పంచతంత్ర కథలన్నీ నేను చదివాను కూడా.

ఇక అసలు సంగతి.రోజూ వైజాగ్ నుంచి విజయవాడ వరకు కొన్ని వేలమంది రైళ్లల్లో ప్రయాణిస్తున్నారు.రైలు గోదావరి బ్రిడ్జిపై వెళ్తున్నప్పుడు తమకు తోచిన చిల్లర నాణాలు నీళ్ళల్లోకి విసిరి గోదావరి తల్లికి నమస్కరించుకుంటారు. ఇది ఈనాటిది కాదు గత 100 సంవత్సరాలకు పైగా జరుగుతూనే ఉంది.దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదా.గోదావరి నిండా ఈ చిల్లర నాణాలు ఎక్కువై కాకి కధలో లాగా సరిగ్గా నిన్న రాత్రికి, గ్లాస్ నిండి బయటకు వచ్చిన నీటిలా,గోదావరి నీరు కూడా పొంగి పొర్లి గట్లు దాటి ఊళ్ళల్లో ప్రవేశించింది.అంతే తప్ప ఇందులో మరేమీ ప్రమాదం లేదు."అన్నాడు పకపకా నవ్వేస్తూ కృష్ణమోహన్.


*******


పరిహారం :


"రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నాణాలను జమచేసి మార్గాంతరం కనుక్కున్నందుకే కాదు,చిల్లర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమాజాన్ని ఆ సంక్షోభం నుంచి రక్షించినందుకు, ఎప్పటికప్పుడు మీడియా ద్వారా తనదైన శైలిలో ధైర్యవచనాలను ప్రజలకు తెలియచేస్తూ వారిని చైతన్యవంతులను చేయడంలో కృతకృత్యుడైన శ్రీ కృష్ణమోహన్ గారికి రాష్ట్రప్రభుత్వం "నిత్యకృషీవలుడు"అన్న బిరుదుతో సత్కరించింది.

అంతేకాదు.ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాధమిక విద్యా స్థాయిలో పంచతంత్ర కధలు,వేమన, సుమతీ,దాసరధీ శతకాలు నిర్బంధ పఠనాంశాలుగా సిలబస్ లో చేర్చుతున్నట్లు ప్రకటించింది.


తమ మూఢభక్తితో తనను పక్కదారి పట్టించబోయిన లక్షలాదిమంది భక్తుల అమాయకత్వానికి గోదావరి నవ్వుతూనే ప్రవహిస్తోంది.ప్రవహిస్తూనే నవ్వుతొంది.


సాయంత్రం 6 గంటలైంది. బయట నుంచి వచ్చాకాస్నానం చేసి భోజనం చేసి, భార్య ఇచ్చిన కమ్మని చిక్కని మజ్జిగ తాగి పడక కుర్చీలో నడుము వాల్చాడు చంద్రశేఖర్.

దబ్బ ఆకులు, శొంఠి పొడుం, కరివేపాకు, పచ్చిమిర్చి వేసిన ఆ కమ్మని మజ్జిగ రుచి అతనికి జిహ్వానందాన్నే కాదు , అద్భుతమైన  అనుభూతిని, అందమైన మొదటి రాత్రి అనుభవాన్ని మళ్లీ మళ్లీ వినాలనిపించే లత కంఠస్వరంలా, మళ్లీ మళ్లీ చూడాలనిపించే బాపు బొమ్మలా, మండు వేసవి తర్వాత కురిసే తొలకరిజల్లులా, ఎన్నటికీ మరువలేని జ్ఞాపకాల పుష్పగుచ్ఛంలా అపరిమితమైన ఆనందాన్ని ఈనాటికి మిగుల్చుతూనే ఉంది. ఎందుకంటే యశోద శోభనం గదిలోకి మొదటిరాత్రి పాల గ్లాసు తో రాలేదు.

********

నున్నటి గుండుమీద ధవళ వస్త్రాన్ని నిండుగా కప్పుకొని, చెవుల పక్కనుంచి ఒబ్బిడిగా దానిని పక్కకు తీసుకుని, పండిన నిమ్మపండు దేహాన్ని పూర్తిగా కవర్ చేసుకుంటూ లోపలికి అడుగు పెట్టిన బొమ్మ, చేతిలో గ్లాసు నిండా తెల్లని ద్రవపదార్ధం నురగలతో!

ఆ వెనుకో రెండు చేతులు వెనక్కు పెట్టుకుని పసిపాప నిర్మలమైన బోసినవ్వులా, కన్నెపిల్ల చేయితిరిగి వేసిన అందమైన ముగ్గులా, మూడేళ్లకే ఒళ్ళంతా పరువానికి వచ్చిన కాయల కళ్ళతో ప్రకృతిని వీక్షిస్తున్న హైబ్రిడ్ గున్నమావి చెట్టులా - తొలిసారి ఒక సిద్దాంతాన్ని స్వయంగా తనంతట తాను నిరూపించిన విద్యార్థి సంటుపటిలా లోపలకి అడుగు పెట్టింది 'యశోద'.

బ్రహ్మదేవుడు తన ఆసనంలోని రెండు రేకుల్ని ',యశోద',నయనాలుగా అమర్చాడు. ఆమెలో ప్రత్యేకత అదే!

మయుడు ధర్మరాజు కు నిర్మించి ఇచ్చిన మాయసభ లో

అలంకరణార్ధం తీర్చి దిద్దిన బొమ్మ కాబోలు - ప్రాణం పోసుకుని 'యశోద' యై ఎదుట నిలుచుంది.

"అమ్మాయికి సిగ్గు చాల ఎక్కువ బాబు.నేను పదిసార్లు ఆడిగితేనే పదకొండోసారి సమాధానం చెబుతుంది. ఎలా 'దారి'లోకి తెచ్చుకుంటావో ఏమో.అయినా అన్నీ చెప్పి పంపాననుకో.ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో బాబు.ఇది మీ వంశాభివృద్ధికి ఏర్పాటు చేసిన శుభ'కార్యమే' కాదు. మీరు నిత్యము ఆయురారోగ్యాలతో జీవితాంతం సుఖంగా ఉండాలని ఏర్పాటు చేసిన శుభముహూర్తం కూడా .అందుచేత ఒకరి మనసును ఒకరు అర్ధం చేసుకుని మెలగండి.

భవిష్యత్తు మీద నమ్మకం ఏర్పరచుకోండి. నా మాటల్లో అంతరార్థం మీకు అనుభవం లోకి వచ్చాకా అర్ధం అవుతుంది. ఏదో పాతకాలం దాన్ని.చాదస్తం తో ఈ నాలుగు ముక్కలు చెప్పినందుకు ఏమీ అనుకోకు నాయనా.మీ అత్తగారినే దీనికి తోడుగా పంపిద్దును. దీనికన్నా వీళ్ళమ్మకు మరీ సిగ్గెక్కువ. పెళ్లయిన పదేళ్ళకి దీన్ని కనడానికే గుడ్లు తేలేసింది. అనవసరంగా మీ సమయమంతా పాడుచేస్తున్నాను.వస్తాన్నాయనా. అమ్మాయీ..నేను చెప్పిందంతా గుర్తుందిగా"

లొడలొడా వాగేసిన 'యశోద బామ్మ' గారు , కాలిబొటనవేలితో నేలను సున్నితంగా గీతలు గీసున్న యశోద ను పందిరి మంచంమీద కూర్చున్న చంద్రశేఖర్ కు దగ్గరగా తీసుకువచ్చి నిలబెట్టి, ఆమె బుగ్గలు చిదిమి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ నిష్క్రమించింది.

అలా చిదిమినందుకే దానిమ్మపూవులాంటి యశోద చెక్కిళ్లు మంకెన పూవులయ్యాయి.

"తలుపు వేసి వస్తావా...నేను వేసి రానా?"

యశోద మాట్లాడలేదు.

చంద్రశేఖర్ లేచాడు. యశోద చంద్రశేఖర్ వైపు తిరిగింది. వెనుక ఉన్న చేతులలో ఏముందో తెలియకూడదన్నట్టు.

ఆమె వింత ప్రవర్తన కు విస్తుబోతూ అతను వెళ్లి తలుపు వేసివచ్చాడు.

గది గదంతా పందిరి మల్లెల పరిమళంతో ఘుమ్మెత్తిపోతోంది

సహజంగా పెళ్లికూతురు స్నేహితురాళ్లు శోభనంరాత్రి గదిని అలంకరిస్తారు. కానీ చంద్రశేఖర్ కోరికమేరకు అతని స్నేహితులు 'బుర్రలంక' వెళ్లి రెండు బట్టల పందిరిమల్లెలు మాలలుగా కట్టించి తెచ్చి పందిరిమంచాన్ని గదిని అలంకరించారు స్వయంగా.

"పందిరి మల్లెలంటే నీకెందుకురా అంత ఇష్టం?"అని వారడిగిన ప్రశ్నకు మల్లెలు కురిసినట్టే నవ్వాడతను.

"పందిరి మల్లెకు, కన్నెపిల్లకు నాకెందుకో చాలా సారూప్యం కనిపిస్తుందిరా.మగవాళ్లుగా మనలో శారీరక మార్పులు ఆడపిల్లలతో పోలిస్తే నెమ్మదిగానే జరుగుతాయి. కానీ ఆడపిల్ల అలా కాదురా.

12 ఏళ్ల వయసులో మల్లెతీగకున్న పసిరి మొగ్గలా ఉంటుంది. ఉంటుంది.13 ఏళ్ల వయసులో రూపం పెరిగి, పద్నాలుగేళ్ళ వయసులో లావణ్యం సంతరించుకుని. 15 ఏళ్ల వయసులో యవ్వన పరిమళాలు వెదజల్లుతూ వికసించే ఆమె,  తన జీవితం ధన్యం అయ్యేంతవరకు మగవాడి నరనరాన మధురమైన భావన నింపి ఆ జీవన మాధుర్యాన్ని అతడికి అందించి కూడా వడులుతుందేమోగానీ వన్నె తరగదు. అందుకే  పందిరిమల్లె అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆ నేవళం, కాంతి కిరణం మీద పడితే సజీవత్వంతో మిలమిల మెరిసే నిగారింపు గుణం మల్లెపూవుకు  ఉన్నంతగా మరే పూవుకు లేదని ఉద్దేశ్యం .’’ 

రెండు రోజులుండి వాడిపోయే పువ్వు పట్ల  కూడా నీకు ఇంత సున్నితమైన సునిశితమైన భావుకత ఉండబట్టే బంగారంలాంటి అపురూప సౌందర్యరాశి మా సిస్టర్ నీకు దొరికిందిరా.  నువ్వు భర్త కావడం ఆమె అదృష్టం. ready to enjoy హ్యాపీ మూమెంట్స్’’ అంటూ అతన్ని భుజం తట్టి  వెళ్ళిపోయారు వాళ్ళు.

స్నేహితులు ఎంతో కష్టపడి పందిరి మంచం  చుట్టూ దట్టంగా వేలాడ దీసిన మల్లెల మాలలను  రెండు చేతులతోనూ యశోద భుజాల మీద పడేలా ముందుకు వేశాడు చంద్రశేఖర్.

‘’ నీకు మల్లెలు అంటే ఇష్టమేనా  యశూ...’’  

యశోద ఆల్చిప్పల్లాంటి  కళ్ళు పైకెత్తింది. ఒత్తైన  విల్లు లాంటి కంటిపాపల  మధ్య నుంచి సంధించిన బాణంలా వెలువడిన ఆమె కంటి చూపు ఔవునన్న  భావాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. గదులో  ఫ్యాను గాలికి అటూ ఇటూ తిరుగుతున్న క్యాలెండర్లో, బాల కృష్ణుని చేతిలోని వెన్నుపూసంత  నిర్మలమైన స్వచ్ఛమైనతెల్లదనాన్ని సంతరించుకున్న యశోద కళ్లను అతను ముద్దాడాడు  పెదవులతో.

ఆమె తొలిసారి పూర్తి చేయబడిన వీనలా  కంపించింది, ఒక్క క్షణం అతని మెత్తని పెదవుల ఒత్తిడికి.

 ఆమె భుజాల మీద వేసిన తన చేతులను క్రమంగా కిందకి జార్చుతూ, వెనుకగా   ఆమె దాచుకున్న చేతుల  మణికట్టు దగ్గర పట్టుకుని ముందుకు తీసి చూసి  ఉలిక్కిపడ్డాడు.

 ఆమె రెండు చేతులు నిండా గోరింటాకు.

 కుడి అరచేతిలో ‘యశోదచంద్ర’ అని ఎడమ అరచేతిలో ‘ఆయామ్ యువర్స్’ అని వ్రాసి అందమైన ఫినిషింగ్ తో చూడముచ్చటగా ఉంది.

 అప్పటికి చాలా సేపు అయ్యింది కాబోలు తడారిపోయి ఉన్నాయి కోమలంగా నాజూకుగా ఉన్న ఆమె చేతి వేళ్ళు. ఆడవారి చేతి వేళ్ళని లేడీ ఫింగర్స్ అని ఎందుకు పోల్చాతో  అపుడే అర్ధమైంది చంద్రశేఖర్కి.

 అయితే మొదటి సారి అంత దగ్గరగా భర్త పేరుతో జీవితంలోకి ప్రవేశించిన కొద్ది క్షణాలకే ఏ రకమైన శక్తి ఈ ప్రపంచంలో అందించని తాపపు  వెచ్చదనంతో తనను చుంబించి తన్మయత్వంలో ముంచి,   తద్వారా గుండె వేగాన్ని రక్తపు ఉష్ణోగ్రతను  పెంచటం వలన తన చేతుల గోరింటాకు తడి ఆగిపోయిందని యశోద కు మాత్రమే తెలుసు.

‘’ఈవేళ మన శోభనం  అని తెలిసే గోరింటాకు పెట్టుకున్నావా?’’ అన్నాడతను నిస్సత్తువగా నిస్పృహ చెందుతూ. ఆమె తల అడ్డంగా ఊపింది.

“ మరి?’

‘’ మీకు మల్లెపువ్వులు అంటే ఎలా  ఇష్టమో నాకు గోరింటాకు అంటే అంత ఇష్టం. మీరు చొక్కా, బనీను  తీసేయండి. లేకపోతే మీ బట్టలన్నీ పాడైపోతాయి.’’

 ‘’మరి నీ బట్టలు  పాడవవా?’’

‘’ అది మీ చేతుల్లోనే ఉంది’’

‘’అంటే?’’

‘’ ఏమో నాకేం తెలుసు? బామ్మ ‘ నీ బట్టలు  ఏమాత్రం గోరింటాకు మరకలతో  పాడవకుండా చూసుకో. అలా గోరింటాకు చెదరకుండా శుభకార్యం జరిగితే  కుంకుమ పువ్వు లాంటి కూతురో,  దబ్బపండు లాంటి కొడుకొ  పుడతాడు’ అంది.’’

‘’ అంటే నా చాతుర్యానికి పరీక్ష అన్నమాట. అది సరే. గదిలోకి పాలతో పంపిస్తారు కదా... ఈ మజ్జిగ  పంపారు ఏమిటి మీ బామ్మగారు?’’ అడిగాడు చంద్రశేఖర్.

‘’ ఉష్ణం ఉష్ణేన శీతలం అట. పాలైతే వేడి చేస్తాయి. అసలే నిద్ర ఉండదు. అందుచేత శరీరపు చలువదనానికి ఒక సారి ఈ మజ్జిగ తాగి చూడమను. ఇక ఏ రాత్రి మీ ఆయన పాలు అడగడు మజ్జిగ  తప్ప’ అని బామ్మ  చెప్పిందండి.’’

       అతడు టీపాయ్ మీద గ్లాసు తీసుకుని యశోద పెదవులకు తాకించి  కొంచెం తాగించి ,  వెంటనే ఆమెను చూస్తూనే మిగతాది తాగాడు.

 జీవితంలో ఎన్నో సార్లు మజ్జిగ - దబ్బాకు వేసింది, పంచదార వేసి లస్సీ గా చేసింది, నిమ్మ మజ్జిగ,  ఆలా రకరకాల మజ్జిగ తాగాడు కానీ ఇంత అద్భుతమైన రుచి అతను ఏనాడు ఆస్వాదించలేదూ. కమ్మదనం, ఘాటు, పులుపు, కారం, కరివేపాకు సువాసన కలబోసిన మజ్జిగ తాగిన అతను సురాపానం చేసిన గంధర్వుడి లా ఉన్నాడు.

‘’ అసలు ఈ వేసవి కాలం పెళ్లిళ్లు ఎందుకు చేస్తారో తెలియదు. గదిలో ఫ్యాను విష్ణు చక్రం తిరుగుతూనే ఉన్నా ఎన్ని చెమటలు పడుతున్నాయో  చూసావా?’’

 అతను తన తెల్లని సిల్కు లాల్చీ తీసేసి లుంగచుట్టి  దూరంగా విసిరేశాడు. యశోద అతని మెడ కిందుగా చూసింది.

 ఈస్ట్ మన్ కలర్ దేహంలో కష్టించి పని చేయడంలోని ‘చేవ’ తెలిసినట్లుగా కండలు తిరిగిన అతని జబ్బాల  పైకి చూస్తే భుజాలు గుండ్రంగా నున్నగా మెరుస్తూ ఉంటే అయస్కాంతాన్ని చూస్తూనే అతుక్కుపోయే లోహపు లక్షణం కలిగినట్లే గా అయ్యింది యశోద మనసు.

‘’మరి బనీను?’’ అన్నట్టు చూసింది యశోద.

 అతను బనీను కూడా తీసేసాడు.  సింహాచలం సంపెంగ  రంగులో ఉన్న అతని విశాలమైన ఛాతి పై అందమైన పార్కులో తీరువుగా, చూస్తుంటేనే దిష్టి తగిలే విధంగా, అత్యంత శ్రద్ధతో పెంచినట్లు  ఉన్నాయి అతని వయసు పొగరును తమలో దాచుకున్న రోమాలు.

 పందిరి మంచం చుట్టూ కట్టిన పందిరిమల్లె దండలను మొదట్లోకి తుంచి తన శరీరం చుట్టూ చుట్టుకున్నాడు  అతను.

 ఆమె విస్మయంగా చూసి అడిగింది.’’ ఎందుకలా?’’

‘’ఈ గదిలో ఉన్న ప్రతి పుష్పం  మన సంగమానికి సాక్షిగా మిగలడం నాకు ఇష్టం లేదు. మన మధ్య అనురాగపూ  అనుభూతిని అవి కూడా పంచుకోవాలని’’ అతను కొంటెగా చూస్తూ అన్నాడు.

‘’ అదెలా?’’ విచిత్రంగా చెరుకు విల్లులాంటి  తీరైన కనుబొమ్మలు ఎగుర వేస్తూ అడిగింది  యశోద.

‘’ ఇలా ‘’అని చంద్రశేఖర్ సమాధానం నోటితో చెప్పలేదు.

 ఆమెను సున్నితంగా రెండు చేతుల మీదుగా ఎత్తుకుని మంచం దగ్గరకు రాగానే, ఆమె శిల్పి చేతిలో రూపం పోసుకుని జీవకళ ప్రతిష్ఠింప చేసుకునే బొమ్మలా, మెత్తని  పువ్వులు పరిచినా పానుపు పైకి  వెనక్కు నెమ్మదిగా వాలిపోయి గోరింటాకు చెదరకుండా రెండు చేతులు మంచానికి ఇరువైపులా చాచి, అర్ధ నీమీలిత నేత్రాలతో అతన్ని   గమనిస్తూ మనోచిత్రం లోని భావాలను మననం చేసుకోసాగింది. ఆ భావాలను నిజం చేస్తూ తనను చుట్టుముట్టిన ఒక్కొక్క మబ్బులు దాటుకుంటూ పూర్ణ చంద్రునిలా  ప్రకాసించడం కోసం ‘సంసార రధం’ పగ్గాలను చేతబూని  ప్రయాణించడానికి ఉద్యుక్తుడయ్యాడు చంద్రశేఖర్.

********

మరుసటి రోజు ఉదయం గది తలుపులు తెరుచుకుని బయటకు రాగానే బామ్మ యశోదను అడిగింది.

‘’ మీ ఆయన గెలిచాడా ఓడాడ? నిజం చెప్పవే యశూ.’’

‘’ నువ్వే చెప్పుకో’’ యశోద నిర్లక్ష్యంగా చూపు విసిరి అంది బామ్మ గారితో.

ఆమె యశోద రెండు చేతులూ తీసుకుని చూసింది.

‘’సగం గోరింటాకు పాముకు పోయినట్టుగా, కొంచెం ఎండిపోయినట్లుగా , మిగతాది రాలిపోయినట్టు గా ఉన్నాయి చేతులు.

 తన శరీరం అంతా కదిలి పకపకా నవ్వి అంది బామ్మ గారు.

 ‘’ఈ కాలం కుర్రాళ్ళకి దూకుడెక్కువ. ఆడ పిల్లలకు ఓపిక తక్కువ. చూడు తోటకూర కాడల ఎలా వాడిపోయావో? కళ్ళు చూడు... వాడిన కలువపూలల్లా ఎలా ఉన్నాయో? అయ్యో పిచ్చి పిల్లా. మా మొదటి రాత్రి నాడు మీ తాతగారు అయిన పాలన్నీ తాగేసి గుర్రు పెట్ట బోతుంటే మొహం మీద చెంబుడు నీళ్లు చల్లి తెల్లవార్లు నిద్రపోకుండా చేశాను తెలుసా. మా బామ్మ నాకు ఆలాంటి ట్రైనింగ్ ఇచ్చింది. హు. నువ్వు ఉన్నావ్ ఎందుకు?’’

‘’బామ్మా..నువ్వు ఏమన్నావ్? నా బట్టలు గోరింటాకు మరకలు కాకూడదు అన్నావ్... అవునా?’’

‘’ అవును’’

‘’ మరి నా బట్టలు ఎక్కడైనా గోరింటాకు మరకలయ్యాయేమో చూడు?’’ బామ్మ నిశితంగా పరిశీలించింది.

‘’ఔనే యశూ. ఒక్క గోరింటాకు మరక కూడా కాకుండా ఎలా మేనేజ్ చేశావే?’’ అని బుగ్గలు నొక్కుకుంది.

ఒరగా వేసిన గది తలుపు నెమ్మదిగా తీసి చూపుడు వేలుతో లోపలికి చూపించింది యశోద,

 చూసిన బామ్మగారు నిశ్చేష్టురాలై యశోద బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది మనవరాలి గడుసుదనానికి మురిసిపోతూ.

 మంచం చుట్టూ కట్టిన పందిరిమల్లె దండలన్నింటి మీదా బోర్లా పడుకుని గాఢనిద్రలో ఉన్న చంద్రశేఖర్ అనాచ్చాదిత వీపు నిండా, యశోద చేతుల గోరింటాకు అంటుకున్న ప్రతి చోట ఎర్రగా పండి వింతైన అందంతో గర్వంగా మెరుస్తున్నాయి - ప్రియురాలి చెక్కిలిని మునిపంటితో మృదువుగా కొరికిన ప్రియుడి పంటిగాట్లలా.

 *****

 అది మొదలు ప్రతి రాత్రి యశోద తన భర్త దగ్గర తాను ఉన్నంతవరకు ‘ఆ’ మజ్జిగ ఇవ్వడం అనేది దేవుని ముందు దీపారాధన చేసేంత పవిత్ర కార్యంగా భావించి చేసింది.

 నలభై వసంతాల కాపురంలో ముత్యాల్లాంటి ఇద్దరు బిడ్డలు. ఒక మగ - ఒక ఆడ, కలగడం. భగవంతుని కృప వల్ల రత్నాలవంటి తోడు వారికి దొరకడం, ఎవరి జీవితాలలో వారు స్థిరపడి సుఖంగా సంసారం చేసుకుంటూ సెలవులకు తమ తమ కుటుంబాలతో రిటైర్ అయిన ‘యశోద చంద్రశేఖర్ నివాస్’ కి వచ్చి సరదాగా సంతోషాలతో గడిపి వెళ్ళడం నిజంగా పూర్వజన్మ సుకృతమే అనుకుంటారా దంపతులు. నెల క్రితమే చంద్రశేఖర్ షష్టిపూర్తి కూడా ఎంతో ఘనంగా నిర్వహించి వెళ్లారు పిల్లలిద్దరూ.

మనుమలతో పాటు సమానంగా పరిగెత్తుతూ, క్రికెట్ ఆడుతూ, జాగింగ్ చేస్తూ నిత్యనూతన యవ్వనవంతుడిలా తాను ప్రవర్తించ గలుగుతున్నాడు అంటే అదంతా కేవలం యశోద ‘మజ్జిగ’ వలనే అని అతని విశ్వాసం.

పని అంతా పూర్తి చేసి వచ్చిన యశోద తమలపాకుల చిలకలతో ఐదు వెళ్ళు ముందుకు చాచే సరికి ఈ లోకం లోకి వచ్చాడు చంద్రశేఖర్.

ఈఊట్టు నెరిసినా, వయసు వచ్చినా కళ్ళ కింద నల్లని చారలు గాని, ముఖంలో ముడతలు గాని ఎక్కడ మచ్చుకైనా కనిపించని భర్త మొదటి రాత్రి ‘చంద్రశేఖర్’ అలాగే కనిపిస్తాడు యశోద కళ్ళకు.

‘’ యశోడా.. ఇన్నేళ్లు మన జీవితం ఇంత అపురూపమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది అంటే నీ వల్లనే.చచ్చి స్వర్గాన ఉన్న మీ బామ్మ గారి చలువ వల్లనే.  అయితే ఇన్నేళ్ళూ గోరింటాకు గుర్తులు అరచేతిలో చెరిగి పోయిన మరునాడే మళ్ళీ గోరింటాకు పెట్టేసుకుని నా ముందు మొదటి రాత్రి యశోదలాగే ఇన్నాళ్లూ నువ్వు నిలబడేదానివి. గోరింటాకు అంటే నీకు ఎందుకంత ఇష్టమో ఇప్పుడైనా చెబుతావా?”

 చంద్రశేఖర్ కుర్చీలోంచి లేచి ముందుకు వంగి అడిగాడు.

ఆమె వేళ్ళకున్న తమలపాకుల చిలకలను అందుకుంటున్న అతని మోకాళ్ళమీద తల ఆనించి చెప్పసాగింది యశోద.

‘’ ఇందులో దాచడానికి ఏముందండి?  ఆడపిల్లగా ప్రకృతి సహజమైన గోరింటాకు  అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. మన చుట్టూ ఎన్నో రకాల చెట్లు మొక్కలు ఉన్నాయి. మనం ఏ డిజైన్ లో పెట్టుకుంటే ఆ రకంగా మన చేతికి అందాన్ని సువాసన మిగిల్చి మరునాడు మట్టిలో కలిసిపోయే గోరింటాకు అంటే మొదట్లో జాలి వేసేది. మొదటి రాత్రి మన ఇద్దరికీ బామ్మ చేసిన బోధ, నాకు గోరింటాకు పెట్టి గదిలోకి పంపడం నన్ను బాగా ఆలోచింపచేసింది. మీ సహజీవనంలో నా భావాలకు ఒక అర్థం ఏర్పడింది. ఈ ప్రపంచంలో ఆలోచనా జ్ఞానం ఉన్న ఏ మానవుడికైనా, ఆలోచించలేని జంతువుకైనా ఆకలి, శారీరక వాంఛ ఒకటే విధంగానే ఉంటాయి. ఆలోచనా జ్ఞానం లేని జంతువులు ఋతు ధర్మాన్ని అనుసరించి బిడ్డలను కని తమ జాతిని అభివృద్ధి చేసుకుంటాయి. కానీ పద్మవ్యూహం లాంటిది జీవితం లో, అనుక్షణం ఎదుర్కునే సమస్యలకు ఒక పరిష్కారం వెతుక్కుంటూ మానవుడు మనుగడ సాగించాలంటే అతనికి పరిపూర్ణ ఆరోగ్యం అవసరం. యవ్వనం ఉన్నంతకాలం గోరింటాకు పెట్టుకున్న చేతుల్లా జీవితం రంగవల్లిలా గడిచిపోతుంది. కానీ యవ్వనం తగ్గి వృద్ధాప్యం లోకి అడుగుపెట్టక, గోరింటాకు తీశాక కూడా దాని సువాసన పోని చేతుల్లా ఆ యవ్వన అనుభవాల అనుభూతులు మనల్ని పునరుజ్జీవింప చేస్తాయి. మీ పందిరిమల్లెలు జీవిత పరమార్థాన్ని తెలుసుకునేందుకు సహకరిస్తే, నా గోరింటాకు ఆ జీవన పరమార్థపు తాత్వికతను అర్థం చేసుకునేందుకు ఉపకరించింది. అందుకే గోరింటాకు అంటే నాకు అంత ఇష్టం. కానీ.. కానీ.. ఈ మధ్యనే నన్ను ఒక అనుమానం వేధిస్తోంది.’’ ఆమె కళ్ళలో గిర్రున తిరిగి నిండు చూసి అతను నివ్వెరపోయాడు.

 ‘’యశోద. ఏమిటిది?’’ ఆతృతగా అడిగాడు ఆమె తల మీద చేయి వేసి.

‘’ అవునండి. ప్రతి రాత్రి మీకు ‘మజ్జిగ’ ఇచ్చి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ మీద పడి బలవంతంగా కాపురం చేయిస్తున్నానే. మీరు... మీరు... నన్ను ఎక్కడ ఒక శూర్పణఖ లాగా. ఓ హిడింబి లాగా, కామపిశాచి అనుకుంటారేమో అని భయం వేస్తోందండీ..’’

 నిండుగా ప్రవహిస్తున్న నది చెలియలికట్ట తేగినట్టుగా జలజలా కారుతున్న ఆమె అశ్రువులు చూస్తూనే కలవరి పోయాడు చంద్రశేఖర్.

‘’యశూ. ఈ వయసులో కూడా నేను ఇలా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాణతే అంటే కారణం ఎవరు? నువ్వు-నీ ప్రేమ. నా పట్ల నీ నమ్మకం నీ అనురాగం. భార్యాభర్తలు ఈ వయసులో కూడా పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యము ‘కాపురం’ అవసరం. నాకు ఆరోగ్యం, నీకు సౌభాగ్యం ఉన్నంత కాలం ఈ మార్గాన్నిఅనుసరించమనే ఆనాటి మీ బామ్మగారు చేసిన జీవన పాఠం. ప్రకృతి పురుషుల కలయిక ఉన్నంతకాలం ఆరోగ్యమైన సృష్టి జరుగుతుంది. అనవసరమైన అనుమానాలు మానేసి నేను చెప్పినట్టు విను.’’

 ఏమిటన్నట్టు చూసింది యశోద. ఆమె కన్నీటిని తుడిచి పడక కుర్చీకి తగిలించిన సంఛీ లోంచి పొట్లం తీసి విప్పాడు. అది పందిరి మల్లెల మాల. వెనక్కి తిరిగిన ఆమె సిగలో దానిని తురమగానే గానే ఆమె మజ్జిగ గ్లాసుతో పడకగదిలోకి నడిచింది.

 ఆ మల్లెల సువాసనను ఆఘ్రాణిస్తూ ఆమెను అనుసరించాడు అతను!!!

సమాప్తము