Maharaani Seetha Devi books and stories free download online pdf in Telugu

మహారాణి సీతాదేవి

ముగ్ధమనోహర రూపం.. సుందరమైన, సుసంపన్నమైన జీవితం.. విలాసవంతమైన జీవన విధానం ఈమె సొంతం. పూర్వాచార సంరక్షణలో భాగంగా సాంప్రదాయాలకు కట్టుబడి కట్టూ బొట్టులో నిండుగా, హుందాగా కనిపించే మహారాణులతో పోల్చితే ఈమెది ఎంతో భిన్నమైన జీవితం. ఆధునిక మహిళగా, ఆ కాలపు మహారాణిగా ఈమె జీవన శైలి అనన్య సామాన్యమైనది. అందికే ఈ మహారాణిని " ఇండియన్‌ వాలీ సింప్సన్ " గా కొనియాడారు. ఆమే పిఠాపురం మహారాజకుమారి సీతాదేవి.. మన తెలుగింటి ఆడబిడ్డ. విధి ఆడే నాటకం ఎంత వింతగా ఉంటుందో! మహారాజకుమారి సీతాదేవి అందుకు అతీతం ఏమీ కాలేదు.

పిఠాపురం చివరి సంస్థానాధీశుడు మహారాజా రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు బహద్దూర్, రాణి చిన్నమాంబాదేవి (మీర్జాపురం వారసురాలు)ల మూడో కూతురు సీతాదేవి. ఈమె 1917 మే 12న మద్రాసు అళ్వార్ పేటలోని మహారాజా సూర్యారావు రోడ్డు ముర్రేస్ గేట్ దగ్గరున్న డన్మోర్ హౌజ్‌లో జన్మించారు. 1935 వరకూ సీతాదేవి మహారాజకుమారి హోదాలో కొనసాగారు. ఆ తర్వాత సీతాదేవి తన పద్దెనిమిదవ ఏట ఉయ్యూరు జమీందారు ఎం.ఆర్. అప్పారావును వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఎం. విదుత్ కుమార్ అప్పారావు అనే కుమారుడు జన్మించాడు. మీర్జాపురవాసుల మనవరాలిగా, ఉయ్యూరు మహారాణిగా, జమీందారు పట్టపు మనిషిగా సీతాదేవి విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉండేవారు. అందులో భాగంగా ఆమె తరుచూ గుర్రపు పందేలకు హాజరయ్యేవారు.

1943లో సీతాదేవి జీవితంలో ఒక ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఏ పరిచయం ఏ మలుపునకు దారితీస్తుందో ఎవరికీ తెలియదు. సీతాదేవి జీవితంలో కూడా అలాంటి ఓ సంఘటనే అప్పుడు జరిగింది. సీతాదేవి ఎప్పటిలాగే చెన్నయ్‌లోని గిండీ రేస్ కోర్సుకు గుర్రాపు పందేలను వీక్షించడానికి వెళ్లారు. అక్కడ ఆమెను ప్రతాప్‌సింగ్ రావ్ గైక్వాడ్ చూశారు. ఆయన బరోడా (ప్రస్తుత గుజరాత్‌లోని వడోదరా) మహారాజు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన ఎనిమిది మంది మహారాజుల్లో గైక్వాడ్ ఒకరుగా అప్పట్లో ప్రసిద్ధి కెక్కారు. ఆయన దగ్గర ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వజ్రవైఢూర్యాలు, విలువైన ముత్యాలు, కెంపులు, రత్నాలు, హారాలు ఎన్నో ఉండేవి. అవి కలిగించిన ఆనందం కంటే ఎక్కువ ఇప్పుడు గైక్వాడ్ పొందారు. ఎందుకంటే ఓ ముగ్ధ మనోహర రూపం ఆయన మనసు దోచుకుంది. హృదయాన్ని కకావికలం చేసింది. ఆ సుందరమైన రూపం ఎవరిదో కాదు.. సీతాదేవిది.


ఆమె అందం, ఆహార్యం ఆయన్ని మంత్రముగ్ధుణ్ని చేసింది. ఆమె సౌందర్యం ఆయనకు అమితానందాన్ని కలిగించింది. ఆమెతో ప్రేమలో పడ్డాడు. సీతాదేవి కూడా ఆయన ప్రేమను అంగీకరించింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ అది అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే గైక్వాడ్‌కు అప్పటికే వివాహం అయింది. ఆయనకు కుమారులు కూడా కలిగారు. అయినా ఆయనకు అది పెద్ద సమస్య కాదు. ఇంకో విషయం ఏమిటంటే.. సీతాదేవికీ పెండ్లయింది. కుమారుడూ ఉన్నాడు. బరోడా రాజును చేసుకోవాలంటే హిందూ వివాహ చట్టం ఒప్పుకోదు. కానీ గైక్వాడ్ ఇవేవీ పట్టించుకునేలా లేడు. ఆయన మనసు మనసులో లేదు. ఎలాగైనా ఆ అపురూప సౌందర్యవతిని సొంతం చేసుకోవాలని ఆయన మనసు తహతహలాడసాగింది. మనసుంటే మార్గం ఉంటుంది. ఆ మనసు ఇప్పుడు మహారాజా వారు సీతాదేవికిచ్చారు. ఆ మనసు కోసం, ఆ మనిషి కోసం ఆయన ఏదైనా చేయాలనుకున్నారు. ఎంతవరకైనా వెళ్లాలనుకున్నారు. ఆ తపన, తాపత్రయమే మనసున మనసై దారి చూపించింది.

ప్రేమికులిద్దరూ వారి న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. వారు సీతాదేవిని ఇస్లాం మతంలోకి మారాలని సూచించారు. అలాచేస్తే జమీందారుతో ఆమె వివాహ బంధాన్ని భారతీయ వైవాహిక చట్టం ప్రకారం రద్దు చేసుకోవచ్చు. విడాకులూ తీసుకోవచ్చు. సీతాదేవి అలాగే చేసింది. ఆమె ఇస్లాం మతాన్ని స్వీకరించి తిరిగి ఆర్య సమాజ హక్కుల ప్రకారం హిందూమతానికి మారారు. 1943లో గైక్వాడ్ సీతాదేవిని హర్ హైనెస్ శ్రీమంత్ అఖండ్ సౌభాగ్యవతి సీతాదేవి సాహిబ్ గైక్వాడ్‌గా తన ద్వితీయ సతీమణిగా స్వీకరించారు.

ఈ వివాహం బ్రిటీష్ ఆధిపత్యానికి ఆగ్రహం కలిగించింది. ఇది బరోడా గైక్వాడ్‌ల వివాహ చట్టానికి విరుద్ధమని బ్రిటీష్ ప్రభుత్వం వాదించింది. బ్రిటీష్ వైశ్రాయి (న్యూ ఢిల్లీ) ఈ వివాహం విషయంలో గైక్వాడ్‌కు సమన్లు జారీ చేశారు. ఆ చట్టాలు తాము పాలించే ప్రజల కోసం, కానీ పాలకులమైన మా కోసం కాదు అని గైక్వాడ్ వాదించారు. వాదోపవాదాల అనంతరం గైక్వాడ్, సీతాదేవిల వివాహం బ్రిటీష్ ప్రభుత్వ అంగీకారం పొందింది. అయిప్పటికీ బ్రిటీష్ ప్రభుత్వం సీతాదేవి మహారాణిని హర్ హైనెస్‌గా వ్యవహరించడానికి అంగీకరించలేదు.

1945లో సీతాదేవి, గైక్వాడ్‌లకు ఒక కుమారుడు (మార్చి 8న) కలిగాడు. కుమారుని పేరు సాయాజీ రావ్ గైక్వాడ్. సీతాదేవికి కొడుకంటే అత్యంత ప్రీతి. ముద్దుగా అతన్ని ప్రిన్సీ అని పిలుచుకునేవారు. బరోడా రాజ్య కట్టుబాట్లు, బ్రిటీష్ ఆధిపత్యపు ఆంక్షల వల్ల రాణీ సీతాదేవి హద్దులు లేని స్వేచ్ఛా జీవితాన్ని కాంక్షించారు. గైక్వాడ్‌తో తనదైన ప్రేమైక జీవనంలో, అనంతమైన ఆనంద సామ్రాజ్యంలో విహరించాలనుకున్నారు. అందుకోసం గైక్వాడ్ దంపతులు తరచూ విదేశీ యానం చేస్తుండేవారు. అలా 1946లో గైక్వాడ్ సీతాదేవిని యూరప్ యాత్రకు తీసుకుని వెళ్లారు. వారి ఆ విదేశీ యాత్ర లక్ష్యం భారతదేశానికి బయట నివసించడానికి అనువైన ప్రదేశాన్ని అన్వేషించడమే. వారికి ఆ ప్రదేశం దొరికింది. రెండో ప్రపంచ యుద్ధ ఛాయలు లేని ప్రశాంత స్వతంత్ర రాజ్యం మొనాకో అందుకు అనువైన ప్రాంతంగా ఎంచుకున్నారు. అక్కడి మాంటే కార్లోలో తమ రెండో నివాసం కోసం భవంతి(Mansion)ని తీసుకుని, పరివారాన్నీ రప్పించీ మహారాణి శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నారు. సీతాదేవి, ఆమె కుమారునికి మొనాకో రాకుమారుడు ప్రిన్స్ రైనర్ పౌరసత్వం కూడా ఇచ్చాడు. ప్రపంచంలోనే సంపన్నులైన వారిలో ఒకరైన గైక్వాడ్ భార్యగా మహారాణీ తమ దేశంలో ఉండడం తమకెంతో గర్వకారణం అని రైనర్ పొగిడాడట.

బరోడా నుంచి గైక్వాడ్, మహారాణి నివాసానికి తరచుగా వెళ్లి బస చేసేవారు. ఆయన తన పర్యటన సమయంలో బరోడా నుండి విలువైన సంపదను మహారాణి కోసం మొనాకో తీసుకువెళ్లేవారు. ఆ సంపద అంతటికీ మహారాణే సంరక్షకురాలు. రెండో ప్రపంచ యుద్ధానంతరం గైక్వాడ్ దంపతులు తరచూ విదేశీ యాత్రలకు వెళ్తుండేవారు. అలా వారు రెండుసార్లు అమెరికాను సందర్శించారు. ఈ యాత్రల సమయంలో అనేక రకాల విలువైన, విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేసేవారు. ఇందుకోసం 10 మిలియన్ల అమెరికన్ డాలర్లు వెచ్చించారట. భారతీయ అడిటర్లు ఈ గణాంకాలను పరిశీలించి గైక్వాడ్ బరోడా ఖజానా నుండి వడ్డీ రహిత రుణాలు పెద్ద మొత్తంలో తీసుకున్నట్లు తేల్చారు. ఆ సొమ్మును తిరిగి ఇవ్వాలని భారత ఉన్నతాధికారులు కోరారు. ఇందుకు గైక్వాడ్ రాకుమారుడు తన రాజభరణం నుంచి 8 మిలియన్ల అమెరికన్ డాలర్లు పలు వాయిదాలలో చెల్లించడానికి అంగీకరించారు. సీతాదేవి కోసం గైక్వాడ్ బరోడా ఖజానా నుండి నిధులు పెద్ద మొత్తంలో మొరాకో తరలించింది వాస్తవమే అని అటు తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల తెలుస్తున్నది. అత్యంత విలువైన ఆభరణాలు, నాలుగు ముత్యాల తివాచీలు ఇందులో భాగంగా ఉన్నాయి. అమూల్యమైన బరోడా ముత్యాలతో చేసిన ఏడు వరుసల హారం, బ్రెజిలియన్ వజ్రాలతో చేసిన మూడు వరుసల హారం(25.760 గ్రాములు, 128.80 క్యారెట్ల దీనినే స్టార్ ఆఫ్ ది సౌత్ అంటారు), ఇంగ్లిష్ డ్రెస్డెన్ వజ్రం (15.706 గ్రాములు, 78.53 క్యారెట్స్) అందులో చాలా విలువైనవి. ఈ రాజకుటుంబ జంట విలువైన ఎంప్రెస్ యూగెనీ వజ్రాన్ని కూడా తమ సొంతం చేసుకుని ఉన్నారు.

వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చివరకు భారత ప్రభుత్వం గైక్వాడ్.. మన దేశానికి ద్రోహం చేశాడని, బరోడాను వంచించాడనే కారణంతో అతడిని రాజరిక పదవి నుంచి తొలగించింది. ఆ తర్వాత 1951లో గైక్వాడ్ మొదటి భార్య శాంతాదేవి కుమారునికి ఆ రాజరిక పదవీ బాధ్యతలు అప్పగించింది. అధికారికంగా సీతాదేవి, గైక్వాడ్ దంపతులు రాజరిక అధికారం కోల్పోయినప్పటికీ వారి బిరుదనామాలతో కొనసాగారు. ఆ హోదాతో సీతాదేవి అనేక అంతర్జాతీయ ఉత్సవాలకు హాజరవుతూ ఉండేవారు. అంతర్జాతీయ అతిథులకు ఆమె ఘనంగా అతిథి సత్కారాలు చేస్తుండేవారు. అటు తర్వాతే మహారాణికి ఆర్థికంగా కొంత కష్టకాలం మొదలైంది. దీంతో 1953లో మహారాణి తన విలువైన కంకణా(కాళ్ల పట్టీ)న్ని హ్యారీ విన్‌స్టన్ అనే ఆభరణాల కంపెనీకి విక్రయించింది. ఆ కంపెనీ విలువైన మరకతమణులు, వజ్రాల వ్యాపారంలో పేరెన్నికగలది. మహారాణి విక్రయించిన కంకణంలోని విలువైన స్టోన్స్‌తో హ్యారీ విన్‌స్టన్ ఒక అందమైన కంఠాహారాన్ని తయారుచేసింది. దాన్ని బ్రిటీష్ రాణి వాలిస్ సింప్సన్ (డచెస్ ఆఫ్ విండ్సర్) కొనుక్కున్నారు.

అమూల్యమైన బరోడా ముత్యాలతో తయారుచేయబడిన ఏడుపేటల ముత్యాల హారం, బ్రెజిలియన్ వజ్రాలతో చేయబడిన మూడుపేటల వజ్రాల హారం, ఇంగ్లీష్ డ్రెస్డెన్ వజ్రం అందులో భాగంగా ఉన్నాయి. రాజకుటుంబ జంట విలువైన ఎంప్రెస్ యూగెనీ వజ్రాన్ని స్వంతం చేసుకున్నారు. బరోడా స్వతంత్రభారతదేశంలో విలీనం చేయబడిన తరువాత భారతదేశ అధికారులు వాటిలో కొంతసంపదను స్వాధీనం చేసుకున్నారు.అయినప్పటికీ కొన్ని ఆభరణాలు, విలువైన వస్తువులు మహారాణి ఆధీనంలో ఉండిపోయాయి.

1957లో న్యూయార్క్‌లోని హోటల్ (Waldorf Astoria luxury hotel)లో జరిగిన ఒక అత్యున్నత ఉత్సవానికి వాలిస్ ఆ ఆభరణాన్ని ధరించి వెళ్లారు. ఆ ఉత్సవానికి మహారాణి సీతాదేవి కూడా హాజరయ్యారు. బాల్ నృత్యంలో వాలిస్ ధరించిన ఆ ఆభరణాన్ని చూసి వేడుకకు హాజరైన వారందరూ అద్భుతంగా ఉందని తెగ పొగిడారు. అది విన్న సీతాదేవి ఆ ఆభరణంలోని విలువైన రాళ్లు ఒకప్పుడు నా పాదాలపై మరింత అందంగా ఉండేవి అని అవహేళనగా మాట్లాడారట. సీతాదేవి మాటలకు కలత చెందిన వాలిస్ వెంటనే ఆ ఆభరణాన్ని తిరిగి హ్యారీ విన్‌స్టన్‌కు ఇచ్చేసింది. అప్పటి నుంచే సీతాదేవిని ఇండియన్ వాలిస్ సింప్సన్ అని పిలుస్తుండేవారు. కారణాలు తెలియదు కానీ.. 1956లో సీతాదేవి తన రెండో భర్త, బరోడా మహారాజు గైక్వాడ్‌కు కూడా విడాకులు ఇచ్చింది. ఆయన ఆ తర్వాత లండన్‌కు మకాం మార్చాడు. వివాహ రద్దు తరువాత కూడా సీతాదేవి తన బిరుదును కొనసాగించింది. మహారాణికి కార్లు అంటే అమితమైన ఆసక్తి. మెర్సిడెస్ కంపెనీ డబ్ల్యూ 126 మోడల్ కార్‌ను ఆమె ఇష్టం మేరకు కస్టమైజ్ చేసి ఇచ్చిందట.

ఆమె కోసం వాన్ క్లెఫ్ అండ్ అర్పల్స్ అనే అంతర్జాతీయ సంస్థ బంగారంతో టంగ్ క్లీనర్ తయారు చేసి ఇచ్చిందట. సీతాదేవికి పారిస్‌లో కూడా ఒక విలువైన అపార్ట్‌మెంట్ ఉండేది. ప్రపంచంలోనే అత్యున్నత, విలువైన ఫర్నీచర్ (Louis xvi furniture) తో ఆమె ఆ అపార్ట్‌మెంట్‌ను అందంగా, అమితంగా తీర్చిదిద్దుకుంది. అక్కడ కూడా అత్యున్నత స్థాయి జీవితాన్ని కొనసాగిస్తూ విలాసవంతమైన విందులు, వినోదాలను ఏర్పాటు చేస్తూ ఉండేది. ఆ పార్టీల్లో విలువైన మద్యం (Baron de Rothschild Bordeaux) కూడా ఉండేది. నమ్ముతారో లేదో.. మహారాణి సిగరెట్ పెట్టెపై కూడా అందమైన ముత్యాలు, కెంపులు పొదిగి ఉండేవట. మహారాణి వేలికి ఎప్పుడూ ఒక అద్భుతమైన నీలమణి (30-carat,6.0 g - sapphire - కుడిచేతి ఉంగరం) ఉండేది. ఆమె అదృష్టానికి అదే కారణం అని చాలామంది భావించేవారు. 1969లో అస్కాట్ గోల్డ్ కప్ (గుర్రెపు పందేలు) పోటీల సమయంలో మహారాణి తన నీలమణిని తాకి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండని పందెం రాయుళ్లను ఆహ్వానించిందట. అందుకే 1969లో సీతాదేవి, రాకుమారుడు ప్రిన్సీని ఫన్ కపుల్ అని ఎస్కైర్ మ్యాగజైన్ పేర్కొంది.

సీతాదేవి మొనాకో నుంచి పారిస్‌కు, పారిస్ నుంచి మొనాకోకు ప్రయాణించే సమయంలో ఆమెతో పాటు పే..ద్ద వార్డ్‌రోబ్, వందలాది విలువైన చీరెలు, వందల జతల పారిస్ షూస్, ఆభరణాలు వెంట తీసుకుని వెళ్లేది. పారిస్‌లోని ఆమె డ్రెస్సింగ్ రూమ్ వేలాది చీరలు, మ్యాచింగ్ షూస్, పర్సులతో అందంగా అమర్చి ఉండేది. మొన్సియర్ ఎరిగ్వా అనే సంస్థ మహారాణి కోసం శారీస్ అండ్ కో అనే ఫ్యాక్టరీని నెలకొల్ని ఆమె కోసం ఫ్రెంచ్ షిఫాన్ చీరలు తయారు చేస్తుండేది. అంత వైభవంగా జీవనం సాగిస్తున్న మహారాణి సంపద క్రమంగా క్షీణించసాగింది. దీంతో ఆమె తన విలువైన సంపదలో కొంత భాగాన్ని మెల్లమెల్లగా అమ్ముతూ వస్తుండేది. 1974లో ఆమె తనకు ఎంతో ఇష్టమైన ఆభరణాలను కూడా రహస్యంగా వేలం వేసింది.అప్పట్లో గన్ సెల్యూట్ ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వారికే మాత్రమే దక్కే గౌరవం. అలాంటిది మహారాణి సీతాదేవి ఏకంగా 101 సార్లు గన్ సెల్యూట్‌లను స్వీకరించింది. అంత వైభవంగా, ఘనంగా బతికిన సీతాదేవిని ఆమె ఎంతో అమితంగా ప్రేమించే కొడుకు ప్రిన్సీ ఆత్మహత్య తీవ్రంగా కృంగదీసింది. 1985 మే 8న మహారాణి సీతాదేవి కుమారుడు (40వ పుట్టిన రోజు తరువాత) ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రిన్సీ మద్యపానానికి, డ్రగ్స్‌కు బానిసై ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతారు. మహారాణి సీతాదేవి తన కొడుకు మరణించిన నాలుగు సంత్సరాల పాటు తీవ్ర మనోవేదన అనుభవించింది. చివరకు ఒంటరిగా కృంగి కృశించి 1989లో ఫిబ్రవరి 15న పారిస్‌లో మరణించారు.

72 ఏండ్ల వయసులో మరణించిన సీతాదేవి సుమారు 40 సంవత్సరాలకు పైగా అనన్య సామాన్యమైన జీవితాన్ని అనుభవించి.. చివరకు అంతులేని హృదయ వేదనతో ఈ లోకాన్ని విడిచారు. అంతర్జాతీయ జెట్ సెట్ సభ్యురాలిగా, ఇండియన్ వాలిస్ సింప్సన్‌గా ఘనకీర్తిని సంపాదించిన ఆధునిక మహారాణి సీతాదేవి మరణానంతరం వారసత్వ ఆస్తులను ఆమె అక్క కూతురు రాణి అనంగరేఖాదేవి (రాణి మంజులాదేవి కూతురు) పొందారు. రాణి మంజులాదేవి ఎవరో కాదు.. సీతాదేవికి స్వయానా అక్క. పిఠాపురం రాజా వారి పెద్ద కూతురు మంజులాదేవి సిద్ధి కుటుంబానికి చెందిన రాజా అజిత్ నారాయన్ దేవ్‌ను వివాహమాడారు. వీరి కూతురు అనంగరేఖాదేవి ప్రస్తుతం తన కుటుంబంతో అస్సొం గౌహతిలో నివసిస్తున్నారు. వీరి ఏకైక కుమారుడు విక్రంజిత్ బార్వా బాలీవుడ్‌కు చెందిన సుభాష్ ఘాయ్ మీడియా స్కూల్‌లో సినిమాటోగ్రఫీలో కోర్సు చేస్తున్నాడు. విక్రమ్‌జిత్ సినిమాటోగ్రఫీ చేసిన పానీ అనే హిందీ లఘు చిత్రం ఇటీవలే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రదర్శితమైంది.

1947 బరోడా స్వతంత్ర భారతదేశంలో విలీనం అయిన తరువాత భారతదేశ అధికారులు సీతాదేవి విలువైన సంపదలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె పేరున ఉన్న కొన్ని ఆభరణాలు, విలువైన వస్తువులు మహారాణి ఆధీనంలోనే ఉన్నాయి. ఆమె మరణించిన తరువాత అందులోని కొన్ని ఆభరణాలను, వస్తువులను అక్కడక్కడా కనుగొన్నారు. అత్యంత విలువైన ముత్యాల తివాచీని 1994లో జెనీవా వాల్ట్ బ్యాంక్‌లో కనుగొన్నారు. దీన్ని అటు తర్వాత అరబ్ రాజకుమారుడు 31 మిలియన్ల అమెరికన్ డాలర్లకు కొనుక్కున్నాడు. ప్రస్తుతం ఆ ముత్యాల తివాచీ దోహా (ఖతర్)లోని మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్‌లో ప్రదర్శనకు ఉంది. స్టార్ ఆఫ్ ది సౌత్‌తో పాటు ఇంకొన్ని ఆభరణాలు అమ్‌స్టర్‌డామ్‌లో ఉన్నాయి. మహారాణి వాడిన రోల్స్ రాయిస్ కారు ఇప్పటికీ బరోడా ఆయుధాగారంలో ఉంది. సీతాదేవి మరణించడానికి కొద్ది కాలం ముందు శారీస్ అండ్ కో కంపెనీకి ఆమె 260 చీరలు ఆర్డర్ ఇచ్చింది. అదే ఆ కంపెనీకి, ఆమెకిచ్చిన చివరి ఆర్డర్. ఆమె మరణానంతరం శారీస్ అండ్ కో మూతబడిందట.